Medaram Jatara 2024: ఆన్‌లైన్‌లో మేడారం మొక్కులు.. ఇంట్లో నుంచే చెల్లించుకునే ఛాన్స్‌!

మేడారం వెళ్లలేని, వెళ్లడం వీలుకాని భక్తులు ఇప్పుడు ఇంట్లో నుంచే తమ మొక్కును చెల్లించుకోవచ్చు. ఎత్తు బంగారం(బెల్లం) మొక్కు చెల్లించుకునేందుకు టియాప్‌ ఫోలియో, మీ సేవ, పోస్టాఫీస్‌ ద్వారా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

Written By: Raj Shekar, Updated On : February 8, 2024 8:50 am
Follow us on

Medaram Jatara 2024: వన దేవతలు సమ్మక్క – సాలరమ్మ జాతకు మేడారం సిద్ధమైంద. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు ఉంది. ఈ జాతరకు భారీగా భక్తులు తరలివస్తారు. ఇప్పటికే నిత్యం లక్షకు పైగా భక్తులు మేడారం వెళ్లొస్తున్నారు. రెండేళ్లకోసారి జరిగే ఈసారి ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రూ.100 కోట్లకుపైగా ఖర్చుచేసి ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఏర్పాట్లను మంత్రి సీతక్క స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

కోటి మంది వచ్చే అవకాశం..
ఈసారి మేడారం జాతరకు కోటి మందికిపైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మేడారం అనగానే అందరికీ గుర్తొచ్చేది బంగారం(బెల్లం). జాతరకు వెళ్లే భక్తుల్లో 60 శాతం మంది నిలువెత్తు బంగారం అమ్మవారికి సమర్పిస్తారు. అయితే వివిధ కారణాలతో కొందరు జాతరకు వెళ్లలేని పరిస్థితిలో ఉంటారు. దీంతో అమ్మవారి మొక్కు చెల్లించుకోలేకపోతున్నామే అని బాధపడుతుంటారు. వారికోసం ఈసారి దేవాదాయ శాఖ ఆన్‌లైన్‌ సేవలను ప్రవేశపెట్టింది.

ఇంట్లో నుంచే మొక్కులు..
మేడారం వెళ్లలేని, వెళ్లడం వీలుకాని భక్తులు ఇప్పుడు ఇంట్లో నుంచే తమ మొక్కును చెల్లించుకోవచ్చు. ఎత్తు బంగారం(బెల్లం) మొక్కు చెల్లించుకునేందుకు టియాప్‌ ఫోలియో, మీ సేవ, పోస్టాఫీస్‌ ద్వారా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ముందుగా తాము ఎంత బరువు ఉన్నామో లెక్కించుకుని ఆ బరువుకు తగినట్లుగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం మేడారంలో బెల్లం కిలో ధరను రూ.60గా ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు తమ బరువును బట్టి డబ్బులు చెల్లించాలి. ఉదాహరణకు బరువు 60 కిలోలు ఉంటే కిలోకు రూ.60 చొప్పున రూ.3,600 చెల్లించాలి. మీసేవ, సర్వీస్ చార్జీలు అదనం. ఈ సేవలను జిల్లా మంత్రి కొండా సురేఖ బుధవారం ప్రారంభించారు.

పోస్టాఫీస్‌ ద్వారా ప్రసాదం..
ఇక మేడారం వెళ్లలేని భక్తులు పోస్టాఫీస్‌ ద్వారా వన దేవతల ప్రసాదం పొందే అవకాశం కూడా దేవాదాయ శాఖ కల్పిస్తోంది. ఇక మేడారం వెళ్లి నిలువెత్తు బంగారం సమర్పించేవారు తప్పకుండా ఆధార్‌ కార్డు తీసుకెళ్లాలి. అక్కడ బెల్లం కొనాలంటే ఆధార్‌ కార్డు జిరాక్స్‌ తప్పకుండా ఇవ్వాలని ఎక్సైజ్‌ అధికారులు సూచించారు.