Lasya Nanditha tragedy: సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం ఆ కుటుంబంలో ఆనందాలు.. ఎటు చూసినా సంతోషాలు.. నియోజకవర్గ ప్రజల ఆశీర్వాద బలంతో ఆయన ఆ ప్రాంతంలో మకుటం లేని మహారాజు లాగా వెలుగొందేవారు. ప్రతిరోజు ఆయన ఇల్లు చిన్నపాటి అసెంబ్లీని తలపించేది. సమస్యల మీద వచ్చేవారు ఆయనను కలిసి వెళ్లేవారు. ఆయన అక్కడికక్కడే సమస్యలకు పరిష్కార మార్గం చూపించేవారు. అందువల్లే ఆయన ఆ నియోజకవర్గంలో వరుసగా విజయాలు సాధించారు. టిడిపిలో.. తర్వాత భారత రాష్ట్ర సమితిలో కీలక నాయకుడిగా ఎదిగారు. అంతటి స్థాయికి ఎదిగిన ఆయన సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం చనిపోయారు. దీంతో ఆయన కుటుంబం ఒక్కసారిగా కుదుపునకు గురైంది. ఆ విషాదమే ఆ కుటుంబాన్ని కుంగ తీసింది అనుకుంటే.. వరుస విషాదాలు మరింత అగాధంలోకి నెట్టి వేశాయి.
సికింద్రాబాద్ పరిధిలోని కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా సాయన్న ఉండేవారు. సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ తర్వాత ఆస్థానం నుంచి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా సాయన్న కుమార్తె లాస్య నందిత పోటీ చేశారు.. తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తానని నియోజకవర్గ ప్రజలకు హామీ ఇవ్వడంతో వారంతా నమ్మారు.. సాయన్న సానుభూతి కూడా ఆమెకు ఉపకరించింది. ఫలితంగా లాస్య నందిత విజయం సాధించారు.. సరిగ్గా ఏడాది క్రితం లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.. దీంతో ఆ కుటుంబం ఒకసారిగా షాక్ లోకి వెళ్ళిపోయింది.
సాయన్న చనిపోవడం.. లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ఆ కుటుంబం మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. నేపథ్యంలో సాయన్న భార్య గీత కూడా బుధవారం కన్నుమూశారు. గడిచిన మూడు సంవత్సరాలుగా ఆమె తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందారు.. చికిత్స పొందుతూ బుధవారం కనుమూశారు.. దీంతో సాయన్న కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది.. గడచిన మూడు సంవత్సరాలుగా ఆ కుటుంబంలో మూడు మరణాలు చోటు చేసుకోవడం అందరిని కలచి వేస్తోంది.
లాస్య నందిత చనిపోయిన తర్వాత కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గణేష్ విజయం సాధించారు.. లాస్య నందిత చనిపోయిన తర్వాత ప్రజల్లో సానుభూతి తమకు ఉపకరిస్తుందని గులాబీ పార్టీ నేతలు నమ్మారు. కానీ కంటోన్మెంట్ ఓటర్లు మరో విధంగా తీర్పు ఇచ్చారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది.