HomeతెలంగాణTelangana Government : తెలంగాణ సర్కార్‌కు రిటైర్మెంట్‌ టెన్షన్‌.. అసలే ఆర్థిక కష్టాలు.. ఏటా రూ.5...

Telangana Government : తెలంగాణ సర్కార్‌కు రిటైర్మెంట్‌ టెన్షన్‌.. అసలే ఆర్థిక కష్టాలు.. ఏటా రూ.5 వేల కోట్లు అవసరం!

Telangana Government :  తెలంగాణలో పదేళ్లు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉంది. పాలనలో అభివృద్ధితోపాటు.. ఓట్ల కోసం తీసుకున్న కొన్ని నిర్ణయాలు.. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ సర్కార్‌కు గుదిబండలా మారాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్‌ సర్కార్‌ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచింది. దీంతో మూడేళ్లు రాష్ట్రంలో ఉద్యోగ విరమణలు నిలిచిపోయాయి. ఈ ఏడాది జూన్‌ నుంచే ఉద్యోగ విరమణలు మొదలయ్యాయి. రిటైర్‌ అయ్యే ఉద్యోగులకు చెల్లించాల్సిన రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇప్పుడు రేవంత్‌ సర్కార్‌కు భారంగా మారాయి. ఇప్పటికే ఆరు గ్యారంటీల అమలు, గత ప్రభుత్వం చేసిన రూ.7 లక్షల కోట్ల అప్పుకు వడ్డీలు చెల్లించడానికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితిలో కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. వారికి వేతనాలు చెల్లింపుతోపాటు.. మరో సమస్య ఉద్యోగుల రిటైర్మెంట్‌ తలనొప్పిగా మారింది. ఈ ఏడాది చివరి వరకు 8 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్‌ కానున్నారు. వచ్చే ఐదేళ్లలో 44 వేల మంది ఉద్యోగులు రిటైర్‌ అవుతారని అంచనా. వీరందరికీ కాంగ్రెస్‌ ప్రభుత్వం రిటైర్మంట్‌ బెనిఫిట్స్‌ చెల్లించాలి. అయితే వారికి రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు బెనిఫిట్‌ ఇవ్వాలి. వాటిని చెల్లించడం ఎలా అన్నది కలవరపెడుతోంది.

రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇలా..
ఉద్యోగ విరమణ తర్వాత ప్రభుత్వం నుంచి చెల్లించే బెనిఫిట్స్‌ చాలా ఉంటాయి. వారికి బేసిక్‌పేకు అనుగుణంగా హెచార్‌ఏ, సీసీఏ, డీఏలు కలుపుకుని మొత్తం వేతనానికి పది రెట్లు లీవ్‌ శాలరీ రూపంంలో ఇవ్వాల్సి ఉందుంది. ఈ లీవ్‌ శాలరీ మొత్తంలో ఒక్కో ఉద్యోగికి సగటున రూ.8 లక్షల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక గ్రాట్యుటీ కింద రూ.12 లక్షలు, కమ్యూటేషన్‌ రూపంలో మరో రూ.20 లక్షలు చెల్లించాలి. వేతనం నుంచి నెలనెలా దాచుకున్న పీఎఫ్, గ్రూప్‌ ఇన్సూరెన్స్, సరెండర్‌ లీవులు కలుపుకుని ఒక్కో ఉద్యోగికి సగటున రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

ఏటా రూ.5 వేల కోట్లు అవసరం..
ఉద్యోగుల రిటైర్మెంట్‌ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.5 వేల కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. 2025 డిసెంబర్‌ నాటికి 10 వేల మంది రిటైర్‌ కానున్నారు. 2026, 2027లోనూ పది వేల మంది చొప్పున రిటైర్‌ అయ్యే అవకాశం ఉంది. 2028లో 8 వేల మంది రటైర్‌ అవుతారు. వీరికి బెనిఫిట్స్‌ చెల్లించడానికి ఏటా రూ.5 వేల కోటుల అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే నెలకు రూ.400 కోట్లు కేటాయించాలి. ఇవి వేతనాలకు అదనం. ఈ ఏడాది ఇప్పటికే రిటైర్‌ అయినవారితోపాటు డిసెంబర్‌ నాటికి రిటైర్‌ అయ్యే వారికి రూ.3,200 కోట్లు అవసమని అంచనా.

బీఈఆర్‌ఎస్‌ నిర్ణయంతో పెరిగిన భారం..
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేకతను చల్లబరిచేందుకు 2021లో కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్‌మెంట్‌ ఏజ్‌ను 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పనెంచింది. దీంతో 2024 మార్చి 31 వరకు ఉద్యోగ విరమణలు ఆగిపోయాయి. ఆ తర్వాత నుంచే రిటైర్‌ అవుతున్నారు. దీంతో బీఆర్‌ఎస్‌ సర్కార్‌కు ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. కానీ ఇప్పుడు ఆ భారమంతా కాంగ్రెస్‌ సర్కార్‌పై పడుతోంది.

నాలుగేళ్లలో రూ.20 వేల కోట్లు..
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌ కోసం ప్రభుత్వం వచ్చే నాలుగేళ్లలో రూ.20 వేల కోట్లు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఉద్యోగులకు సంబందించిన 4 డీఏలు పెండింగ్లో ఉన్నాయి. కేసీఆర్‌ సర్కార్‌ ఉద్యోగుల జీవితబీమా ఫండ్‌ను వాడుకుంది. అది కూడా ఇప్పుడు కాంగ్రెస్‌ సర్కార్‌ చెల్లించాలి. ఇవి సర్కార్‌కు తలకు మించిన భారంగా మారింది.

మరో ఏడాది పెంపు ఆలోచన
తెలంగాణ సర్కార్, భారం తగ్గించుకునేందుకు రిటైర్‌మెంట్‌ వయసును మరో ఏడాది పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రనస్తుతం ఏపీలో రిటైర్మెంట్‌ వయసు 62 ఏళ్లుగా ఉంది. తెలంగాణలో 61 ఏళ్లు ఉంది. ఏపీ తరహాలో తెలంగాణలోనూ రిటైర్మెంట్‌ వయసు మరో ఏడాది పెంచితే ఆర్థిక భారం తగ్గుతుందని రేవంత్‌ సర్కార్‌ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇలా చేస్తే భారం తగ్గుతుందా.. ఎంత తగ్గుతుంది.. అని వివరాలు సేకరిస్తోందని సమాచారం. ఏజ్‌ పెంచని పక్షంలో రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ను బాండ్స్‌ రూపంలో ఇవ్వాలనే ఆలోచన కూడా ఉందని తెలుస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular