HomeతెలంగాణTelangana Congress: రెడ్లు, ప్యారాచూట్లకు పెద్దపీట.. బీసీలకు మొండి చేయి.. అగ్రవర్ణ ‘హస్తం’..!

Telangana Congress: రెడ్లు, ప్యారాచూట్లకు పెద్దపీట.. బీసీలకు మొండి చేయి.. అగ్రవర్ణ ‘హస్తం’..!

Telangana Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ అభ్యర్థుల ప్రకటను కాంగ్రెస్‌ వేగవంతం చేసింది. అధికార బీఆర్‌ఎస్‌ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తోంది. అధికార పార్టీకి ప్రత్యామ్నాయం తామే అంటున్న కాంగ్రెస్‌ కూడా దూకుడు పెంచింది ఇందులో భాగంగా ఈనెల 15న ప్రకటించిన 55 స్థానాలకు తోడు కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం మరో 45 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో మొత్తం 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టయింది.

అగ్రవర్ణాలకు పెద్దపీట..
రెండో విడత జాబితాలో కాంగ్రెస్‌ అధిష్టానం అగ్రవర్ణాలకు చెందిన నేతలకు పెద్దపీట వేసింది. సీట్ల పరంగా చూస్తే బీసీలకు 8 స్థానాలు, ఎస్సీ, ఎస్టీలకు 8, మైనార్టీలకు ఒక స్థానాన్ని కేటాయించింది. ఇక ఓసీల్లో రెడ్డి సామాజిక వర్గానికి 21, వెలమలకు 2, బ్రాహ్మణులకు 1. కమ్మ సామాజిక వర్గానికి 3 టికెట్లను కేటాయించింది.

ప్యారాచూట్లకు ప్రాధాన్యం..
కాంగ్రెస్‌ రెండో జాబితాలో ఒక్క రోజు ముందు పార్టీలో చేరిన వారికి కూడా టిక్కెట్లు దక్కాయి. మొత్తంగా ఇటీవల పార్టీలో చేరిన వారే 20 స్థానాలు దక్కించుకున్నారు. గతంలో చాలా కాలం కాంగ్రెస్‌ పార్టీలో పనిచేసి, వివిధ కారణాలతో వేరే పార్టీల్లోకి వెళ్లి ఇటీవలే తిరిగి సొంతగూటికి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(మునుగోడు), కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి (భువన గిరి)లకు టికెట్లు కేటాయించారు. అలాగే ఇటీవలే పార్టీలోకి వచ్చిన బి.మనోహర్‌రెడ్డి (తాండూరు), శ్యాంనాయక్‌ (ఖానాపూర్‌), కంది శ్రీనివాస్‌రెడ్డి (ఆదిలాబాద్‌), యశశ్వనిరెడ్డి(పాలకుర్తి), రేవూరి ప్రకాశ్‌రెడ్డి (పరకాల), తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం), పొంగులేటి శ్రీనివాసరెడ్డి(పాలేరు), కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (మునుగోడు), బండి రమేష్‌(కూకట్పల్లి), జగదీశ్వర్‌గౌడ్‌ (శేరిలింగంపల్లి), నారాయణరావు పటేల్‌(ముధోల్‌), వొడితల ప్రణవ్‌ (హుజూరాబాద్‌), కస్తూరి నరేందర్‌ (రాజేంద్రనగర్‌), విజయారెడ్డి(ఖైరతాబాద్‌), యెన్నం రెడ్డి (మహబూబ్‌నగర్‌), మురళీ నాయక్‌ శ్రీనివాస్‌ (మహబూబాబాద్‌), పాయం వెంకటేశ్వర్లు (పిన పాక), కె.ఆర్‌.నాగరాజు (వర్ధన్నపేట)లకు అవకాశమిచ్చారు.

బల్మూరి, విష్ణుకు మొండిచేయి..
అనుబంధ సంఘాల అధ్యక్షులు శివసేనారెడ్డి (వనపర్తి), బల్మూరి వెంకట్‌ (హుజూరాబాద్‌)లకు పార్టీ అధిష్టానం మొండిచేయి చూపింది. మాజీ మంత్రి పీజేఆర్‌ కుటుంబానికి ఒక టికెట్‌తోనే సరిపెట్టింది. జూబ్లీహిల్స్‌ టికెట్ను పీజేఆర్‌ తనయుడు విష్ణు ఆశించినా అక్కడ మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ను ఎంపిక చేశారు. ఖైరతాబాద్‌ లో పీజేఆర్‌ కుమార్తె విజయారెడ్డికి అవకాశమిచ్చింది. వరంగల్‌ జిల్లాలో కొండా దంపతులిద్దరికీ టికెట్‌ వస్తుందని భావించినా వరంగల్‌ తూర్పులో సురేఖకే అవకాశం ఇచ్చింది. బీఆర్‌ఎస్‌ టికెట్‌ నిరాకరించడంతో పార్టీలో చేరిన ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ భర్త శ్యాంనాయక్‌కు ఆసిఫాబాద్‌ టికెట్‌ ఖరారు చేసింది. ఇక ఖానాపర్‌లో కుమురంభీం మనుమడు వెడ్మ బొజ్జుకు, నారాయణపేటలో చిట్టెం కుటుంబానికి చెందిన డాక్టర్‌ పర్ణికారెడ్డి, పాలకుర్తిలో ప్రవాసాం ధ్రురాలు హనుమాండ్ల ఝాన్సీ కోడలు యశశ్విని రెడ్డి (ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల్లో పిన్నవ యస్కురాలు (26))లకు అవకాశం కల్పించింది.

బీసీలకు 20 సీట్లే
కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన రెండు జాబితాల్లో కలిపి మొత్తం 20 స్థానాలే వెనుకబడిన వర్గాలకు చెందిన నేతలకు దక్కాయి. మొదటి జాబితాలో 12 మందికి ఇవ్వగా, ఈసారి 8 మందికి అవకాశం కల్పించారు. తాజాగా ప్రకటించిన లిస్టులో 3 గౌడ, 2 ముదిరాజ్, పద్మశాలి, ఆరె మరాఠీ, మున్నూరుకాపు సామాజికం వర్గానికి చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. మధు యాష్కీ, పొన్నం ప్రభాకర్, జగదీశ్వర్‌(గౌడ) కస్తూరి నరేందర్, వాకిటి శ్రీహరి (ముదిరాజ్‌), కొండా సురేఖ (పద్మశాలి, భర్త మున్నూరు కాపు), నారాయణరావు పాటిల్‌ ( ఆరె మరా 8). పూజల హరికృష్ణ (మున్నూరు కాపు)లకు టికెట్లు ఖరారయ్యాయి.

అగ్రవర్ణాలకు 53 టికెట్లు..
కాంగ్రెస్‌ ఇప్పటి వరకు ప్రకటించిన 100 సీట్లలో 20 శాతమే బీసీలకు కేటాయించి 53 శాతం ఓసీ వర్గాలకు కేటాయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీసీలకు కేటా యించిన 20 సీట్లలో యాదవ –4, గౌడ – 3,3 మున్నూరుకాపు–3, ముదిరాజ్‌ –3, పద్మశాలి, ఆరె మరాఠీ, వాల్మీకి, మేరు, వంజర, చాకలి, బొందిలి కులాలకు ఒక్కొక్కటి దక్కాయి. ఓసీట్లో రెడ్లకే ప్రాధాన్యం దక్కింది. రెడ్లకు 38 టికెట్లు ఇవ్వగా వెలమలకు 9, బ్రాహ్మణ, కమ్మలకు మూడు చొప్పున టికెట్లు కేటాయించారు.

సామాజిక వర్గాల వారీగా ఇలా..

ఎస్సీలు–15 (మాదిగ–9, మాల–6)

ఎస్టీలు–8 (ఆదివాసీలు–5, లంబాడీ–3)

బీసీలు–20, మైనార్టీలు–4, ఓసీలు–53 (రెడ్డి–38, వెలమ–9, బ్రాహ్మణ–3, కమ్మ–3)

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular