Telangana High Court: పవన్ కళ్యాణ్‌కు షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు.. డిప్యూటీ సీఎంకు దారేది?

తిరుమలలో లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందంటూ ఆ మధ్య దుమారం రేగింది. దాంతో ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా హిందువులు నిరసనలు తెలిపారు. కల్తీ నెయ్యి వాడకంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Written By: Srinivas, Updated On : October 22, 2024 12:57 pm

Pawan-Kalyan

Follow us on

Telangana High Court: తిరుమలలో లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందంటూ ఆ మధ్య దుమారం రేగింది. దాంతో ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా హిందువులు నిరసనలు తెలిపారు. కల్తీ నెయ్యి వాడకంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిందితులు ఎవరైనా వదిలిపెట్టొద్దంటూ డిమాండ్ చేశారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నెయ్యిలో కల్తీ జరిగినట్లుగా వెల్లడించారు. వైసీపీ హయాంలో తెప్పించిన నెయ్యిలో జంతువుల కొవ్వు నిర్ధారణ అయినట్లు ఎన్‌డీడీబీ కాల్ఫ్ ల్యాబ్ నిర్ధారించినట్లు తెలిపారు. లడ్డూలో సోయాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలు, చేప నూనె, జంతు కొవ్వు, పామాయిల్, పంది కొవ్వు కూడా వినియోగించినట్లుగా ల్యాబ్ నివేదిక ఇచ్చినట్లు వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా లడ్డూ అంశం పెద్ద దుమారం రేపింది. దాంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓ అడుగు ముందుకేసి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఆలయాలను శుద్ధి చేశారు. దేవుడా క్షమించు అంటూ వేడుకున్నారు. పవన్‌కు మద్దతుగా ఇటు తెలంగాణలోనూ ప్రాయశ్చిత్త దీక్షలు నిర్వహించారు. ఆలయాలనూ శుద్ధి చేశారు. చివరకు సుప్రీంకోర్టు తీర్పుతో ఈ వివాదం కాస్త చల్లబడింది. కల్తీ జరిగినట్లుగా టీటీడీ ఈవో ఎక్కడా నిర్ధారించలేదు. అటు ఏ ల్యాబ్ రిపోర్టుల్లోనూ వెల్లడికాలేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ వివాదాన్ని తేల్చేందుకు సుప్రీంకోర్టు సిట్‌ను ఏర్పాటు చేసింది. అయితే.. ఆ సిట్ ఇంకా ఏర్పాటు కావాల్సి ఉంది. ఐదుగురు సభ్యులతో కూడిన సిట్ ఏర్పాటై ఈ అంశంపై విచారణ చేయాల్సి ఉంది. సిట్ విచారణ , ఇచ్చిన నివేదిక ఆధారంగానే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడింది లేనిది తేలనుంది. అప్పటి వరకు ఈ అంశంపై ఎవరూ మాట్లాడొద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది.

అయితే.. ఆ మధ్య మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్ అయోధ్యకు పంపించిన లడ్డూలపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యకు పంపించిన లడ్డూల్లోనూ కల్తీ జరిగిందని పదేపదే చెప్పుకొచ్చారు. కల్తీ జరిగిందని ఆయన దేనిని బేస్ చేసుకొని చెప్పారో ఎవరికీ తెలియదు. కల్తీకి సంబంధించి ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటనేది కూడా స్పష్టత లేదు. దీంతో రామారావు అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఆధారంగా తెలంగాణ హైకోర్టు పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 22నఆయన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే.. ఆయన కోర్టుకు హాజరవుతారా..? ఆయన సమయం ఏమైనా అడుగుతారా..? అన్నది ఇప్పుడు ఆసక్తి నెలకొంది. అయోధ్యకు పంపిన లడ్డూల్లో కల్తీ జరిగిందన్న దానికి పవన్ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటో తెలపాలని బాధితుడు పిటిషన్‌లో పేర్కొన్నాడు. అయితే.. గతంలోనూ పవన్ కల్యాణ్ ఏపీ వాలంటీర్లపై ఇదే తరహా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళల అక్రమ రవాణాకు వాలంటీర్లు కారణం అవుతున్నారని ఆరోపించారు. 30వేల మంది మహిళలు ఏపీ నుంచి మిస్ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.