Hydra: హైడ్రా కోరలు పీకిన హైకోర్టు.. రేవంత్‌రెడ్డి హిట్‌ వికెట్‌?

రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు నెలలుగా హైడ్రా గురించే చర్చ జరుగుతోంది. చాలా మంది హైడ్రా చర్యలను స్వాగతిస్తున్నారు. హైదరాబాద్‌ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా రాష్ట్రమంతటా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Written By: Raj Shekar, Updated On : September 30, 2024 3:57 pm

Hydra(12)

Follow us on

Hydra: హైడ్రా.. హైడ్రా.. హైడ్రా.. ఇప్పుడు ఏ టీవీ చానల్‌ చూసినా.. ఏ పత్రిక చూసిన దీని గురించిన వార్తలే. హైదరాబాద్‌లో ఆక్రమణలు తొలగింపునకు, ఆక్రమణల నుంచి చెరువులకు విముక్తి కల్పించేందకు ఏర్పాటు చేసిన హైడ్రా.. రెండు నెలల్లోనే సంచలనంగా మారింది. ఎఫ్‌టీఎల్, బఫర్‌ పరిధిలోని ఆక్రమణలను తొలగిస్తోంది. 100 ఎకరాలకు విముక్తి కల్పించింది. వందలాది అక్రమ కట్టడాలు కూల్చివేసింది. హైడ్రా తెలంగాణ గేమ్‌ చేంజర్‌గా పేర్కొన్నారు. సీఎం మానస పుత్రికగా హైడ్రాను భావిస్తున్నారు. అయితే హైడ్రా దూకుడుపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు హైడ్రా కమిషనర్‌కు నోటీసులు జారీ చేసి ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆదేశించింది. మాదాపూర్, కూకట్‌పల్లి, అమీన్‌పూర్‌లో కూల్చివేతలు హైడ్రాకు ఇబ్బందిగా మారాయి. సరైన హెచ్చరికలు లేకుండా కూల్చివేయడంపై మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. పేదలు కన్నీరుపెట్టే దృశ్యాలు వచ్చాయి. తమకు తిరుగలేదు అనుకున్న హైడ్రా తమ ప్రతాపం కొనసాగించడంతో హైకోర్టు సోమవారం(సెప్టెంబర్‌ 30న) విచారణ చేపట్టింది.

హైడ్రా తీరుపై ఆగ్రహం..
హైడ్రా దూకుడుపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో స్టే ఉన్నా కూల్చివేయడం, ఆదివారం కూల్చివేతలు చేపట్టడంపై మండిపడింది. ఆదివారం కూల్చివేతలు చేపట్టాలని ఎవరు చెప్పారని హైడ్రా కమిషనర్‌ను నిలదీసింది. మరోవైపు హైడ్రాపై, కాంగ్రెస్‌ ప్రభుతవంపై విమర్శలు వస్తున్నాయి. అయినా సీఎం రేవంత్‌రెడ్డి మౌనంగా ఉంటున్నారు. మరోవైపు మంత్రులు భిన్నమైన ప్రకటనలు చేస్తూ కాంగ్రెస్‌ నేతలకు తమలో తామే స్పష్టత లేదన్నట్లుగా ప్రజలు భావిస్తున్నారు.

సోషల్‌ మీడియాలో బీఆర్‌ఎస్‌ ట్రోల్‌..
ఇదిలా ఉంటే హైడ్రా చర్యలపై బాధితుల వీడియోలను ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా వేదికగా ట్రోల్‌ చేస్తోంది. సీఎంను తిడుతున్న దృశ్యాలను వైరల్‌ చేస్తోంది. బాధితులు ఏడ్చే వీడియోలు పోస్టు చేస్తోంది. దీంతో ప్రభుత్వ చర్యలు, హైడ్రా దూకుడుపై విమర్శలు పెరుగుతున్నాయి. మొదట్లో హైడ్రాను స్వాగతించిన సామాన్యులు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తీరును తప్పు పడుతున్నారు. మరోవైపు హైడ్రా కోరలు కట్‌ చేస్తామని హైకోర్టు హెచ్చరించింది. జీవో 99పై స్టే ఇస్తామని హెచ్చరించింది. ప్రపాప్రతినిధుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలని సూచించింది. హైడ్రా అంటే కూల్చివేతలేనా అని ప్రశ్నించింది.

నేతల ప్రకటనలతో దంగరగోళం..
ఇదిలా ఉంటే.. హైడ్రాపై ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ మాట్లాడుతూ పేదల జోలికి వెళ్లవద్దని, అవసరమైతే ప్రసాద్స్‌ ఐమాక్స్, జలవిహార్‌ వంటి నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే అధికారులను హెచ్చరించినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ నేతల ఈ విరుద్ధమైన ప్రకటనలు తమ పతనానికి దారితీస్తాయని ప్రజలు నమ్ముతున్నారు. ఇంత భారీ ఎదురుదెబ్బ తగిలిన తర్వాత కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం హైడ్రాను పునర్నిర్మించాలని వారు ఆశిస్తున్నారు. లేకుంటే రేవంత్‌ రెడ్డికి, ఆయన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి హిట్‌ వికెట్‌ లాంటిదని భావిస్తున్నారు.