HomeతెలంగాణTelangana BJP: ఇలాగైతే తెలంగాణలో బిజెపికి అధికారం కష్టమే..

Telangana BJP: ఇలాగైతే తెలంగాణలో బిజెపికి అధికారం కష్టమే..

Telangana BJP: ఒక్క విమర్శకు సరైన సమాధానం లభించడం లేదు. కనీసం ఆత్మరక్షణకు కూడా పాల్పడే అవకాశం కూడా కనిపించడం లేదు. అంత వీక్ అయిపోయారా.. గట్టిగా వాయిస్ కూడా వినిపించలేకపోతున్నారా.. ఇలా ఎందుకు ఉండిపోతున్నారు.. ఇలా ఎందుకు అయిపోతున్నారు.. ఇదిగో ఇలానే సాగుతోంది బిజెపి నాయకుల గురించి తెలంగాణలో చర్చ.

8 మంది ఎంపీలు

2024 ఎన్నికల్లో బిజెపి తెలంగాణలో సత్తా చాటింది. ఏకంగా 8 స్థానాలు గెలుచుకుంది. ఈ స్థాయిలో స్థానాలు సాధించి.. రెండు సెంట్రల్ మినిస్టర్ పోస్టులు అందుకొని.. తిరుగులేని స్థితిలో ఉండాల్సిన కమలం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఇబ్బంది పడుతూ ఉండడం ఆవేదన కలిగిస్తోంది.. ముఖ్యంగా ఇటీవల కాలంలో మెట్రో లోన్ కు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసిన ప్రశ్నలకు ఇంతవరకు కిషన్ రెడ్డి నుంచి సరైన స్థాయిలో సమాధానం లభించలేదు. మెట్రో కు సంబంధించి రుణం మంజూరు కాకపోవడానికి కిషన్ రెడ్డి నే కారణమని రేవంత్ ఆరోపిస్తున్నారు. ఇటీవల అనేక సందర్భాలలో రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి మీద విమర్శలు చేశారు. కిషన్ రెడ్డి ఏదో ఊకదంపుడు విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి.. అలా మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు. అంతేతప్ప తెలంగాణ ముఖ్యమంత్రి విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోయారు.

మిగతావారు కూడా

కిషన్ రెడ్డి మీద విమర్శలు వస్తే ఆయన మాత్రమే సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి.. కనీసం మిగతా ఎంపీలు గాని.. ఇతర నాయకులు గాని కిషన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి తీరును విమర్శించలేదు. బిజెపి పార్టీ సోషల్ మీడియా కూడా అదే నిర్లక్ష్యంతో ఉంది. కనీసం వివరాలతో.. గణాంకాలతో కౌంటర్ ఇవ్వలేదు. బిజెపి నేతలు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరుతో తెలంగాణ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. 8 మంది ఎంపీలు ఉండి కనీసం.. గట్టిగా కౌంటర్ కూడా ఇవ్వలేరా అంటూ ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ బిజెపి నేతల వ్యవహార శైలి ఎవరికి వారు అన్నట్టుగానే ఉంది. గతంలో బండి సంజయ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఆయనను మార్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పరిస్థితి దారుణంగా మారిపోయింది. నేతలు ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారు. ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు లేదా విమర్శలు ఎదురైనప్పుడు సమిష్టిగా వాటికి కౌంటర్ ఇవ్వడం లేదు.. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేయడంలో ఇక్కడి నాయకులు విఫలమయ్యారు అని చెప్పుకోవచ్చు.. అందువల్లే రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

బండి సంజయ్ కొడుకు ఎపిసోడ్ లో కూడా బిజెపి నేతలు పెద్దగా స్పందించింది లేదు. పైగా కొంతమంది నాయకులు మీడియాకు లీకులు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. దీనికి తోడు రేవంత్ రెడ్డి పదే పదే కిషన్ రెడ్డిని ఉద్దేశించి భారత రాష్ట్ర సమితికి బినామీ లాగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు తెలివిగా సమాధానం చెప్పడంలో కిషన్ రెడ్డి విఫలమవుతున్నారు.. అందువల్లే తెలంగాణ రాష్ట్రంలో బిజెపి స్థాయి రోజురోజుకు పడిపోతుంది. ఈటెల రాజేందర్ పెద్దగా కనిపించడం లేదు. డీకే అరుణ సైలెంట్ గా ఉండిపోయారు. బండి సంజయ్ కేవలం కరీంనగర్ పార్లమెంటు స్థానానికి మాత్రమే పరిమితమయ్యారు.. కిషన్ రెడ్డి అప్పుడప్పుడు తన మీద విమర్శలు వచ్చినప్పుడు విలేకరుల సమావేశం పెడుతూ వెళ్ళిపోతున్నారు. ధర్మపురి అరవింద్.. రఘునందన్ రావు.. ఇలా ఎవరి బౌండరీలో వారు ఉన్నారు. అందువల్లే రేవంత్ రెడ్డి తెలంగాణలో బిజెపిని చెడుగుడు ఆడుకుంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version