Telangana Village Mysterious Deaths: విరూపాక్ష సినిమా చూశారా.. అందులో ఊళ్లో వాళ్లంతా ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు. దీంతో ఆ గ్రామంలో ఉన్న మత పెద్ద శాసనాల గ్రంధాన్ని తెరుస్తాడు. ఊరిలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తాడు. ఊరికి కీడు జరిగిందని.. ఊరంతా ఖాళీ చేయాలని చెబుతాడు. అదంతా సినిమా కాబట్టి.. కాస్త వాస్తవానికి దూరంగానే ఉంటుంది. కానీ నిజంగా ఇలాంటి సంఘటన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఇంతకీ ఈ సంఘటన ఏ గ్రామంలో జరిగింది.. అక్కడ ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.. వీటిపై ప్రత్యేక కథనం..
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామంలో గడిచిన 3 నెలలుగా వరుసగా 28 మంది చనిపోయారు. వివిధ కారణాలతో వారు చనిపోవడంతో గ్రామంలో ఆందోళన ఏర్పడింది. దీంతో గ్రామస్తులు తమ ఊరికి ఏదో కీడు సోకి ఉంటుందని బలంగా నమ్మారు. గ్రామదేవతలకు పూజలు చేశారు. అయినప్పటికీ మరణాలు ఆగలేదు. దీంతో స్థానికంగా ఉన్న ఓ పూజారిని కలిశారు. గ్రామంలో జరుగుతున్న పరిణామాలను అతని దృష్టికి తీసుకెళ్లారు.
అ పూజారి వారు చెప్పిన మాటలు మొత్తం విన్న తర్వాత.. ఒక కీలకమైన విషయాన్ని చెప్పాడు. గ్రామానికి కీడు సోకిందని.. గ్రామంలో ఉన్న వారంతా ఒకరోజు తమ తమ గృహాలను ఖాళీ చేయాలని.. పొలాల్లోకి వెళ్లి కీడు వంటలు చేసుకోవాలని చెప్పారు. దీంతో గ్రామస్తులు తెల్లవారుజామునే వారి వారి గృహాలకు తాళాలు వేశారు. డప్పు చాటింపు చేశారు. అందరూ కలిసి ముకుమ్మడిగా గ్రామం దాటి వెళ్లిపోయారు. తన పొలాల్లో కీడు వంటలు చేసుకొని.. పితృదేవతలకు పెట్టి.. ఆ తర్వాత భుజించారు. ఇలా చేస్తే తమ గ్రామానికి పట్టిన కీడు తొలగిపోతుందని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు.
మూడు నెలల్లో 28 మంది చనిపోవడంతో ఆ గ్రామంలో ఒక రకమైన ఆందోళన ఏర్పడింది. ఇందులో కొంతమంది అనారోగ్యంతో చనిపోయారు. మరి కొంతమంది రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. ఇంకొంతమంది బలవంతంగా ఆత్మహత్యలు చేసుకున్నారు.. 3 నెలల కాలంలోనే 28 మంది చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామస్తులు గ్రామ దేవతలకు పూజలు చేశారు. జంతువులను కూడా బలులు ఇచ్చారు. అయినప్పటికీ మరణ మృదంగం ఆగలేదు. అయితే ఇప్పుడు కీడు వంటలు చేసుకున్న నేపథ్యంలో.. తమ గ్రామానికి అంతా మంచే జరుగుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇకపై గ్రామంలో మరణ మృదంగం ఆగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
