Rains in Telangana : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. మధ్య తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మాత్రమే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నేడు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ పేర్కొంది.
మరో ఐదు రోజులు వానలే..
ఇంకా ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది తాజాగా ప్రకటించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేయగా, మిగతా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధికారయంత్రాంగం అప్రమత్తమై ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తుంది.
రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బలగాలు..
క్షేత్రస్థాయిలో ఎన్డీఆర్ఎఫ్ బలగాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. శుక్రవారం ఉదయం కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబ్ నగర్ జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. శనివారం ఉదయం వరకు కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు కొత్తగూడెం జిల్లాలో అతి భారీవర్షాలు పడతాయని పేర్కొంది. కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్నగర్, హన్మకొండ, భువనగిరి జిల్లాలలో భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాల కారణంగా వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. గోదావరికి వరద పోటెత్తుతోంది. దీంతో భద్రాచలం వద్ద నీటిమట్టం 43 అడుగులకు చేరింది. దీంతో దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నీటి మట్టం 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు.
ఆలయాల్లోకి నీరు..
ఇక గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ పరిసరాల్లోకి వరద నీరు చేరింది. ప్రస్తుతం పాపికొండలు విహారయాత్రను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. మంజీరా నది ఉ«ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఏడుపాయల అమ్మవారి ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. ఈ కారణంగా అమ్మవారి దర్శనాలను ఆలయ సిబ్బంది నిలిపివేశారు. శుక్ర, శనివారాల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో నదలు మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశ ఉంది. దీంతో పోలీస్ శాఖ కూడా అలర్ట్ అయింది. నదుల వద్దకు ప్రజలు వెల్లకుండా, వంతెనల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తోంది.