Work From Home: మనదేశంలో పేరుపొందిన ఐటి నగరాలలో హైదరాబాద్ ముందు వరుసలో ఉంటుంది. ఫార్మా లో కూడా హైదరాబాద్ నగరానికి తిరుగులేని స్థాయి ఉంది. అతిపెద్ద కంపెనీలు.. అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఫలితంగా హైదరాబాద్ స్థాయి గ్లోబల్ రేంజ్ ను మించిపోయింది. మన దేశ ఆర్థిక రాజధాని ముంబైతో హైదరాబాద్ పోటీ పడుతుంది. హైదరాబాద్ నగరంలో పెద్ద పెద్ద కంపెనీలు ఏర్పాటైన నేపథ్యంలో.. ఉద్యోగులు కూడా అదే స్థాయిలో ఉన్నారు. హైదరాబాదులోనే వారు స్థిర నివాసం ఏర్పరచుకోవడంతో.. హైదరాబాద్ నగరం అంతకంతకు విస్తరిస్తోంది.
హైదరాబాదు నగరంలోని ఐటీ కారిడార్ ప్రాంతంలో దాదాపు తొమ్మిది లక్షల మందికి పైగా పనిచేస్తున్నారు. వీరిలో చాలామంది సొంత వాహనాలలో ఆఫీస్ కు వస్తుంటారు. కొన్ని కంపెనీలు గతంలో ప్రయాణ సౌకర్యాన్ని అందించేవి. ఖర్చులను తగ్గించుకోవడానికి చాలావరకు కంపెనీలు ప్రయాణ సౌకర్యాన్ని తగ్గించేశాయి. దీంతో ఉద్యోగులు మొత్తం సొంత వాహనాలలో కార్యాలయాలకు వస్తున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలో పెట్రోల్ వినియోగం పెరిగిపోయింది.. పెట్రోల్ వినియోగం పెరిగిపోవడం వల్ల సహజంగానే కాలుష్యం కూడా పెరిగిపోతూ ఉంటుంది.
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని సూచించారు. అంతర్జాతీయంగా యుద్ధ ప్రభావాలు ఇంకా తగ్గలేదని.. దీనివల్ల మన దేశం మీద తీవ్రమైన ఒత్తిడి ఉందని.. అందువల్ల ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడానికి ఆసక్తిని చూపించాలని సూచించారు. ప్రధానమంత్రి కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం విధానానికి మరోసారి శ్రీకారం చుడుతున్నట్టు తెలుస్తోంది.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఒకసారి హైదరాబాద్ లో ఉన్న పరిస్థితిని అంచనా వేస్తే..
హైదరాబాదు నగరంలో ఐటి కారిడార్ ప్రాంతంలో 9 లక్షల మందికిపైగా పనిచేస్తూ ఉంటారు. వీరిలో చాలామంది సొంత వాహనాలలో ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. ఇందులో సగం మంది(4.5 లీటర్లు) కి వర్క్ ఫ్రం హోం ఇచ్చినా.. రోజుకు 3.6 లక్షల లీటర్ల పెట్రోల్ ఆదా అవుతుంది. ఒక్కో వ్యక్తి సగటున 20 కిలోమీటర్లు ప్రయాణిస్తారు అనుకుంటే మొత్తం 90 లక్షల కిలోమీటర్లు అవుతుంది. లీటర్ కు సగటున 25 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది అనుకుంటే 3.87 కోట్లు ఆదా అయినట్టే. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 107.50 గా ఉంది. హైదరాబాద్ నగరంలోనే ఇలా ఉంటే, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా, వంటి నగరాలలో కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తే మరింత పెట్రోల్ ఆదా అవుతుందని.. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.