Telangana Financial Crisis: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిపై కేంద్రానికి డౌట్ వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఖాజానా నిల్ అనడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గట్టిగానే సవాళ్లు చేశారు. కేంద్రం నిధులు ఇస్తున్న రాష్ట్ర ఖజానా ఖాళీ అంటున్న రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాయడం సంచలనమైంది. దీంతో నిజంగానే తెలంగాణ రాష్ట్ర ఖజానా నిల్ అయ్యిందా? అయితే రాహుల్ గాంధీకి 1000 కోట్లు ఇస్తానన్న రేవంత్ రెడ్డి వాటిని ఎలా చెల్లిస్తారన్న కిషన్ రెడ్డి మాట ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read: కెమెరా, బ్యాటరీ పర్ఫామెన్స్ మెరుగ్గా ఉండాలంటే ఈ ఫోన్ కొనాల్సిందే..
రాష్ట్ర ఖజానా ‘నిల్’ అంటూ రాజకీయ వేదికలపై వినిపిస్తున్న మాటలు ఇప్పుడు కొత్త కామెడీ ట్రాక్లా మారాయి. ఎన్నికల సమయంలో ఖజానా “ఫుల్”గా కనిపిస్తుంది. హామీల జాబితా చూస్తే అది మినీ బడ్జెట్ కాదు, మేగా బడ్జెట్ అన్నట్టు ఉంటుంది. కానీ అధికారంలోకి వచ్చాక అదే ఖజానా ఒక్కసారిగా “ఖాళీ మట్టి కుండ”గా మారిపోతుంది. ఇది ఆర్థిక శాస్త్రంలోని కొత్త సిద్ధాంతమా? లేక రాజకీయ శాస్త్రంలోని పాత మంత్రామా?
ఎన్నికల ముందు “ఆరు గ్యారెంటీలు – 420 హామీలు” అంటూ ప్రజలకు కలల కట్టడాలు చూపిస్తారు. ఓట్లు పడిన తర్వాత మాత్రం “ఖజానాలో లంకెబిందెలు లేవు” అని చెబుతారు. అయితే ఇదే సమయంలో మరో సభలో “అవసరమైతే వెయ్యి కోట్లు ఇస్తాం” అనే ధైర్యవాక్యాలు వినిపిస్తే… ప్రజలు ఏది నమ్మాలి? ఖజానా ఖాళీనా? లేక డైలాగ్లే ఫుల్గా ఉన్నాయా?
ఇది చూసి ప్రజలకు ఒక సందేహం రావడం సహజం.. ఖజానా ‘నిల్’ అయితే మాటల ఖజానా మాత్రం ‘అన్లిమిటెడ్’ ఎలా? రాజకీయాల్లో ఇది కొత్త గణితం కావచ్చు. 0 + 1000 = సభలో చప్పట్లు అన్న ఫార్ములా!
ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే… కేంద్రం నుంచి వచ్చిన నిధులు, రాష్ట్ర అప్పులు, బడ్జెట్ లెక్కలు.. ఇవన్నీ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలంటే శ్వేతపత్రం అవసరం అంటున్నారు. కానీ రాజకీయాల్లో శ్వేతపత్రం అంటే వాస్తవాల పుస్తకం కాదు, వాదాల పుస్తకంగా మారిపోతుంది. ఒక పార్టీ విడుదల చేస్తే అది “నిజాల గ్రంథం”; మరో పార్టీకి అది “అబద్ధాల సంకలనం”.
ఇక అప్పుల కథ కూడా సినిమాలా ఉంది. ఎవరు అధికారంలో ఉన్నా అప్పులు మాత్రం హీరోల్లా సీన్లో ఉంటాయి. “మేము తీసుకున్న అప్పులు అభివృద్ధి కోసం” అంటారు. “వాళ్లు తీసుకున్న అప్పులు దుర్వినియోగం” అంటారు. చివరకు ప్రజలకు మాత్రం ఈఎంఐలే మిగులుతాయి.. పన్నుల రూపంలో.
మొత్తానికి “రాష్ట్ర ఖజానా నిల్” అన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట కంటే “రాజకీయ నాటకం ఫుల్” అన్న మాట దగ్గరగా ఉందేమో అనిపిస్తోంది. ప్రజలు ఇప్పుడు ఒకే ప్రశ్న అడుగుతున్నారు. ఖజానా నిజంగానే ఖాళీనా? రేవంత్ రెడ్డి గారు… లేక రాజకీయ సంభాషణలే ఖాళీగా ఉన్నాయా?
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఓ శ్వేతపత్రం వస్తే బాగానే ఉంటుంది. ఎంతసేపు కేసీఆర్ ఖజానా ఖాళీ చేశాడనే బదులు.. మీరు అధికారంలోకి వచ్చాక ఏం చేశారన్నదే జనాలు చూస్తారు. అందుకే కేసీఆర్ ను కాదని మీకు ఓటు వేశారు. ఎందుకంటే సంఖ్యలు మాట్లాడితే వాదాలు తగ్గుతాయి. లెక్కలు బయటపెడితే నిజం బయటపడుతుంది. అప్పటివరకు మాత్రం సభల స్టేజీలపై ఖజానా ‘నిల్’ చప్పట్లు ‘ఫుల్’ అనే ట్రెండ్ కొనసాగుతుందేమో!