Telangana Heatwave: తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది. ఎండలు తీవ్రత అలానే ఉంది. ఆపై వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. అయితే తెలంగాణలో వర్షం జాడలేదు. ఏపీలో మాత్రం ఎండలు దంచి కొడుతున్నాయి సాయంత్రం వరకు.. తరువాత వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుండడం విశేషం. అయితే తెలంగాణ మాత్రం నిప్పుల కొలిమిగా మారుతోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే 47 డిగ్రీలు దాటుతోంది. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ అలానే ఉంది. దీంతో ప్రజలు ఆపసోపాలు పడాల్సి వస్తోంది. ఏపీలో కూడా అదే తీవ్రతతో ఎండలు కాస్తున్నా.. వర్షాలు కురుస్తుండడం మాత్రం కాస్త ఉపశమనం కలిగించే విషయం.
* చాలా చోట్ల వర్షాలు..
ఏపీలో చాలా ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం వర్షం పడింది. విశాఖ నగరవ్యాప్తంగా వర్షం పడగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. నెల్లూరు నగరంలో కూడా వర్షం పడింది. ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షం పడింది. దీంతో ప్రజలు సేదతీరారు. అనంతపురం జిల్లాలో కూడా వర్షం పడింది. ఈదురుగాలులకు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. అనంతపురం, శ్రీ సత్య సాయి, కడప, చిత్తూరు జిల్లాలో ఈరోజు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం తో పాటు విజయనగరం, పార్వతీపురం మన్యంలో సైతం ఉరుములతో కూడిన వర్షం పడవచ్చని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది.
* ఎండల తీవ్రత అధికం
..
మరోవైపు ఏపీవ్యాప్తంగా ఎండల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది. నిన్న 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది కొన్ని ప్రాంతాల్లో.. ఈరోజు ఏపీలో 48 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. శుక్రవారం 13 జిల్లాల పరిధిలోని 67 మండలాల్లో 42 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రత నమోదయింది. ఈరోజు 13 మండలాల్లో తీవ్రవడగాలులు, 221 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. అయితే వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులు పడే అవకాశం ఉంది. అందుకే రైతులు, రైతు కూలీలు, పశువుల పెంపకం దారులు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది. వర్షం పడే సమయంలో చెట్ల కింద, స్తంభాల వద్ద నిల్చో వద్దని సూచిస్తోంది. అయితే తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో కాస్త ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు అవుతుండడం గమనార్హం.
