BJP introspection: తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఫిబ్రవరి 11న ఎన్నికలు జరిగాయి. 13న కౌంటింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 2,569 వార్డుల్లో 1,530 స్థానాలు గెలిచి పట్టణ రాజకీయాల్లో బలం చాటుకుంది. కార్పొరేషన్లలో 140 సీట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇక బీఆర్ఎస్ 781 వార్డులు, కార్పొరేషన్లలో 53 మాత్రమే గెలిచి ద్వితీయ స్థానంలో ఉంది. జాతీయ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 245 వార్డులు, కార్పొరేషన్లలో 66 డివిజన్లు గెలిచింది. అయితే గతంతో పోలిస్తే బీజేపీ సీట్లు గణనీయంగా తగ్గాయి. ఎంపీలు, ఎమ్మెల్యే సీట్లు పెరిగినా.. ఆ తర్వాత జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బలం తగ్గడం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
హంగ్ మున్సిపాలిటీల సవాల్..
ఇక మున్సిపల్ ఎన్నికల్లో 26 మున్సిపాలిటీల్లో ఎలాంటి పార్టీకీ మెజారిటీ లేకపోవడంతో స్వతంత్రులు, వామపక్షులు కీలకం. కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు సాధించేందుకు కొఆప్షన్ వ్యూహాలు రూపొందిస్తోంది. కాంగ్రెస్ పంచాయతీ విజయాల తర్వాత పట్టణాల్లో కూడా బలపడింది. బీఆర్ఎస్ పట్టణ ప్రజల అసంతృప్తికి గురై చతికిలబడింది. బీజేపీకి ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రాంతాల్లో (ఆదిలాబాద్, కామారెడ్డి) మెరుగైన ఫలితాలు వచ్చినా, మొత్తంగా తగ్గుదల. భైంసాలో రెబెల్స్ విజయం పార్టీ అంతర్గత సమస్యలను తెలియజేస్తోంది.
పట్టణ ఓటర్లు స్థానిక సమస్యలు పరిష్కరించే అభ్యర్థులకు ప్రాధాన్యం ఇచ్చారు. కేంద్రం పంచాయతీలకు, మున్సిపాలిటీలకు నేరుగా నిధులు ఇస్తున్నా.. బీజేపీని ఆదరించలేదు. బీజేపీని జాతీయ పార్టీగా, దేశ ఱక్షణ పార్టీగానే తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. స్థానిక సమస్యలు పరిష్కరించే పార్టీగా భావించడం లేదు. ఈ విషయపై బీజేపీ దృష్టి పెట్టాలి. బీజేపీ బలం తగ్గడం తెలంగాణతోపాటు, దేశ విషయాలపై ప్రజల అభిప్రాయాన్ని సూచిస్తుంది.