Balapur Laddu 2024: అప్పట్లో 450.. ఇప్పుడు కోటానుకోట్లు.. హైదరాబాద్ గణపతి లడ్డులకు ఎందుకింత క్రేజ్.. ఆ వేలం డబ్బులను ఏం చేస్తారు?

గణపతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన తర్వాత.. పార్వతీపుత్రుడిని గంగా యాత్రకు తీసుకెళుతున్న సమయాన.. స్వామి వారి చేతిలో పూజలు అందుకున్న లడ్డుకు వేలంపాట నిర్వహించడం ఆనవాయితీ.

Written By: Anabothula Bhaskar, Updated On : September 17, 2024 11:30 am

Balapur Laddu 2024

Follow us on

Balapur Laddu 2024: సరిగ్గా 30 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరంలోని బాలాపూర్ గణేష్ మండపం వద్ద లడ్డు వేలం పాట సరదాగా మొదలైంది. అప్పట్లో ఆ లడ్డును 450 రూపాయలకు మోహన్ రెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నారు. వాస్తవానికి ఆ రోజుల్లో 450 రూపాయలంటే చాలా ఎక్కువ మొత్తం. అదే ప్రాంతంలో నిరుడు వేలంపాట నిర్వహిస్తే ఏకంగా 27 లక్షలకు చేరుకుంది. కేవలం బాలాపూర్ మాత్రమే కాదు బండ్లగూడ కీర్తి విల్లాస్ రిచ్ మండ్ విల్లాస్ ప్రాంతంలో అయితే గత ఏడాది 1.20 కోట్ల ధర పలుకగా.. ఈసారి ఏకంగా 1.87 కోట్లకు ఒక భక్తుడు దక్కించుకున్నాడు. వాస్తవానికి ఈ వేలం సంస్కృతి బాలాపూర్, బండ్లగూడ ప్రాంతంలోనే కాదు అపార్ట్మెంట్ల పరిధిలో ఏర్పాటు చేస్తున్న మండపాలకు కూడా సోకింది. వేలంపాటలో స్థిరాస్తి వ్యాపారులు, ఫార్మా రంగానికి చెందినవారు, బడా వ్యాపారులు పాల్గొన్నారు. అందువల్లే గణపతి లడ్డు వేలను దాటి లక్షలను దాటి కోట్లకు చేరుకుంటున్నది. గణపతి లడ్డూను దక్కించుకుంటే మంచి జరుగుతుందనే విశ్వాసం.. వేలంలో ఎక్కువ ధరకు కొనుగోలు చేసుకుంటే అందరూ గుర్తిస్తారనే నమ్మకం.. ఇతర ప్రయోజనాలు ఉంటాయని భావన వల్ల చాలామంది ధర ఎంతైనా సరే వేలంలో లడ్డూను సొంతం చేసుకుంటున్నారు. లడ్డూను సొంతం చేసుకుంటే పరపతి పెరుగుతుందని భావిస్తున్నారు.

మూసాపేట ప్రాంతంలో

హైదరాబాదులోని మూసాపేట ప్రాంతంలో ఓ స్థిరాస్తి వ్యాపారి తొలిసారిగా గణపతి లడ్డును వేలంలో దక్కించుకున్నాడు. అంతకుముందు అతడు స్థిరాస్తి వ్యాపారంలో లేడు. లడ్డును దక్కించుకున్న తర్వాత స్థిరాస్తి వ్యాపారం లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత అతడు జాతకం పూర్తిగా మారిపోయింది. ఇక హైదరాబాదులోని ఫలానా ప్రాంతంలోని మండపంలో గణపతి లడ్డును దక్కించుకుంటే మరింత శుభం జరుగుతుందనే నమ్మకం భక్తుల్లో విపరీతంగా పెరిగిపోయింది. వాస్తవానికి గణపతి నవరాత్రి ఉత్సవాలు అంటే అందరికీ ఖైరతాబాద్ వినాయకుడు గుర్తుకొస్తాడు. కానీ ఇప్పుడు లడ్డు వేయడం అంటే బాలాపూర్ గణపతి మదిలో మెదులుతున్నాడు. బాలాపూర్ లడ్డు ను మించి బండ్లగూడ కీర్తి రిచ్ మండ్ విల్లాస్ గణపతి లడ్డు ధర పలుకుతోంది. ఈ ఏడాది నార్సింగ్ ప్రాంతంలోని మైహోం అవతార్ లో గణపతి లడ్డు 7. 51 లక్షలు పలికింది. గండిపేట మండలం ఖానాపూర్ గ్రామంలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణపతి లడ్డు 7.50 లక్షలు పలికింది. ఇక కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లో అయితే ఏకంగా 1.87 కోట్లు పలికింది. ఈ ప్రాంతాలలో వేలం వేసిన గణపతి లడ్డులు 21 కిలోల వరకు ఉన్నాయి.

దానికోసం ఖర్చు చేస్తున్నారు

బాలాపూర్ ప్రాంతంలో లడ్డును వేలం వేయగా వచ్చిన సొమ్ముతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేవాలయాల పునరుద్ధరణకు వెచ్చిస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీలలో వచ్చిన సొమ్మును అనాధ, వృద్ధాశ్రమాలకు అందిస్తున్నారు. మై హోమ్ విహంగ ప్రాంతంలో లడ్డును వేలం వేస్తే 5.3 లక్షలు వచ్చాయి. ఆ డబ్బులను ఓ అనాధాశ్రమంలో పిల్లల సంక్షేమం కోసం అందించారు.