Revanth Reddy : తెలంగాణలో ప్రతిపక్షాలు లేకుండా.. తనను ప్రశ్నించే వారు లేకుండా చేయాలన్న సంకల్పంతో కేసీఆర్.. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకున్నారు నాటి ముఖ్యమత్రి కేసీఆర్. తను ఒక రాజులా రాష్ట్రాన్ని పాలించారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభించిన సమయంలో తెలంగాణలో ఆ పార్టీకి పెద్దగా ఊపు రాలేదు. కానీ, కేసీఆర్ ప్రాంతీయ వాదాన్ని అడ్డు పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేశారు. తరచూ ఉప ఎన్నికలు తెస్తూ.. పార్టీ తరఫున పోటీ చేసేవారిని గెలిపించేందుకు తెలంగాణ సెంటిమెంటు, ఆంధ్రా, తెంగాణ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టేవారు. ఇక జీహెచ్ఎంసీలో అయితే.. నాటి టీఆర్ఎస్ను ఎవరూ పట్టించుకునేవారు కాదు. తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు కూడా ఇదే పరిస్థితి. తెలంగాణ వచ్చాక కూడా జీహెచ్ఎంసీ బయటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీట్లు గెలిచింది. దీంతో జీహెచ్ఎంసీలో పట్టు సాధించేందకు కేసీఆర్ వ్యూమాత్మకంగా వ్వవహరించారు. సెటిలర్లను తనవైపు తిప్పుకునేందుకు కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్రమణలపేరుతో కూల్చివేతలు చేపట్టారు. కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో కూల్చివేయించారు. దీంతో ఒక్కసారిగా గ్రేటర్ పరిధిలోని సెటిలర్లు కేసీఆర్ను కలిశారు. ఆయనతో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చారు. టీఆర్ఎస్లో చేరికలు పెరిగాయి. దీంతో జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్కు పట్టు పెరిగింది.
రేవంత్ కూడా అదే వ్యూహంతో..
ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కూడా మాజీ సీఎం కేసీఆర్ లాంటి వ్యూహాన్నే అమలు చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్కు జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క సీటు కూడా రాలేదు. బీఆర్ఎస్ 16 సీట్లు గెలిచింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు రేవంత్ హైడ్రాను రంగంలోకి దించారు. ఆక్రమణల పేరుతో కూల్చివేతలు మొదలు పెట్టారు. ఇందులో ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు, లీడర్లవే ఎక్కువగా ఉన్నాయి. దీంతో చాలా మంది గులాబీ నేతలు బీఆర్ఎస్ను వీడేందుకు సిద్ధమవుతున్నారు. రేవంత్తో కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నారు.
గాంధీ ఎపిసోడ్తో మరింత ఊపు..
వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు.. సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్లో పట్టు కోసం చేస్తున్న ప్రయత్నాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి చేసిన ప్రాంతీయ వాద వ్యాఖ్యలు కాంగ్రెస్కు అస్త్రంగా మారాయి. హైదరాబాద్లోని సెటిలర్లను బతకడాడనికి వచ్చిన వారు అని కౌశిక్ అనడంతో దానిని కాంగ్రెస్ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం మొదలు పెట్టింది. ఈ వ్యాఖ్యలపై ఆంధ్రా వాళ్ల ఓట్లు కవాలి కానీ, ఆంధ్రా ప్రజలు వద్దా అని మండిపడ్డారు. హైదరాబాద్ ఓటర్లు తాయిలాలకు తలొగ్గరు. భావోద్వేగ అంశం ముఖ్యం. అందుకే కేసీఆర్ తాను ఉన్నానని భరోసా ఇచ్చేలా కొన్ని పరిణామాలు సృష్టించారు. దాంతో మెజార్టీ ఓటర్లు ఆయన వైపు మొగ్గారు. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యూహాత్మక తప్పిదం.. రేవంత్కు అస్త్రంగా మారింది. దీంతో మాజీ సీఎం కేసీఆర్ ప్లాన్ను ఈజీగా అమలు చేసేశారు. శాంతి భద్రతల సమస్య గురించి మాట్లాడారు. అంతే కానీ ప్రతీకారం తీర్చుకోవాలని ఆశపడలేదు. పాడి కౌశిక్రెడ్డి, అరికెపూడి గాంధీ ఇష్యూను సెటిలర్లతో సంబంధం ఉన్న అంశంగా మార్చారు.
సరిదిద్దు కునే ప్రయత్నంలో బీఆర్ఎస్..
ఈ అంశంపై బల్బ్ వెలిగే సరికి బీఆర్ఎస్కు నష్టం జరిగింది. దీంతో ఇప్పుడు దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్. రేవంత్ను ఇప్పటికీ బీఆర్ఎస్ వ్యూహకర్తలు తక్కువగా అంచనా వేస్తున్నారు. అందుకే ఇలాంటి వ్యూహాత్మక తప్పిదాలు జరుగుతున్నాయి. రేవంత్రెడ్డి గ్యారంటీల అమలునుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని విమర్శలు చేస్తూనే వాటిలో భాగమవుతున్నారు. అంటేం రేవంత్ వాళ్లకు చాయిస్ లేకుండా చేస్తున్నారని సులువుగా అర్థం చేసుకోవచ్చు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More