Kadiyam Srihari: భారత రాష్ట్ర సమితి తరఫున వరంగల్ పార్లమెంట్ స్థానానికి కడియం కావ్య పోటీ చేయబోనని చెప్పడం.. భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేయడం..కేసీఆర్ కు లేఖ రాయడం.. కడియం శ్రీహరి కూడా భారత రాష్ట్ర సమితికి దూరంగా ఉండడం.. ఈ పరిణామాలు భారత రాష్ట్ర సమితికి పార్లమెంటు ఎన్నికల ముందు పంటి కింద రాయి లాగా మారాయి. కావ్య రాసిన లేక ఎఫెక్ట్ తో భారత రాష్ట్ర సమితిలో ఒకరకంగా చెప్పాలంటే కల్లోలం ఏర్పడింది.. ఇది మిగతా అభ్యర్థులపై కూడా ప్రభావం చూపిస్తోంది. బయటికి చెప్పడానికి ఇష్టపడటం లేదు కానీ.. చాలామంది భారత రాష్ట్ర సమితి ఎంపీ అభ్యర్థులు అంతర్మథనంలో కొట్టుమిట్టాడుతున్నారు. భారత రాష్ట్ర సమితిలోనే ఇలా ఉంటే.. అధికార కాంగ్రెస్ లోనూ కడియం ఎఫెక్ట్ తీవ్రంగానే ఉంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పది స్థానాలు దక్కించుకుంది. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఏకంగా 5 ఎమ్మెల్యే స్థానాలను దక్కించుకుంది. దీంతో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈ నియోజకవర్గంలో తీవ్రంగా పోటీ ఏర్పడింది. గత ఏడాది చివరిలో కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు ఆహ్వానిస్తే వరంగల్ టికెట్ కోసం ఏకంగా 42 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. మీరు మాత్రమే కాకుండా మరో ఆరుగురు కూడా లైన్ లో ఉన్నారు. వీరందరి పేర్లను పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ.. రెండు నెలలుగా వారందరి జాబితాను వడపోసింది. చివరికి ఐదుగురు అభ్యర్థులతో తుది జాబితా సిద్ధం చేసింది. వీరిలో శనిగపురం ఇందిర, దొమ్మాటి సాంబయ్య, జన్ను పరంజ్యోతి, రాగ మల్ల పరమేశ్వర్, పెరుమాండ్ల రామకృష్ణ, బొడ్డు సునీత టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. వీరిలో ఎవరో ఒకరికి టికెట్ వస్తుందని అందరూ భావించారు. మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వరంగల్ అభ్యర్థి పేరును ఖరారు చేస్తుందని భావించారు.
పరిస్థితి ఇలా ఉండగానే ఒక్కసారిగా కడియం రాకతో సీన్ మారిపోయింది. కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయం కావడంతో ఆశావాహులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టికెట్ కోసం వారు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొంతమంది భారీగానే డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ సమావేశాలను పోటాపోటీగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం కావడంతో వీరందరిలో ఆందోళన నెలకొంది. “ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకలాపాలు నిర్వహించాం. భారీగా డబ్బు ఖర్చు పెట్టాం. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్నాం. వారికి ఎటువంటి కష్టం వచ్చినా దగ్గరుండి చూసుకున్నాం. తీరా టికెట్ వచ్చే క్రమంలో కొందరు నేతలు వలస వచ్చారు అలాంటి వారి వల్ల మాకు టికెట్ దక్కేది అనుమానంగా ఉంది. ఇలా అయితే కార్యకర్తల ముందు తల ఎలా ఎత్తుకోవాలి” అంటూ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కడియం రాక నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సరికొత్త తలనొప్పి మొదలైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ఆశావాహులు ముఖ్యమంత్రి కి తమ మొర వినిపించారు. అయితే వారికి రేవంత్ రెడ్డి ఎలాంటి హామీ ఇచ్చారనేది ప్రస్తుతానికి తెలియ రావడం లేదు.
మరోవైపు కడియం కావ్య రాజీనామాతో భారత రాష్ట్ర సమితి.. వరంగల్ పార్లమెంటు అభ్యర్థి అన్వేషణలో పడింది. కాంగ్రెస్ పార్టీ నుంచి కడియం కావ్య కు టికెట్ ఖరారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. బలమైన అభ్యర్థిని బరిలో నిలపాలని భావిస్తోంది. కావ్యకు టికెట్ ఇచ్చే ముందు ఉద్యమకారులకు వరంగల్ స్థానాన్ని కేటాయించాలని డిమాండ్ వ్యక్తమయింది. కావ్యకు టికెట్ కేటాయించడంతో ఆ డిమాండ్ మరుగున పడింది. కావ్య రాజీనామా చేయడంతో మరోసారి ఉద్యమకారులకు టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ వ్యక్తం అవుతుంది. తాజా పరిస్థితుల్లో మాజీ కార్పొరేటర్ డిన్నా, జోరిక రమేష్, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న పేర్లను భారత రాష్ట్ర సమితి అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను మళ్లీ భారత రాష్ట్ర సమితిలోకి ఆహ్వానిస్తారనే ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఆయన పార్టీలో చేరితే.. టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.