Telangana government salary news: ప్రభుత్వంలో ఉన్న శాఖలలో రెగ్యులర్ ఉద్యోగులు మాత్రమే కాదు.. వివిధ విధానాలలో కూడా ఉద్యోగులు పనిచేస్తుంటారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానం లేకుండా.. అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని నాడు కెసిఆర్ హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆ హామీని నిలబెట్టుకోలేకపోయారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానాలలో ఉద్యోగులు నేటికీ పనిచేస్తూనే ఉన్నారు.
ఆ మధ్య తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన విచారణలో చాలావరకు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానాలలో ఉద్యోగులు లేకపోయినప్పటికీ వారికి వేతనాలు చెల్లించారని.. ఇవన్నీ నాటి గులాబీ పార్టీ పెద్దల ఖాతాలలోకి వెళ్లాయని తేలింది. దీంతో ఆ కాంట్రాక్ట్ సంస్థలను.. ఔట్ సోర్సింగ్ విభాగాలను ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టింది.. ఇప్పుడిక ఉద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్, కాంట్రాక్ట్ కార్మికులకు నగదు రూపంలో జీతం ఇస్తే ఊరుకునేది లేదని.. కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. ఏ విభాగంలోనైనా సరే నేరుగా బ్యాంకు ఖాతాలోనే వేతనాన్ని వేయాలని ఆదేశాలు జారీ చేసింది. కనీస వేతనాలను పూర్తిస్థాయిలో పెంచుతూ.. సెలవు రోజుల్లో పనిచేస్తే కార్మికులకు కచ్చితంగా అధిక వేతనం ఇవ్వాలని నిబంధన విధించింది. వేతనాలు ఇవ్వకుండా థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ కనుక ఇబ్బంది పెడితే.. మెయిన్ కంపెనీ బాధ్యత తీసుకోవాలని.. వేతనాల వ్యవహారాలను సెటిల్ చేయాలని సూచించింది.
చాలావరకు ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగులకు వేతనాలు చెల్లించే విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఖాతా ద్వారా కాకుండా నేరుగా వేతనాన్ని ఇస్తున్నాయి. దీనివల్ల ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. నేరుగా ఇచ్చే వేతనంలో కూడా కోతలు విధిస్తున్నాయి కంపెనీలు. ఇటువంటి ఫిర్యాదు ఇటీవల కాలంలో పెరిగిపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లక్షల మంది ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులకు లాభం చేకూర్చనుంది. అంతేకాదు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది.. ఖాతాలలో వేతనాలు వేయడం వల్ల సక్రమంగా పిఎఫ్ చెల్లించాల్సి ఉంటుంది. కార్మికులకు చెల్లించాల్సిన ప్రయోజనాలను కూడా ఖాతాలో వేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఉద్యోగులకు, కార్మికులకు ప్రయోజనం కలుగుతుంది.
