HomeతెలంగాణMalla Reddy: బీఆర్ఎస్ నేతలను అందుకే కాంగ్రెస్ లోకి పంపించాం.. బాంబు పేల్చిన మల్లారెడ్డి..

Malla Reddy: బీఆర్ఎస్ నేతలను అందుకే కాంగ్రెస్ లోకి పంపించాం.. బాంబు పేల్చిన మల్లారెడ్డి..

Malla Reddy: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు మాత్రమే పూర్తయ్యాయి. కానీ ఇంతలోనే మెజారిటీ స్థాయిలో మున్సిపాలిటీలు కాంగ్రెస్ చేతిలోకి వచ్చాయి. కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నుంచి మొదలు పెడితే.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వరకు గులాబీ జెండాను వదిలేసి మూడు రంగుల జెండాను చేతిలో పట్టుకున్నారు. వాస్తవానికి రాజకీయాలన్నాక అటువాళ్లు ఇటు, ఇటు వాళ్ళు అటు పోవడం సర్వసాధారణం. రాజకీయ నాయకులు అంటేనే అవకాశవాదులు కాబట్టి.. అవకాశం ఎటుంటే వారు అటువైపు ప్రయాణాలు సాగిస్తారు. ఇందులో ఎవర్ని ఎప్పుడూ తప్పు పట్టడానికి లేదు.. అయితే తెలంగాణ రాష్ట్రంలో మొన్నటిదాకా భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. ఆ పార్టీలో ఉన్న వాళ్లంతా వివిధ రకాల పదవులను అనుభవించారు. అధికారం కోల్పోయిన కొద్ది రోజులకే పార్టీ ఫిరాయించడం మొదలుపెట్టారు.

ఇలా నాయకులు పార్టీ మారడం పట్ల కెసిఆర్ నుంచి కేటీఆర్ వరకు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. పోయేవాళ్ళు పోతారు.. ఉండేవాళ్లు ఉంటారు. ఉన్న వాళ్ళనే మేము కాపాడుకుంటామని కెసిఆర్ చెబుతున్నారు. మరోవైపు పార్టీ మారి కాంగ్రెస్ లోకి వెళ్లినవారు.. భారత రాష్ట్ర సమితి పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. భారత రాష్ట్ర సమితిలో కుటుంబ పెత్తనం ఎక్కువైందని, అందులో ఉండలేక తాము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని చెబుతున్నారు. అయితే ఈ వలసలు తమతోనే ఆగిపోవని.. వచ్చే రోజుల్లో చాలా ఉంటాయని వారు వ్యాఖ్యానిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల ముందు ఇది ఒకరకంగా భారత రాష్ట్ర సమితికి ఇబ్బందే. అయితే నేతల వలసల ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది పార్లమెంట్ ఫలితాల తర్వాత తెలుస్తుంది.

కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో.. కార్మిక శాఖ మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డికి మామూలుగానే నోరు అదుపులో ఉండదు. మీడియాలో ఫేమస్ అయ్యేందుకు.. సోషల్ మీడియాలో చర్చ జరిగేందుకు ఏవేవో మాట్లాడుతుంటారు. అలానే కాంగ్రెస్ పార్టీలోకి భారత రాష్ట్ర సమితి కోవర్టులను పంపామని ఆయన వ్యాఖ్యానించారు. వారు మొత్తం భారత రాష్ట్ర సమితి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ” నా నియోజకవర్గ పరిధిలోని చాలా మున్సిపాలిటీలలో కార్పొరేటర్ లను కావాలని కాంగ్రెస్ పార్టీలోకి పంపించాను. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని భారత రాష్ట్ర సమితికి అనుకూలంగా పనిచేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీకి భారీగా సీట్లు వస్తాయి. అప్పుడు వారంతా మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని”మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. వాస్తవానికి భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో.. గులాబీ కోవర్టులు ఉండేవారని ప్రచారం జరిగేది. వారంతా కెసిఆర్ చెప్పినట్టు వినేవారని.. అందువల్లే కాంగ్రెస్ పార్టీ రెండు పర్యాయాలు అధికారానికి దూరమైందనే విమర్శలున్నాయి. సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మల్లారెడ్డి ఆ తరహా వ్యాఖ్యలు చేయడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version