CM Revanth Reddy: హైదరాబాద్ ఎల్బీ స్టేడియం ముగ్గురు ప్రజా నాయకులు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి వేదికైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 14 మంది, తెలంగాణలో ముగ్గురు ముఖ్యమంత్రులు ఇప్పటి వరకు ప్రమాణం చేశారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎల్బీ స్టేడియంలో ప్రమాణం చేసింది మాత్రము ముగ్గురే. మిగతావారు రాజ్భవన్లో ప్రమాణం చేశారు. ఎల్బీ స్టేడియం సెంటిమెంటుగా భావించి ప్రమాణం చేసిన ఆ ముగ్గురూ ప్రజల నుంచి, ప్రజాబలంలో వచ్చిన నేతలే.
నందమూరి తారకరామారావు..
1982లో తెలుగు దేశం పార్టీ స్థాపించి 9 నెలల్లోనే ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించారు. ‘నందమూరి తారక రామారావు అనే నేను’ అంటూ సరిగ్గా 40 ఏళ్ల క్రితం 1984 జనవరి 9న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఎల్బీ స్టేడియంలో ఎన్టీఆర్ విశేష జన సమూహం మధ్యలో ఏపీ సీఎంగా ప్రమాణం స్వీకారం చేశారు. తెలుగు వాడి ఆత్మగౌరవ నినాదంతో పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేసి ప్రజలకు చేరువయ్యారు. ప్రపంచంలో నేటికి ఏ పార్టీకి సాధ్యం కానంతగా పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి పాలిటిక్స్లో సంచలనం సృష్టించారు. ముఖ్యమంత్రిగా ఆయన తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాయనడంలో అతిశయోక్తి లేదు. తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థను ఎన్టీఆరే రద్దు చేశారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ఎన్టీఆరే ప్రారంభించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయనే ప్రారంభించారు. సింగిల్ విండో విధానం తెచ్చి రైతులకు సులభంగా రుణాలు లభించేలా చేశారు. ఏపీలో మునసబు, కరణాల వ్యవస్థను ఆయనే రద్దు చేశారు.
వైఎస్.రాజశేఖరరెడ్డి..
ఇక దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి కూడా ఏపీ ముఖ్యమంత్రిగా ఎల్బీ స్టేడియం వేదికగానే ప్రమాణం చేశారు. దాదాపు పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో అధికారికి దూరమై సుప్తచేతనావస్తలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సీఎల్పీ నేతగా రాజశేఖరరెడ్డి జీవం పోశారు. ప్రజాప్రస్థానం పేరుతో వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ప్రజలతో మమేకమై అనేక మసస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. దీంతో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఏపీలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చారు. అనంతరం సీఎల్పీ నేతగా ఎన్నికై మే 21న ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కూడా చరిత్రాత్మకమే. ఉచిత విద్యుత్ ఫైల్పైనే రాజశేఖరరెడ్డి తొలి సంతకం చేశారు. రుణమాఫీ చేశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్లు, పోడు భూములకు పట్టారు, 108, 104 అంబులెన్స్లు ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
తాజాగా రేవంత్రెడ్డి..
ఇక తాజాగా రాష్ట్ర విభజన తర్వాత మరోమారు కాంగ్రెస్ నేత ఎనుముల రేవంత్రెడ్డి ఎల్బీ స్టేడియం వేదికగా ప్రమాణం చేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ను ప్రజలు ఆదరించలేదు. దీంతో 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం పీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్రెడ్డి.. కాంగ్రెస్ బలోపేతానికి అహర్నిశలు కృషి చేశారు. పాదయాత్ర చేశారు. ఆయనకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అండగా నిలిచారు. ఆయన కూడా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేశారు. ఇలా కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్లో జవసత్వాలు నింపి 2023 ఎన్నికల్లో అధికారంలోకి తీసుకువచ్చారు. సీఎల్పీ నేతగా రేవంత్ ఎన్నికయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా భట్టిని ఎంపిక చేశారు. దీంతో ఇద్దరూ మరోమారు ఎల్బీ స్టేడియం వేదికగా ప్రమాణం చేశారు. అనంతరం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు మేరకు ఆరు గ్యారెంటీ స్కీంల ఫైల్పై రేవంత్రెడ్డి తొలి సంతకం చేశారు. ప్రజా నేతగా సీఎంగా ప్రమాణం చేసిన రేవంత్రెడ్డి పాలన ఎలా సాగిస్తారు. ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడతారో చూడాలి.