Monkey : విషంతో తల్లి చనిపోయింది.. ఏడ్చి ఏడ్చి పిల్ల కూడా.. కలిచి వేస్తున్న దృశ్యాలు

ఒకప్పట్లాగా గుట్టలు లేవు.. వెనుకటి రోజుల మాదిరి చెట్టు పుట్టల్లేవ్. ఫలితంగా కోతులకు ఆవాసం లేకుండా పోయింది. నివాసం ఉండే ప్రాంతం దూరమైంది. అందువల్లే అవి ఉళ్ల మీద పడుతున్నాయి. గ్రామాలలో కిష్కింధకాండ చేపడుతున్నాయి. వాటి ఆగడాలు భరించలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కోతులను నివారించే మార్గం తెలియక నరకం చూస్తున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : October 8, 2024 7:59 pm

Mother Monkey died

Follow us on

Monkey : గత ప్రభుత్వం కోతుల సమస్యను పరిష్కరించేందుకు పండ్ల మొక్కలు పెంచుతామని హామీ ఇచ్చింది. ఆ హామీ గాలికి కొట్టుకుపోయింది. అయితే కోతుల బెడద వల్ల ఇబ్బంది పడుతున్న కొంతమంది వాటిని మట్టు పెట్టడానికి నిర్ణయించుకున్నారు. విషాహారం పెట్టి వాటిని చంపేశారు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగింది. సత్తుపల్లిలో సింగరేణి వై జంక్షన్ వద్ద కొంతమంది ఆహారంలో విషాన్ని కలిపి కోతులకు పెట్టారు. ఆ కోతులు కన్నుమూశాయి. సింగరేణి ప్రైవేట్ లారీ అసోసియేషన్ కార్యాలయం సమీపంలో గుంపులుగా పడి కోతులు చనిపోయాయి. అయితే ఈ సమాచారాన్ని కొంతమంది అటవీశాఖ అధికారులకు అందించారు. అయితే వారు సకాలంలో స్పందించకపోవడంతో కోతులు చనిపోయాయని స్థానికులు అంటున్నారు.. విషాహారం తిని దాదాపు 12 కోతులు చనిపోయాయి. అయితే ఇందులో ఒక 10 రోజుల క్రితం పుట్టిన ఒక కోతి తన తల్లి ప్రేమ కోసం తీవ్రంగా తాపత్రయపడింది. తన తల్లి కోతి పక్కన కూర్చొని లేపడం మొదలుపెట్టింది. ఎంతకీ తల్లి కోతి లేవకపోవడంతో పిల్ల కోతి తీవ్రంగా రోదించింది. ఆ తర్వాత అది కూడా కన్ను మూసింది. కోతులు ఒకదాని తర్వాత ఒకటి చనిపోవడంతో.. అవి పడుతున్న బాధను చూసి చాలామంది కన్నీటి పర్యంతమయ్యారు. కోతులు చనిపోవడంతో.. వాటిని చూడ్డానికి ఇతర ప్రాంతాల నుంచి కొన్ని కోతులు వచ్చాయి. ఈ క్రమంలో అవి చేసిన రోదనలతో ఆ ప్రాంతం మొత్తం దద్దరిల్లిపోయింది.

జంతు ప్రేమికుల ఆగ్రహం

ఈ ఘటన పై జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోతుల విషయంలో కొంతమంది విషాహారం పెట్టి వాటిని చంపేశారని.. ఇది క్షమార్హం కాదని చెబుతున్నారు..” కొంతమంది ఆహారంలో విషం కలిపి కోతులకు పెట్టారు. ఆ కోతులు ఆహారాన్ని తిని నురగ కక్కుతూ చనిపోయాయి. కోతులు తీవ్ర అస్వస్థతకు గురై గిలాగిలా కొట్టుకున్నాయి. ఫలితంగా 12 కోతులు చనిపోయాయి. ఇలా చనిపోయిన వాటిల్లో ఒక కోతికి పది రోజుల క్రితం జన్మించిన పిల్ల కోతి ఉంది. అయితే ఆ పిల్ల కోతి విషం కల్పిన ఆహారం తినలేదు. దీంతో ఆ తల్లి కోతి అలానే చనిపోయింది. దీంతో ఆ పిల్ల కోతి విషం తెలియక తన తల్లిని లేపడం మొదలుపెట్టింది. కానీ ఎంతకీ ఆ తల్లి కోతి లేవలేదు. ఇదే విషయాన్ని అటవీశాఖ అధికారులకు చెబితే వారు పట్టించుకోలేదు. ఒకవేళ వారు కనుక సకాలంలో స్పందించి ఉంటే కొన్ని కోతులైనా బతికి ఉండేవని” స్థానికులు అంటున్నారు. అయితే ఈ సంఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. కొంతమంది ఈ విషయాన్ని కేంద్ర అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు.