Heavy Rains.. Exams Cancelled : తెలంగాణలో మూడు రోజులుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో పలు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. రోడ్లపై వాహనాలు నడవాలన్నా ఎంతో కష్టంగా ఉంది. వర్షాల కారణంగా గురువారం ఉదయం రెండు రోజులు పాటు విద్యాసంస్థలకు సెలు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. సాయంత్రం మళ్లీ సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ పరిధిలో శుక్ర, శనివారాలు కూడా విద్యాసంస్థలతోపాటు, ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రకటించారు.
దంచి కొడుతున్న వానలు..
తెలంగాణలో మొన్నటి వరకు ఎండలు దంచికొట్టాయి. వారం రోజుల నుంచి వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. ఇక మూడు రోజులు నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు కాలనీలు పూర్తిగా జలమయం అయ్యాయి.. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షం నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు గురువారం, శుక్రవారం సెలవు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
పరీక్షలు వాయిదా..
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు రోజుల పాటు జూనియర్ కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. దీంతో రాష్ట్రంలో జరగవలసిన పరీక్షలు సైతం వాయిదా పడ్డాయి. వర్షాల కారణంగా అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రకటించింది. వాస్తవానికి గురువారం, శుక్రవారం పరీక్షలు జరగాల్సి ఉంది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లో కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు జరుగుతున్నాయి. వరుసగా కురుసున్న వర్షాల కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలో పరీక్షల రీ షెడ్యూల్ తేదీలను త్వరలో వెల్లడిస్తామని యూనివర్సిటీ ప్రకటించింది. ఉస్మానియా యనివర్సిటీ కూడా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. పరీక్ష రీషెడ్యూల్ను ఓయూ వెబ్సైట్లో పోస్ట్ చేస్తామని తెలిపింది.
మరో మూడు రోజులు వానలు..
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో గురువారం సాయంత్రం పరిస్థితిని సీఎం కేసీఆర్ మరోమారు సమీక్షించారు. మరోవైపు హైదరాబాద్లో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో విద్యాసంస్థలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకూ మరో రెండు రోజులు(శుక్ర, శని) సెలవులు ప్రకటించారు. ప్రైవేటు సంస్థలు కూడా సెలవు ఇచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అయితే సెలవులు జీహెచ్ఎంసీతోపాటు రాష్ట్రమంతా వర్తిస్థాయని కొంతమంది పేర్కొంటున్నారు. మొత్తంగా వర్షాల కారణంగా వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చినట్లుయింది.