Ambati Rambabu Role Change In YSR Congress: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ సీనియర్ నేతలలో అంబటి రాంబాబు ఒకరు. పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతూ వచ్చారు. మంచి దూకుడు కలిగిన నేత. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలవడంతో మంత్రిని చేశారు. అయితే ఎన్నికల ఫలితాల తరువాత అంబటి రాంబాబుకు జగన్ ఒక ఆట ఆడుకుంటున్నారు. ఎక్కడా ఆయనను స్థిరంగా ఉంచడం లేదు. సత్తెనపల్లి ఇన్చార్జిగా ఉన్న ఆయనను అక్కడ నుంచి తప్పించారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. ఇప్పుడు అత్యంత కీలకమైన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలను ఇచ్చారు. అయితే అంబటి రాంబాబును పొమ్మన లేక పొగ పెడుతున్నారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆయనను తప్పించి పార్టీ కోసం పనిచేసేలా చేస్తారని వైసీపీలో ఒక ప్రచారం ఉంది.
వరుసగా మూడుసార్లు పోటీ
2014 నుంచి వరుసగా మూడుసార్లు సత్తెనపల్లి( sattenapalle ) నియోజకవర్గం నుంచి పోటీ చేశారు అంబటి రాంబాబు. తొలిసారిగా 2014లో పోటీ చేయగా కోడెల శివప్రసాదరావు చేతిలో ఓడిపోయారు. 2019లో మాత్రం అదే కోడెల శివప్రసాదరావు పై 20 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2024 ఎన్నికల్లో మాత్రం కన్నా లక్ష్మీనారాయణ చేతిలో ఓడిపోయారు. కొద్దిరోజుల పాటు సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న అంబటి రాంబాబును జగన్మోహన్ రెడ్డి తప్పించారు. నియోజకవర్గ బాధ్యతలను రెడ్డి సామాజిక వర్గానికి చెందిన గజ్జల సుధీర్ భార్గవరెడ్డికి ఇచ్చారు. అంబటి రాంబాబుకు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఆయనను క్రమేపి పార్టీ కోసమే ఉండేలా చూస్తారని అంతా భావించారు. అయితే ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చారు.
Also Read: Ambati Rambabu: వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు…ఎందుకంటే
టిడిపికి పట్టున్న నియోజకవర్గం
గుంటూరు పశ్చిమ( Guntur West constituent ) నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పట్టున్న ప్రాంతం. 2009లో పునర్విభజనతో ఈ నియోజకవర్గం ఏర్పాటయింది. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కన్నా లక్ష్మీనారాయణ ఇక్కడి నుంచి గెలిచారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో రెండోసారి మంత్రి అయ్యారు. 2014లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి విజయం సాధించారు. 2019లో టిడిపి అభ్యర్థి మద్దాలి గిరిధర్ గెలిచారు. జగన్ ప్రభంజనాన్ని తట్టుకొని నిలిచారు. 2024 లో మాత్రం టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన గల్లా మాధవి విజయం సాధించారు. సిట్టింగ్ మంత్రిగా ఉన్న విడదల రజిని పై భారీ విజయం సాధించారు. టిడిపికి పట్టున్న నియోజకవర్గ బాధ్యతలను ఇప్పుడు అంబటి రాంబాబుకు అప్పగిస్తుండడం విశేషం. మరి ఆయన ఎలా నెగ్గుకు వస్తారో చూడాలి.
పొమ్మనలేక పొగ?
వచ్చే ఎన్నికల నాటికి అంబటి రాంబాబును( ambati Rambabu) తప్పిస్తారని ప్రచారం ఉంది. ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పించి పార్టీ బాధ్యతలు ఆయనకు అప్పగిస్తారని టాక్ ఉంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే అంబటి రాంబాబును ఒక స్థిరమైన నియోజకవర్గ కేటాయించకుండా.. తరచూ మార్పులు చేస్తున్నారు. అయితే అంబటి రాంబాబుకు మరో ఆప్షన్ లేదు. ఇతర పార్టీల్లో చేరేందుకు అవకాశం లేదు. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండి దూకుడుగా వ్యవహరించాల్సి వస్తోంది.