Ponguleti vs KTR : పొంగులేటి రాజీనామా.. కేటీఆర్ రాజకీయ సన్యాసం.. జనమే పిచ్చోళ్ళు.. ఇవన్నీ జరుగుతాయా ఏంటి?

ఈ సువిశాల భారతదేశంలో పశువుల దాణా నుంచి మొదలుపెడితే భోపోర్స్ వరకు ఎన్నో కుంభకోణాలు జరిగాయి. ప్రభుత్వ ధనం దర్జాగా భోక్తల బొక్కసాల్లోకి తరలిపోయింది. ఇన్ని కుంభకోణాలు జరిగినప్పటికీ అభియోగాలు ఎదుర్కొంటున్న వారిపై తీసుకున్న చర్యలు నామమాత్రం.

Written By: Anabothula Bhaskar, Updated On : September 23, 2024 9:36 pm

Ponguleti vs KTR

Follow us on

Ponguleti vs KTR: మనదేశంలో సామాన్యులపై, మధ్యతరగతి వారిపై చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కానీ పెద్ద విషయంలో మాత్రం నిశ్శబ్దంగా మారుతుంది. ఏదో ఉరుము ఉరిమినట్టు.. పిడుగు పడినట్టు అప్పుడప్పుడు న్యాయస్థానం స్పందిస్తుంది.. కానీ అప్పటికే పెద్దలు సర్దేసుకుంటారు. చర్యలు తీసుకునేలోగానే దేశం దాటి వెళ్లిపోతారు.. ఇలాంటి ఉదంతాలు ఎన్నో మనదేశంలో చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ సామాన్యులు, మధ్యతరగతివారు ప్రజాస్వామ్యాన్ని నమ్ముతుంటారు. న్యాయస్థానాల పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తారు. అంత నమ్మకాన్ని కలిగి ఉన్నా వారి విషయంలో న్యాయం అనేది ఎండమావే.

రాజీనామాలు చేస్తారా? పాడా?

ఎన్నికలు లేకపోయినప్పటికీ తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి.. అధికారం పోయిందనే బాధ భారత రాష్ట్ర సమితిలో ఉంది. అధికారం దక్కిందనే గర్వం కాంగ్రెస్ పార్టీలో ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ చేసే ప్రతి అడుగును భారత రాష్ట్ర సమితి జాగ్రత్తగా పరిశీలిస్తోంది. భారత రాష్ట్ర సమితి పలికే ప్రతి మాటకు కాంగ్రెస్ పార్టీ గట్టి కౌంటర్ ఇస్తోంది. అమెరికాలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న పెట్టుబడుల నుంచి మొదలుపెడితే అమృత్ పథకం వరకు ప్రతి విషయాన్ని భారత రాష్ట్ర సమితి తెరపైకి తీసుకొస్తుండగా .. వాటికి కాంగ్రెస్ పార్టీ గట్టిగా కౌంటర్ ఇచ్చుకుంటూ వస్తోంది. అయితే ఈసారి అమృత్ పథకంలో 8,888 కోట్ల అక్రమాలు జరిగాయని కేటీఆర్ ఆరోపించారు. ఈ ఆరోపణలు గల్లి స్థాయి నాయకుడు చేస్తే పెద్దగా పట్టించుకునేవారు కాదు. సాక్షాత్తు కేటీఆర్ అనడంతో సహజంగానే వీటికి ప్రాధాన్యం ఏర్పడింది. దీనికి కౌంటర్ గా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన విషయాలు తెరపైకి తెచ్చారు.. ఒకవేళ కేటీఆర్ అన్నట్టుగా అక్రమాలు జరిగితే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. శ్రీనివాస్ రెడ్డి దీటుగా సమాధానం ఇచ్చిన నేపథ్యంలో కేటీఆర్ స్పందించక తప్పలేదు. ఒకవేళ అక్రమాలు జరగలేదని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు.

మీడియాలో చర్చ

పేరుపొందిన నాయకులు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకోవడంతో సహజంగానే తెలంగాణలో చర్చ మొదలైంది.. అయితే వీరిద్దరూ రాజీనామా చేస్తారా?, రాజకీయ సన్యాసం తీసుకుంటారా? నెవ్వర్. ఇలాంటి పనులు జరగవు. ఇలా రాజకీయ నాయకులు మాటమీద నిలబడరు. ఎందుకంటే అప్పటికప్పుడు ప్రజల్లో సింపతి కోసం వారు ఏవేవో కామెంట్లు చేస్తుంటారు. అంత తప్ప అందులో అవినీతిని కేటీఆర్ నిరూపించలేడు. టెండర్లను రేవంత్ రద్దు చేయలేడు.. కాకపోతే కొద్ది రోజులపాటు మీడియాకు పతాక శీర్షికల స్థాయి వార్తలు లభిస్తాయి. సోషల్ మీడియాలో కొట్టుకోవడానికి ఉపకరిస్తాయి. అంతేతప్ప.. అంతకుమించి ఏమీ లేదు.