Davos Tour : తెలంగాణ ప్రభుత్వం మూడు రోజుల్లోనే 1.32 లక్షల కోట్ల ఒప్పందాలను కుదుర్చుకుంది. 10 సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ఒప్పుకున్నాయి. బుధవారం ఒక్కరోజే దాదాపు 60 వేల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగాయి. సన్ పెట్రో కెమికల్స్ సంస్థ (Sun petrol chemicals company) 45 వేల కోట్లను పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది.. ఇన్ఫోసిస్(Infosys), అమెజాన్ (Amazon) తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలకు కుదుర్చుకున్నాయి. ఇన్ఫోసిస్ కంపెనీ ఒప్పందంలో భాగంగా పోచారం ఐటీ క్యాంపస్ ను విస్తరించనుంది. మరో వైపు ఆమెజాన్ కూడా 60 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది. డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు రాగా.. దీనికి రేవంత ప్రభుత్వం ఓకే చెప్పింది.. గత ఏడాది దావోస్ లో జరిగిన సదస్సులో 40 వేల కోట్ల పెట్టుబడులను తెలంగాణ ప్రభుత్వం సాధించింది. ఈసారి అంతకుమించి అనే స్థాయిలో పెట్టుబడులు సాధించాలని భావించింది. ఇందులో బాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ నినాదంతో దావోస్ లో అడుగు పెట్టారు. అదే స్థాయిలో పెట్టుబడులు కూడా సాధించారని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం చెబుతున్న గణాంకాల ప్రకారం చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి చూసుకుంటే ఇప్పటివరకు వచ్చిన పెట్టుబడులే అత్యధికం అని చెప్పవచ్చు. గత ఏడాది దావోస్ వేదికగా జరిగిన ఒప్పందాలలో భాగంగా 40 వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయి. ఇప్పటివరకు అవే అత్యధికం. ఇప్పుడు దానికి మించి పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం చెబుతోంది. ఇంకా రెండు లేదా మూడు ఒప్పందాలు కుదురుతాయని తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వం 1.32 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను వివిధ కంపెనీల నుంచి ఆకర్షించింది. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు 46 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. పరోక్షంగా కూడా ఇంతకుమించి ఉపాధి లభించే అవకాశం ఉంది.
పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్న కంపెనీలు ఇవే
సన్ పెట్రో కెమికల్స్ 45వేల కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. 7000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
మేఘా కంపెనీ 15000 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. 4250 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
కంట్రోల్ ఎస్ అనే కంపెనీ పదివేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ పెట్టుబడుల ద్వారా 3600 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
JSW కంపెనీ 800 కోట్ల పెట్టుబడితో ముందుకు వచ్చింది. ఈ కంపెనీ 200 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది.
స్కై రూట్ కంపెనీ 500 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది.
హెచ్ సి ఎల్, విప్రో కంపెనీలు పెట్టుబడులు పెట్టడం ద్వారా పదివేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
యూనిలీవర్ కంపెనీ రెండు మ్యానుఫ్యాక్చర్ యూనిట్లు నెలకొల్పనుంది.