HomeతెలంగాణPeddapalli MP Ticket : ఆ నేతకు బీజేపీ షాక్.. ఎంపీ టికెట్ క్యాన్సిల్!?

Peddapalli MP Ticket : ఆ నేతకు బీజేపీ షాక్.. ఎంపీ టికెట్ క్యాన్సిల్!?

Peddapalli MP Ticket : తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారం మొదలు పెట్టిన బీజేపీ ఈసారి 10 నుంచి 12 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారం మొదలు పెట్టింది. అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఏప్రిల్‌ 20 తర్వాత జాతీయ నాయకులు కూడా ప్రచారానికి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు కమలనాథులు. ఈ తరుణంలో బీజేపీ టికెట్లు ప్రకటించిన అభ్యర్థుల్లో కోవర్ట్‌ను గుర్తించింది. ఎంతో నమ్మకంతో పార్టీ టికెట్‌ ఇస్తే.. ప్రచారం చేయకుండా మిన్నకున్న అభ్యర్థిని మార్చాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.

ఎవరా కోవర్టు?
పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ఇటీవలే కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన గోమాస శ్రీనివాస్‌ను ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర సమితిలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన గోమాస శ్రీనివాస్‌ తర్వాత టీడీపీలో, బీఎస్పీలో పనిచేశారు. మొన్నటి వరకు కాంగ్రెస్‌లో ఉన్నారు. కాంగ్రెస్‌ ఎంపీ టికెట్‌ గడ్డం వంశీకి ఇస్తుందని తెలియడంతో బీజేపీలో చేరారు. వెంటనే బీజేపీ అధిష్టానం కూడా నమ్మకంతో టికెట్‌ ఇచ్చింది.

ప్రచారానికి దూరం..
బీజేపీ టికెట్‌ ప్రకటించి దాదాపు 20 రోజులు దాటింది. చాలా మంది టికెట్‌ ప్రకటించక ముందునుంచే తమ నియోజకవర్గాల్లో ప్రచారం మొదలు పెట్టారు. అయితే పెద్దపల్లి అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌ మాత్రం టికెట్‌ ఇచ్చినా పెద్దగా ప్రచారం చేయడం లేదు. మొక్కుబడిగా చిన్నచిన్న సమావేశాలకే పరిమితమవుతున్నారు. దీంతో బీజేపీ అధిష్టానం గోమాస తీరుపై దృష్టిపెట్టింది.

గతంలో ప్యాకేజీ తీసుకున్నట్లు ఆరోపణలు..
గోమాస శ్రీనివాస్‌ 2009 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 2009లో టీఆర్‌ఎస్‌ టికెట్‌పై పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2014లో టీడీపీ టికెట్‌పై పోటీ చేశారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. చెన్నూర్‌ ఎమ్మెల్యేగా కూడా పోటీచేశారు. అయితే ఆయన ఎన్నికల్లో ప్యాకేజీ కోసమే పోటీ చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. పార్టీల నుంచి టికెట్‌ తెచ్చుకుని తర్వాత ప్రత్యర్థుల నుంచి ప్యాకేజీ తీసుకుంటారని గతంలో ఆరోపణలు వచ్చాయి. గతంలో బీజేపీ ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వగా, ఆయన గడ్డం వివేక్‌ నుంచి ప్యాకేజీ తీసుకుని ఆయన గెలుపునకు సహకరించినట్లు ప్రచారం జరిగింది. ఇందుకు కాలు జారి పడినట్లు సాకు చూపారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన బ్యాక్‌గ్రౌండ్‌ తెలుసుకోకుండా హడావుడిగా ఎంపీ టికెట్‌ ఇచ్చిన బీజేపీ ఇప్పుడు పునరాలోచనలో పడింది.

బీజేపీతో టచ్‌లో వెంకటేశ్‌ నేత?
గోమాస తీరుపై అనుమానంతో ఉన్న బీజేపీ ఇప్పుడు మరో అభ్యర్థి కోసం వేట సాగిస్తోంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ నుంచి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్‌ ఎంపీ వెంకటేశ్‌ నేత కాషాయ నేతలకు టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ టికెట్‌ వస్తుందన్న ఆశతో బీఆర్‌ఎస్‌ నుంచి హస్తం తీర్థం పుచ్చుకున్న వెంకటేశ్‌ నేతకు కాంగ్రెస్‌ పార్టీ హ్యాండ్‌ ఇచ్చింది. దీంతో ఆయన పార్టీతో అంటీ ముట‍్టనట్లు ఉంటున్నారు. ఈ క్రమంలో బీజేపీతో టచ్‌లోకి వెళ్లారు. కమలం నేతలు కూడా అభ‍్యర్థిని మార్చే ఆలోచనలో ఉండడంతో వెంకటేశ్‌ నేతను పార్టీలో చేర్చుకుని టికెట్‌ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు చకచకా మార్పులు జరుగుతున్నట్లు సమాచారం.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version