Tech Mahindra Employee: ఇన్ని రోజులపాటు చేసిన చోట ఉద్యోగం లేదంటే.. ఆ ఉద్యోగి కి ఎంత కష్టం ఉంటుంది.. హాయిగా పని చేసుకుంటూ.. బ్రహ్మాండంగా జీతం తీసుకుంటూ.. జీవితాన్ని సాగిస్తున్న ఆమెకు ఉద్యోగం పోతే ఎంత బాధ ఉంటుంది.. అసలు ఆ వార్త విన్న తర్వాత ఆమె కాళ్ళ కింద భూమి కంపించిపోయింది. కారణం లేకుండా ఉద్యోగం నుంచి తొలగించగానే కుప్పకూలిపోయింది. తట్టుకోలేక పనిచేస్తున్న ఆఫీసు ముందు నిరసన వ్యక్తం చేసింది..
హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉంటుంది మేడ్చల్. ఈ ప్రాంతంలో టెక్ మహీంద్రా కంపెనీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ కార్యాలయంలో భావన అనే యువతి ఐటీ ఉద్యోగిగా పని చేస్తోంది. ఇటీవల ఆమె ఆఫీసులో ఉండగానే అనారోగ్యానికి గురైంది. దీంతో కళ్ళు తిరిగి కిందపడిపోయింది. వెంటనే ఆమెని ఆసుపత్రికి తరలించారు. దాదాపు 14 రోజులపాటు ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందింది. అంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆమెను పరామర్శించకుండా.. ఉద్యోగం నుంచి తొలగిస్తామని కంపెనీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ ఇంటికి వచ్చిన తర్వాత.. మళ్లీ కార్యాలయానికి వచ్చింది. అయితే ఆమెకు ఉద్యోగం లేదని యాజమాన్యం తేల్చి చెప్పింది. యాజమాన్యం ఆ ప్రకటన చేయడంతో ఆమెకు ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది. దీంతో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగింది.
ఇది కేవలం భావన సమస్య మాత్రమే కాదు. దాదాపు అందరి పరిస్థితి ఇలానే ఉంది. ఏఐ రాకతో ఐటీ పరిశ్రమలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మనుషులతో అవసరం లేకుండానే టెక్నాలజీ ద్వారా పనులు సాగిపోతున్నాయి. అలాంటప్పుడు కంపెనీలకు ఉద్యోగుల అవసరం లేకుండా పోతుంది. ఉద్యోగులకు చెల్లించే డబ్బులను కంపెనీను మిగిలించుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంలో అన్ని కంపెనీలు ముందుంటున్నాయి. దీనికి టెక్ మహీంద్రా మినహాయింపు కాదు. అందువల్లే ఉద్యోగులు ఆకస్మాత్తుగా తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. అయితే భావన కంపెనీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగడమే కాకుండా.. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. అంతటితోనే ఈ కథ ముగిసిపోతుంది. ఎందుకంటే పోలీసులు టెక్ మహీంద్రా కంపెనీ మీద చర్యలు తీసుకునే అవకాశం లేదు. మహా అయితే కంపెనీకి నోటీసులు ఇస్తారు. అంతకుమించి ఈ కేసులో పురోగతి ఉండదు.. భావనకు ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉండదు.
ఐటీ ఉద్యోగం అంటే లక్షలకు లక్షలు వేతనాలు.. హై ఫై జీవితం.. లగ్జరీ విలాసాలు.. వీకెండ్ పార్టీలు.. ఇంకా చాలా సౌలభ్యాలు ఉంటాయని అనుకుంటారు. కాకపోతే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉద్యోగ ఉంటుందో ఊడుతుందో తెలియదు. మేనేజ్మెంట్ రిక్వైర్మెంట్లు ఎలా ఉన్నాయో అర్థం కాదు. టెక్నాలజీ ఎప్పుడు ఎలా అప్డేట్ అవుతుందో ఒక పట్టాన అంతుపట్టదు. ఇలాంటప్పుడు ఐటీ ఉద్యోగం అంటే గాలిలో పేక మేడ లాంటిది. కడుతున్నప్పుడు బాగానే ఉంటుంది. కూలినప్పుడే ఇదిగో భావనలాగా ఆఫీస్ ముందు ధర్నా చేయాల్సి ఉంటుంది.



