Sikander Raza : బంతులు పగిలేలా.. బ్యాట్లు విరిగేలా.. సికిందర్ రజా ఊచకోత.. టి20లలో అత్యధిక స్కోరుతో జింబాబ్వే ప్రపంచ రికార్డు..

బంతివేయడమే ఆలస్యం బౌండరీ మీటర్ దాటింది. ఆటగాళ్లు ఇలా ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడటంతో జింబాబ్వే టి20 క్రికెట్లో సరికొత్త రికార్డు సృష్టించింది. గొప్ప గొప్ప జట్లకు సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 23, 2024 9:33 pm

Sikander Raza

Follow us on

Sikander Raza  : టి20 క్రికెట్లో జింబాబ్వే ప్రపంచ రికార్డు సృష్టించింది. అత్యధిక పరుగులు చేసిన టీం గా ఘనతను అందుకుంది. టి20 వరల్డ్ కప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫైయర్ మ్యాచ్లో భాగంగా గాంబియాతో జింబాబ్వే తల పడింది. ఈ మ్యాచ్లో జింబాబ్వే ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే నాలుగు వికెట్లు నష్టపోయి 344 రన్స్ చేసింది. ఈ నేపథ్యంలో t20 లలో నేపాల్ జట్టు పేరు మీద ఉన్న అత్యధిక స్కోర్ రికార్డును జింబాబ్వే ఆటగాళ్లు బద్దలు కొట్టారు. 2023లో నేపాల్ జట్టు మంగోలియా పై మూడు వికెట్లు నష్టపోయి 314 రన్స్ చేసింది. టి20లలో ఇదే హైయెస్ట్ రికార్డుగా కొనసాగుతోంది. ఈ జాబితాలో భారత్ ఇటీవల బంగ్లాదేశ్ పై సాధించిన 297/6, ఆఫ్ఘనిస్తాన్ ఐర్లాండ్ పై సాధించిన 278/3, చెక్ రిపబ్లిక్ టర్కీ పై సాధించిన 278/4 పరుగులు తర్వాతి స్థానాలలో కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు నేపాల్ రికార్డును అధిగమించడంతో.. జింబాబ్వే తొలి స్థానంలోకి వచ్చింది. ఇన్నాళ్లు హైయెస్ట్ రికార్డుగా ఉన్న నేపాల్ స్కోర్ సెకండ్ ప్లేస్ లోకి వెళ్లిపోయింది..

290 రన్స్ తేడాతో..

గాంబియాతో జరిగిన మ్యాచ్లో జింబాబ్వే 290 పరుగుల భారీ వ్యత్యాసంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా 43 బంతుల్లో 133 రన్స్ చేసి, అజేయంగా నిలిచాడు. అతడు ఏడు ఫోర్లు, 15 సిక్సర్లు కొట్టి మైదానంలో వీరవిహారం చేశాడు.. అతనితోపాటు బ్రియాన్(50), మారుమణి(62), క్లైవ్ మదండే(53) పరుగులతో సత్తా చాటారు.. ఓపెనర్లు బెన్నెట్, మారుమణి ప్రారంభిం నుంచే వీర విహారం చేశారు. వీరిద్దరూ తొలి వికెట్లు 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అది కూడా 34 బంతుల్లోనే చేయడం విశేషం. ఆ తర్వాత వన్ డౌన్ లో వచ్చిన మేయర్స్ 12 పరుగులకే అవుట్ అయ్యాడు. ఇక ఈ దశలో వచ్చిన కెప్టెన్ సికిందర్.. మైదానంలో సునామీని సృష్టించాడు. సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతూ గాంబియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. చివరికి క్లైవ్ కూడా ఇష్టానుసారంగా ఫోర్లు కొట్టడంతో గాంబియా బౌలర్లు బెంబేలెత్తి పోయారు. గాంబియా బౌలర్లలో ఆండ్రి (2/53), అర్జున్ సింగ్ (1/51), బబుకర్ (1/57) వికెట్లు సాధించినప్పటికీ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.

54 పరుగులకే..

అనంతరం గాంబియా బ్యాటింగ్ కు దిగింది. కేవలం 54 పరుగులకే ఆల్ అవుట్ అయింది. 14.4 లోనే ఆ జట్టు చాప చుట్టింది. ఆ జట్టులో ఆండ్రి చేసిన 12 పరుగులే హైయెస్ట్ స్కోర్ కావడం విశేషం. ఇక జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్, బ్రాండన్ చెరో మూడు వికెట్లు సాధించారు.. అయితే మైదానం నిర్జీవంగా ఉండడంతో జింబాంబే బ్యాటర్లు పండగ చేసుకున్నారు. పైగా గాంబియా బౌలర్లలో ఎవరికి పెద్దగా అనుభవం లేకపోవడంతో.. జింబాబ్వే ఆటగాళ్లు రెచ్చిపోయారు. మైదానంలో వీరవిహారం చేశారు. నేపాల్ రికార్డును బద్దలు కొట్టి.. టి20 లలో పెద్ద పెద్ద జట్లకు సాధ్యం కాని రికార్డును సృష్టించారు. 344 రన్స్ చేసి.. టి20 లోనే హైయెస్ట్ స్కోర్ చేసిన టీం గా జింబాబ్వేను నిలిపారు. కాగా, ఇటీవల భారత జట్టుతో జింబాబ్వే 5 టి20 మ్యాచ్ ల సిరీస్ ఆడి..1-4 తేడాతో ఓటమిపాలైంది. తొలి టి20లో గెలిచిన జింబాబ్వే జట్టు.. అదే మ్యాజిక్ మిగతా మ్యాచ్లలో కొనసాగించలేకపోయింది. అయితే టీమిండియా యువ ఆటగాళ్లతో ఈ టోర్నీ ఆడటం విశేషం.