Crime : నడి వయసులో నవవధువుగా మారి.. ఓ మహిళ విన్యాసాలతో మైండ్ బ్లాక్

పోలీస్ విచారణలో సైతం విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మోసానికి సూత్రధారి భర్తేనని తేలింది.

Written By: NARESH, Updated On : August 27, 2023 2:22 pm
Follow us on

Crime : నడివయసులో ఉన్న ఓ మహిళ.. తాను ఒక నవ వధువుగా ఓ యువకుడ్ని నమ్మించింది.పెళ్లి చేసుకుందామని నమ్మ బలికింది. తన కుమార్తెలను స్నేహితురాళ్లుగా చెప్పుకొచ్చింది. గత ఏడాదిగా అవసరాల పేరిట ఆ యువకుడు నుంచి నాలుగు లక్షల రూపాయలు వసూలు చేసింది. ఈ తతంగమంతా ఫోన్లోనే నడిపించింది. తీరా యువకుడు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చేసరికి ఫోన్ నెంబర్ ను బ్లాక్ లో పెట్టింది. మోసపోయానని భావించిన సదరు యువకుడు కోర్టును ఆశ్రయించాడు. పోలీసులకు సైతం ఫిర్యాదు చేశాడు. ఇందుకు సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

బోధన్ ఉమ్మడి మండలానికి చెందిన ఓ యువకుడు వివాహం కోసం ఓ మ్యాట్రిమోనీని ఆశ్రయించాడు. తన ఫొటోలతో కూడిన వివరాలను అందించాడు. అక్కడే ఆ యువకుడు ఫోన్ నెంబర్ను గుర్తించిన స్వాతి అనే మహిళ ఒక వ్యూహం పన్నింది. సదరు యువకుడి నుంచి భారీ మొత్తంలో వసూలు చేయాలని భావించింది. తానే ఒక వధువుగా ఫోన్లో పరిచయం చేసుకుంది. ఇద్దరి అభిప్రాయాలు కుదరడంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే స్వాతి ఆపదలో ఉన్నానని ఒకసారి, అనారోగ్యంతో ఉన్నానని మరోసారి, అవసరాల పేరిట ఇంకోసారి.. ఇలా ఆ యువకుడు నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు వసూలు చేసింది. తీరా ఇప్పుడు ఆ యువకుడు పెళ్లి కోసం పట్టుబడగా ఫోన్ నెంబర్ను బ్లాక్ చేసింది.

దీంతో బాధిత యువకుడు స్వాతి గురించి ఆరా తీశాడు. బైర్లు కమ్మే నిజాలు తెలుసుకున్నాడు. ఈ మొత్తం మోసం వ్యవహారంలో ఇద్దరు కుమార్తెలతో పాటు భర్త పాత్ర ఉందని తేలడంతో షాక్ కి గురయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీస్ విచారణలో సైతం విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మోసానికి సూత్రధారి భర్తేనని తేలింది. స్వాతి స్నేహితురాళ్లుగా ఆమె ఇద్దరు కుమార్తెలే యువకుడితో మాట్లాడినట్టు తెలిసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.