Revanth Reddy : తెలంగాణను ఇటీవల భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఇండ్లు, పంటలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రాణాలు సైతం పోయాయి. చరిత్రలో ఎన్నడూ లేనవిధంగా ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల పరిధిలో వర్షాలు పడడంతో భారీ ఎత్తున నష్టం సంభవించింది. రూ.పది వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం చెప్పింది. అయితే.. ఈ నష్టాన్ని చూసేందుకు కేంద్రం నుంచి కూడా బృందాలు వచ్చాయి. కేంద్ర మంత్రి ఏరియాల్ సర్వే చేశారు. నిన్న రెండు బృందాలు వచ్చాయి. ఒక బృందం ఖమ్మంలో, మరో బృందం మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించింది.
ఇదే క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రంలో జరిగిన నష్టం గురించి వివరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలువనున్నారని తెలుస్తోంది. వారిని కలిసి రాష్ట్రంలో జరిగిన వరద బీభత్సాన్ని వివరించనున్నారు. అలాగే.. ఆస్తి, ప్రాణ, పంట నష్టలపైనా కేంద్ర ప్రభుత్వం పెద్దలకు వివరించి సాయం కోరనున్నారు. కేంద్రం తరఫున నిధులు ఇచ్చి ఆదుకోవాలని, ఏపీతోపాటు తెలంగాణకూ ఒకేవిధమైన సహాయం ప్రకటించాలని విజ్ఞప్తి చేయనున్నారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పెద్దలను సైతం కలవబోతున్నారు. సీఎంతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లారు. అయితే..ఈ పర్యటనలో సీఎం, మంత్రి పొన్నంతోపాటే కొత్తగా నియామకం అయిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ కూడా ఉన్నారు. ఆయన కూడా తొలిసారి పీసీసీ చీఫ్ హోదాలో ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలను మర్యాదపూర్వకంగా కలవనున్నారు.
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనాయకురాలు సోనియాగాంధీలను రేవంత్, మహేశ్ ఈ రోజు సాయంత్రమే కలువనున్నారు. ఇప్పటికే పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పోస్టులపై క్లారిటీ రాగా.. వారి నియామకం కూడా పూర్తయింది. దాంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. గత డిసెంబర్ 7న రేవంత్ రెడ్డితో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరో ఆరుగురిని కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా హోం మంత్రిత్వ శాఖ, మున్సిపల్, విద్య, మైనింగ్తోపాటు పలు కీలక పోర్ట్పోలియోలు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆ ఆరుగురి పేర్లను ఫైనల్ చేసేందుకు పార్టీ పెద్దలతో కీలక చర్చలు చేయబోతున్నారు. ఒకవేళ ఈ రోజు సాయంత్రం వరకు క్లారిటీ రాకుంటే రేపు సైతం ఢిల్లీలోని ఉండి ఫైనల్ చేయనున్నారు. ఇప్పటికే మంత్రివర్గంలో చోటు కోసం చాలా మంది తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆ ఆరు పేర్లలో ఎవరెవరు ఉంటారా అని ఉత్కంఠగా మారింది.
Chai Muchhata is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read More