Telangana Politics : వచ్చేసారి తెలంగాణలో గెలిచేది కాంగ్రెస్‌ యేనా? సంచలనం రేపుతోన్న లెక్కలు?

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌.. అధికారంలోకి రావడానికి పదేళ్లు పట్టింది. సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. కొత్త ప్రభుత్వం పది నెలల పాలపనై ప్రస్తుతానికి ఎలాంటి అసంతృప్తి లేదు.

Written By: Raj Shekar, Updated On : September 16, 2024 7:06 pm

KTR-Revanth Reddy

Follow us on

Telangana Politics : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ పార్టీగా నాటి టీఆర్‌ఎస్‌ నేటి బీఆర్‌ఎస్‌కు ప్రజలు రెండుసార్లు అధికారం కట్టబెట్టారు. కొత్త రాష్ట్రాన్ని కేసీఆర్‌ సారథ్యంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఊహించినదారికన్నా ఎక్కువగానే అభివృద్ధి చేసింది. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చాక గులాబీ నేతల్లో అహంకారం పెరిగింది. మరోవైపు కిందిస్థాయి నేతలు ప్రజలను వేధించడం పెరిగిపోయింది. ఏ పని చేయాలన్నా చేయి తడపాల్సిన పరిస్థితి. ఇక భూ కబ్జాలకు అయితే లెక్కే లేదు. ఉద్యోగ నియామక ప్రక్రియను మర్చిపోయారు. దీంతో యువతలో అసహనం పెరిగింది. హామీల అమలులోనూ నిర్లక్ష్యం ప్రదర్శించడంతో 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గద్దె దించారు. కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరి పదేళ్లు కావస్తోంది. ప్రస్తుతానికి ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత లేదు. కానీ బీఆర్‌ఎస్‌ నేతలు మాత్రం తమ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారం లేకుండా ఉండలేకపోతున్నారు. దీంతో ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకే త్వరలోనే కూలిపోతుందని జోష్యం చెప్పడం ప్రారంభించారు. దీంతో రేవంత్‌ ఆపరేషన్‌ ఆకర్షతో పది మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు.

ఇప్పుడు ఇదే లాస్ట్‌ ఛాన్స్‌ అని..
మొన్నటి వరకు ప్రభుత్వం ఎపుపడు కూలిపోతుందో తెలియదన్నారు. కేసీఆరే మళ్లీ సీఎం అన్నారు. పది మంది ఎమ్మెల్యేలను లాక్కున్న తర్వాత ఇప్పుడు.. రేవంత్‌కు ఇదే ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ ఛాన్స్‌ అంటున్నారు. ఐదేళ్లు మంచిగా పరిపాలించు అని సూచిస్తున్నారు. 2028లో తామే అధికారంలోకి వస్తామని జోష్యం చెబుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం 2023 ఎన్నికలు సెమీ ఫైనల్స్‌ మాత్రమే అని.. 2028 ఎన్నికలే తమకు ఫైనల్‌ అని అంటున్నారు. 2028లో రాష్ట్రంలో 2029లో కేంద్రంలో అధికారంలోకి వస్తామని ధీమాగా చెబుతున్నారు. ఇందుకు రేవంత్‌రెడ్డి చెప్పే కారణాలు కూడా సహేతుకంగానే ఉన్నాయి.

ఎవరికైనా పదేళ్లు..
తెలుగు ప్రజలు ఎవరికైనా పదేళ్లు అధికారం ఇస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నారు. 1994 నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతుందంటున్నారు. 1994 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలో ఉంది. తర్వాత 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. ఇక 2014 నుంచి 2023 వరకు టీఆర్‌ఎస్‌ అలియాస్‌ బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉంది. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో 2028లోనూ మరోసారి కాంగ్రెస్సే గెలుస్తుందని పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు రుణమాఫీ, ప్రీ బస్సు, ఉద్యోగ నియామకాలు చేపట్టారు. దీంతో అన్నివర్గాల్లోనూ రేవంత్‌ పాలనపై సంతృప్తిగానే ఉన్నారు. అందుకే 2028లో గ్యాంరటీగా అధికారం వస్తుందని చెబుతున్నారు. అంతే కాదు.. 2029లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లోనూ ఈసారి కాంగ్రెస్‌ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని, రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారని జోష్యం చెప్పారు. రాహుల్‌ను ప్రధానిని చేస్తే ఫైనల్‌ గెలిచినట్లే అంటున్నారు రేవంత్‌రెడ్డి. అప్పటి వరకు విశ్రమించేది లేదని పేర్కొంటున్నారు.