National Highways: నేషల్ హైవేల విస్తరణ, కొత్త నేషనల్ హైవేల నిర్మాణంపై రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ అంశాలపై సీఎం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు. ఈ సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ తెలంగాణలో నేషనల్ హైవేల నిర్మాణానికి ప్రభుత్వం సహకరిస్తుందని, ఏవైనా ఆటంకాలు ఉంటే వాటిని వెంటనే తమ దృష్టికి తీసుకువస్తే తొలగిస్తామని చెప్పారు.
రాష్ట్రంలో ఎన్హెచ్ఏఐ చేపడుతున్న రహదారుల నిర్మాణంలో భూ సేకరణతో పాటు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని వారు సీఎంకు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన సీఎం.. వాటి పరిష్కారానికి త్వరలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆయా నేషనల్ రోడ్స్ వెళ్లే జిల్లాలలకు సంబంధించి పాలనాధికారులు, అటవీ అధికారులతో భేటీ నిర్వహించి పరిష్కారాలను కనుగొంటామని అన్నారు.
ఆయా సమస్యలపై చర్చించి పరిష్కరించుకుందామని సీఎం సూచించారు. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్), రీజనల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) మధ్యలో 12 రేడియల్ రోడ్లు వస్తాయన్నారు. వాటి మధ్య క్లస్టర్లు, శాటిలైట్ టౌన్ షిప్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. తెలంగాణకు తీర ప్రాంతం లేకపోవడంతో బందర్ పోర్టుకు వెళ్లేలా హై స్పీడ్ ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం చేపట్టాలని సీఎం కోరారు. హైదరాబాద్ -కల్వకుర్తికి జాతీయ రహదారి నిర్మిస్తే తిరుపతికి 70 కిలో మీటర్ల దూరం తగ్గుతుందన్నారు.
ఈ నేషనల్ హైవేకు సంబంధించి పనులను వెంటనే ప్రారంభించాలని సీఎం రేవంత్ ఎన్హెచ్ఏఐ అధికారులు సూచించారు. సదరు కాంట్రాక్ట్ సంస్థతో మాట్లాడాలన్నారు. హైదరాబాద్ -విజయవాడ నేషనల్ హైవే విస్తరణ పనులు మొదలు పెట్టాలన్నారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలన్నారు. హైదరాబాద్-విజయవాడ మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే మంజూరుకు ఏపీ చేస్తున్న ప్రయత్నాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.