BRS Party : డ్రైవర్‌ లెస్‌ ‘కారు’.. పయనం ఎటో తెలియని తీరు.. క్యాడర్‌ కకావికలం!

తెలంగాణను పదేళ్లు ఏలిన పార్టీ. 25 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ.. ఒక్కో మెట్టు ఎక్కుతూ తిరుగులేని శక్తిగా ఎదిగింది. కానీ, పెరుగుట.. విరుగుట కొరకే అన్నట్లు ఎంత స్పీడ్‌గా ఎదిగిందో.. అంతే స్పీడ్‌గా పతనం దిశగా పయనిస్తోంది. సారథిలేని బీఆర్‌ఎస్‌ కారు ఎటు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

Written By: Raj Shekar, Updated On : September 14, 2024 1:43 pm

BRS Party 

Follow us on

BRS Party  :  తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన పార్టీ అది. 2001లో పుట్టిన పార్టీ.. క్రమంగా ఎదుగుతూ.. స్థాపించిన 13 ఏళ్లకే.. లక్ష్యాన్ని చేరుకుంది. 2014లో తెలంగాణ రాష్ట్రం సాధించింది. తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో వరుసగా రెండుసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో విపక్ష టీడీపీని కనుమరుగు చేసింది. వైసీపీ లేకుండా చేసింది. కాంగ్రెస్‌ను బలహీనపర్చింది. దీంతో తక తెలంగాణకు తామే దిక్కు అన్నట్లుగా వ్యవహరించారు. అహంకార ధోరణితో పాలించారు. ప్రజలను బానిసల్లా చూశారు. ప్రశ్నించేవాడినే వేధించడం మొదలు పెట్టారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. నీళ్లు, నిధులు, నియామకాల అంశాన్నే పక్కన పడేశారు. దీంతో 2018 ఎన్నికల్లో ప్రజాస్వామ్యంలో అహంకారం పనికి రాదని ఓటర్లు తీర్పు ఇచ్చారు. గులాబీ పార్టీని కేవలం 39 సీట్లకు పరిమితం చేశారు. కాంగ్రెస్‌ పార్టీని 65 సీట్లతో అధికారం కట్టబెట్టారు. అధికారం కోల్పోవడాన్ని గులాబీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. కేసీఆర్‌ అయితే ప్రజల్లోకి రావడానికే ఇబ్బంది పడుతున్నారు. గడిచిన 10 నెలల్లో 8 నెలలు ఫాంహౌస్‌లోనే ఉన్నారు. ఇక ఇటీవలే జైలు నుంచి విడుదలైన కవిత బయటకు వచ్చే పరిస్థితి లేదు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అమెరికాలో గ్రీన్‌ కార్డు కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పార్టీని నడిపేవారు లేక.. క్యాడర్‌ కకావికలం అవుతోంది.

పద్ధతి లేని రాజకీయం..
తెలంగాణలో పద్దతి లేకుండా చేస్తున్న రాజకీయం చేస్తున్న గులాబీ పార్టీ ఇప్పుడు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇప్పటికే పార్టీలో ఉండలేక 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా పార్టీ మారారు. అనేక మంది నేతలు కూడా కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. అయినా పార్టీ నేతలు దూకుడు మాత్రం తగ్గించుకోవడం లేదు. ఈ క్రమంలో పీఏసీ చైర్మన్‌ అరికెపూడి గాంధీ నియామకం విషయంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దుందుడుకు తనం పార్టీకి మరింత ఇబ్బందిగా మారింది. హైదరాబాద్‌లోని సెటిలర్లను ఉద్దేశించి కౌశిక్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఈ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకుంటోంది.

కంట్రోల్‌ చేసే ప్రయత్నం..
కౌశిక్‌ రెడ్డి వ్యాఖ్యలతో జరిగిన నష్టాన్ని కంట్రోల్‌ చేసేందుకు మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన ప్రయత్నం ఫలించలేదు. గాంధీని ఇప్పుడు ఏమీ అనలేని పరిస్థితి బీఆర్‌ఎస్‌లో నెలకొంది. ప్రాంతీయ వాదాన్ని బీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చిందా లేక.. కౌశిక్‌రెడ్డి ఆవేశం కారణంగా జరిగిందా అనేది చెప్పాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ స్టాండ్‌ అయితే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. కౌశిక్‌రెడ్డి వ్యక్తిగతం అయితే వెంటనే అతడిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

అధినేత మౌనం..
రాష్ట్రంలో పార్టీ నేతలు దారి తప్పుతున్నా.. ఇష్టానుసారం మాట్లాడుతున్నా.. ప్రజల్లో పార్టీ ఇమేజ్‌ డ్యామేజీ అవుతున్నా.. గులాబీ బాస్‌ మాత్రం తనకేమీ పట్టనట్లు మౌనం వహిస్తున్నారు. ఫాంహౌస్‌ నుంచి బయటకు రావడం లేదు. కనీసం నోరు విప్పడం లేదు. దీంతో క్యాడర్‌లో ఆందోళన నెలకొంది. చివరకు కారును ఎక్కడ యాక్సిడెంట్‌ చేస్తారో అన్న ఆందోళన నేతల్లో కనిపిస్తోంది.