Etela Rajender : ఈటెల రాజేందర్ పెద్ద స్కెచ్.. అందుకే ఈ సంచలన అడుగులు.. వర్క్ అవుట్ అయితే ఎక్కడికో..

పార్టీలో ఈటల దూకుడు వెనుక భారీ స్కెచ్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఈటల రాజేందర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పార్టీ చీఫ్‌గా కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయన ఢిల్లీలోనే బిజీ అయిపోయారు. ఆయన కేంద్ర మంత్రి కావడంతో.. రాష్ట్ర చీఫ్ పదవి మరొకరికి ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధమైంది.

Written By: Srinivas, Updated On : September 30, 2024 5:01 pm

Etela Rajender

Follow us on

Etela Rajender :  తెలంగాణ ఉద్యమం నుంచి ఈటల రాజేందర్ పేరు తెలియని వారు లేరు. గతంలో స్టూడెంట్ లీడర్‌ అయిన ఈటల ఆ తరువాత ఉద్యమ పార్టీ టీఆర్ఎస్‌లో చేరి తన పోరాట పటిమను చాటారు. కేసీఆర్‌కు అండగా ఉంటూ.. రాష్ట్ర సాధన ఉద్యమంలో కీ రోల్ పోషించారు. ఒకవిధంగా చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తరువాత అంతటి లీడర్ అయ్యారు. అటు.. తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్ లోనూ తిరుగులేని నేతగా ఎదిగారు. ఎన్నిసార్లు ఎన్నికల్లో పోటీ చేసినా తిరుగులేని మెజార్టీతో విజయం సాధించారు. అలా హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలకు కూడా ఆయన అంత నమ్మకంతో ఉండడంతో బ్రహ్మరథం పట్టారు.

ఆ తరువాత కేసీఆర్‌తో వచ్చిన విభేదాలతో ఈటల పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ వెంటనే బీజేపీలో చేరారు. ఇక అప్పటి నుంచి ఉద్యమ పార్టీలో కొనసాగిన ఆయన.. ఆ తరువాత ఉద్యమ పార్టీపైనే పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక.. అప్పటి నుంచి బీజేపీలో ఆయన చాలా యాక్టివ్‌ అయ్యారు. హైకమాండ్ నుంచి కూడా ఆయనకు సపోర్టు లభించింది. దాంతో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఓ స్థాయిలో విరుచుకుపడ్డారు. అనూహ్య పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారం చేపట్టి కూడా పది నెలల కాలం అవుతోంది. అయితే.. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుంచే ఈటల ఆ ప్రభుత్వంపై విరుచుకుపడుతూనే ఉన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉన్నారు. అటు రైతుల రుణమాఫీ కానీ, రైతు భరోసా పైనా కానీ ప్రశ్నించారు.

పార్టీలో ఈటల దూకుడు వెనుక భారీ స్కెచ్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఈటల రాజేందర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పార్టీ చీఫ్‌గా కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయన ఢిల్లీలోనే బిజీ అయిపోయారు. ఆయన కేంద్ర మంత్రి కావడంతో.. రాష్ట్ర చీఫ్ పదవి మరొకరికి ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధమైంది. అయితే.. ఎప్పటి నుంచో బీజేపీ కొత్త చీఫ్ నియామకం రాబోతున్నారని ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ.. ఇంతవరకు ఎవరినీ నియమించలేదు.

మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. దాంతో ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడి నియామకం తప్పనిసరి అనే టాక్ నడుస్తోంది. అయితే.. రాష్ట్ర అధ్యక్షుడి పదవి కోసం పార్టీలోనూ పలువురు పోటీ పడుతున్నారు. ప్రధానంగా ఈటల రాజేందర్‌తోపాటు ధర్మపురి అరవింద్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ముందు వరుసలో ఉన్నారు. వీరే కాకుండా డీకే అరుణ, రఘునందన్ రావు పేర్లు సైతం వినిపిస్తున్నాయి. అయితే.. పార్టీ అధ్యక్ష పదవిపై కన్నేసిన ఈటల మాత్రం వీరికంటే ఎక్కువగా ప్రయత్నాల్లో ఉన్నారని టాక్ నడుస్తోంది. అందుకే నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటున్నారట. అలా ప్రజల్లో ఉంటేనే ప్లస్ అవుతుందని ఆయన నమ్మకం. అందుకే.. ఏ చిన్నపాటి సమావేశాలకైనా హాజరవుతున్నారు. కార్యకర్తలతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు. మరోవైపు.. ఇటు హైడ్రా కూల్చివేతలపైనా ఆయన స్పీడ్ పెంచారు. హైడ్రా కూల్చివేతలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కొత్తపేటలోని గణేశ్ నగర్‌లో ఎంపీ ఈటల రాజేందర్ ధర్నాకు కూడా దిగారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి బీసీ నేతను ఆ పార్టీ చీఫ్‌గా ప్రకటించింది. దీంతో బీజేపీకి కూడా బీసీ క్యాండిడేట్‌నే నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని పసిగట్టిన ఆయన అందుకే ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారని ప్రచారం. మొత్తానికి భారీ స్కెచ్‌తోనే ఈటల నిత్యం ప్రజల్లో ఉంటున్నారని సమాచారం.