CM Revanth Reddy: ఓటుకు నోటు నిందితులకు అందలం.. అస్మదీయులకు రేవంత్‌రెడ్డి కీలక పదవులు..!

ఆంధ్రప్రదేశ్‌ పునర్విజన తర్వాత తెలంగాణలో బీఆర్‌ఎస్‌(టీఆర్‌ఎస్‌) అధికారంలోకి వచ్చింది. కేసీఆర్‌ సీఎం అయ్యారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు సీఎం అయ్యరు. అయితే తెలంగాణలో కేసీఆర్‌కు బొటాబొటి మెజారిటీ వచ్చింది. మరోవైపు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉంది. ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబును హైదరాబాద్‌ నుంచి వెళ్లిపోయారు.

Written By: Raj Shekar, Updated On : July 25, 2024 11:47 am

CM Revanth Reddy

Follow us on

CM Revanth Reddy: తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల సమయంలో టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. పింఛన్‌ రూ.4 వేలు ఇస్తామని, మహిళలకు రూ.2,500 అందిస్తామని, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, విద్యార్థినులకు స్కూటీలు, విద్యార్థులకు రుణ కార్డులు ఇస్తామని హామీలు ఇచ్చారు. ఆరు గ్యారంటీలు, 420కిపైగా మేనిఫెస్టో అంశాల ఆధారంగా కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారు. ఏడునెలలైనా హామీల అమలు అంతంత మాత్రంగానే ఉంది. 200 యూనిట్ల విద్యుత్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ మాత్రమే అమలవుతున్నాయి. ఇటీవలే రైతుల పంట రుణాలు రూ.లక్ష వరకు మాఫీ చేశారు. రైతుభరోసా ఇవ్వలేదు. ఇక కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకే పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించి నియామక పత్రాలు అందించారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం నిరుద్యోగులే. పదేళ్లుగా ఉద్యోగాల భర్తీలో చేసిన జాప్యం, ప్రశ్నపత్రాల లీకేజీ వంటి అంశాలు కేసీఆర్‌ పాలనపై ఆగ్రహం పెంచాయి. అయితే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి ఇప్పటి వరకు నిరుద్యోగులకు మొండి చేయే చూపారు. కానీ, అస్మదీయులను మాత్రం అందలం ఎక్కిస్తున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసుతో సంబంధం ఉన్న వారందరికీ జాబ్‌ గ్యారంటీ అంటూ ఒక్కో పదవిలో కూర్చోబెడుతున్నారు. ఆ కేసులో డబ్బు సంచులతో కెమెరాకు చిక్కిన సీఎం రేవంత్‌ ముఖ్య అనుచరుడు రుద్ర ఉదయ సింహాకు ఢిల్లీలో ఓ పదవి ఇచ్చారు. దీంతో ఓటుకు నోటు కేసులోని నిందితులపై చర్చ మొదలైంది. రాజ్యం మనదైతే కొలువులు కూడా మనవే అన్నట్టుగా అందరికీ ఒక్కో పదవి ఇచ్చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: కేంద్రంతో సఖ్యతపై రేవంత్‌రెడ్డి క్లారిటీ… ఇక నిరూపించుకోవాల్సిందే బీఆర్‌ఎస్సే..!

నిందితులకు పదవులు..
ఓటుకు నోటు కేసుతో సంబంధమున్న ప్రతి ఒక్కరూ ప్రస్తుతం ఏదో ఒక పదవిలో ఉన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రేవంత్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరూ చెరో రాష్ట్రానికి సీఎంలు అయ్యారు. ఏపీ సీఎంగా చంద్రబాబు ఉండగా, కేంద్రంలోనూ ఆయన కీలక భాగస్వామిగా ఉన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సీఎం అయి చక్రం తిప్పుతున్నారు. ఇక రేవంత్‌ చిరకాల స్నేహితుడు. ఓటుకు నోటు కేసుకు మూలమైన వ్యక్తులలో ఒకరైన వేంసరేందర్‌రెడ్డి కేబినెట్‌ హోదాలో ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారుగా నియమితులయ్యారు. ఇక ఇదే కేసులో న్యాయవాదిగా ఉన్న డెవీనా సెహగల్‌ కూడా ఓ పదవి దక్కించుకున్నారు. సుప్రీం కోర్టులో తెలంగాణ కౌన్సిల్‌ న్యాయవాదిగా నియమితులయ్యారు. ఇక రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న రుద్ర ఉదయ సింహా కూడా పదవి దక్కిం చుకున్నారు. ఢిల్లీలో సీఎం పీఆర్వోగా బాధ్యతలు స్వీకరించారు.

నరేందర్‌తో ప్రత్యేక అనుబంధం..
ఇదిలా ఉంటే.. రేవంత్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. ఇద్దరూ 20 ఏళ్లుగా మంచి మిత్రులు. అందుకే రేవంత్‌ సీఎం కాగానే తన ప్రధాన సలహాదారుగా నరేందర్‌రెడ్డిని నియమించుకున్నారు. ప్రస్తుతం ఆయన రేవంత్‌ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. 2015లో నరేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించుకునేందుకు నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను డబ్బుతో ప్రలోభపెట్టిన రేవంత్‌రెడ్డి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఇద్దరూ ఒకేసారి కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి రేవంత్‌రెడ్డి టీమ్‌లో నరేందర్‌ కీలకంగా మారారు.

డబ్బు సంచులతో చిక్కి..
ఇక ఓటుకు నోటు కేసులో స్టీఫెన్‌సన్‌ ఇంట్లో డబ్బు సంచితో ఉదయ సింహా కెమెరాకు చిక్కారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో జాబ్‌ కొట్టే శారు. అక్కడ సీఎం వ్యవహరాలను చక్కదిద్దేవ్యక్తిగా, పీఆర్వోగా నియమితులయ్యారు. ఇక ఇదే కేసులో మొదటి నుంచి వీరికి లాయర్‌గా ఉన్న డెవీనా సెహగల్‌కు కూడా రేవంత్‌రెడ్డి కీలక పదవి ఇచ్చి గౌరవించారు. ఈ ఏడాది జనవరిలో ఆమెను సుప్రీం కోర్టులో తెలంగాణ కౌన్సిల్‌కు
న్యాయవాదిగా నియమించారు.

 

Also Read: 2.90 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌?.. ఆ శాఖలకే అధిక కేటాయింపులు!