Hydra: హైడ్రా కూల్చివేతలు.. కబ్జాలకు బీఆర్ఎస్ అడ్డు.. కేటీఆర్ వ్యూహం కరెక్టేనా?

తెలంగాణను పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ 2023 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పయింది. కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఏడాది కావస్తున్నా బీఆర్‌ఎస్‌ తమ ఓటమిపై సమీక్ష చేయలేదు. కాంగ్రెస్‌ తప్పుడు హామీలే ఓటమికి కారణం అని భావిస్తోంది.

Written By: Raj Shekar, Updated On : September 27, 2024 12:56 pm

Hydra(8)

Follow us on

Hydra: తెలంగాణను పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ అధికారం కల్పోయి ఏడాది కావస్తోంది. ఇప్పటికీ తమ ఓటమికి కారణంపై ఒక్కసారి కూడా పార్టీ అధినేత కేసీఆర్‌ గానీ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌గానీ సమీక్ష చేయలేదు. రాజకీయ పార్టీలకు సమీక్ష అనేది చాలా ముఖ్యం. వైఫల్యాలను తెలుసుకునేందుకు, విజయాలకు పొంగిపోకుండా ఉండేందుకు దోహదపడుతుంది. ఏ రాజకీయ పార్టీ అయినా గెలుపు, ఓటముల తర్వాత సమీక్ష చేసుకుంటుంది. కానీ తెలంగాణ సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన బీఆర్‌ఎస్‌ అలియాస్‌ టీఆర్‌ఎస్‌కు మాత్రం ఆ అలవాటు లేదు. అదినేత ఏది డిసైడ్‌ అయితే అదే ఫైనల్‌. ఇప్పుడు ఎన్నిల్లో ఓటమిపై కూడా పార్టీ యువరాజు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పార్టీ ఓటమికి కాంగ్రెస్‌ తప్పుడు హామీలే అని ప్రకటించారు. అంతే అందరూ అదే ఫిక్స్‌ అయ్యారు. కానీ, ఓటమికా కారణం క్షేత్రస్థాయికి వెళితే అర్థమవుతుంది. ప్రజల్లో బీఆర్‌ఎస్‌పై ఊహించలేనంత వ్యతిరేకత ఉంది. అందుకే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఒక్క సీటు కూడా గెలవలేదు. అయినా పరిస్థితిని గమనించలేదు. అధికారంలో ఉన్నప్పుడు కబ్జాలు, వేదింపులు, అహంకార పూరిత మాటలే బీఆర్‌ఎస్‌ ఓటమికి ప్రధాన కారణం. అధికారం ఉందని ఏది పడితే అది చేశారు. పేదలను పీల్చి పిప్పి చేశారు. సామాన్యుల భూములను కబ్జా చేశారు. బలవంతుడిదే రాజ్యం అన్నట్లు వ్యవహరించారు. తెలంగాణ సాధించిన లక్ష్యాన్ని మర్చిపోయారు. ఉద్యమకారులను పక్కన పడేశారు. ఇవన్నీ నేతలు మర్చిపోయారు. కానీ జనం మర్చిపోలేదు. అందుకే 2023 ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పారు.

ఇప్పుడు మళ్లీ కబ్జాలకు అండగా..
ఇదిలా ఉంటే.. ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా బీఆర్‌ఎస్‌ కబ్జాదారులకు కొమ్ము కాస్తోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిపక్షంగా ప్రజలకు అండగా ఉండాలి. సమస్యలపై పోరాడాలి. కానీ కేవలం సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యంగా రాజకీయం చేస్తోంది. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి మూసీ ప్రక్షాళనకు చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లో చెరువుల ఆక్రమణలను హైడ్రాతో తొలగిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ తాము కబ్జాదారులకే అండగా ఉంటామని ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మూసీ సుందరీకరణను వ్యతిరేకిస్తోంది. మూసీ ఆక్రమణదారులను ప్రభుత్వం తరలిస్తోంది. వారికి డబుల్‌ బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. అయితే కొంతమంది ఆక్రమణదారులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.

వ్యూహ లోపం..
మూసీకి ఇరువైపులా ఉన్నవి అక్రమ నిర్మాణాలే అని బీఆర్‌ఎస్‌కు తెలుసు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ కూడా ఆక్రమణల గురించి మాట్లాడారు. కానీ, ఇప్పుడు ఈ ఆక్రమణల తొలగింపునకు సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. కానీ, వాటినే కేటీఆర్‌ సమర్థిస్తున్నారు. కబ్జాదారులకు అండగా ఉంటామని అధికారికంగా ప్రకటించారు. మురికి కూపంలా మారిన మూసీ ప్రక్షాళనను స్వాగతించాల్సింది పోయి.. ఆక్రమణలను తొలగించొద్దని వాదించడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆక్రమణల తొలగింపుతో బాధితులకు ఎలాంటి నష్టం లేకుండా డబుల్‌బెడ్రూం ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయినా ఆక్రమణదారులకు అండగా ఉంటామని కేటీఆర్‌ ప్రకటించడాన్ని గులాబీ నేతలే తప్పు పడుతున్నారు. దీంతో కేటీఆర్‌ వ్యూహ లోపం బయటపడింది.

మూసీ ప్రక్షాళనను స్వాగతించాలి..
మూసీ ప్రక్షాళనకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. కానీ, పూర్తి చేయలేదు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ముందుకు వచ్చారు. దానిని స్వాగతించాలి. పార్టీలతో సంబంధం లేకుండా మద్దతు తెలపాలి. కానీ, ఇక్కడ కూడా రాజకీయాలు చేయడం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌కే చెల్లింది. కబ్జాదారులకు అండగా నిలవడం ఆయన ఆలోచనా తీరుకు అద్దం పడుతోంది. కేవలం రేవంత్‌రెడ్డి నిర్ణయాలను వ్యతిరేకించాలన్న ఆలోచనతో సొంత పార్టీకే నష్టం కలిగిస్తున్నారు.