WTC Final 2023 India Vs Australia
WTC Final 2023 India Vs Australia: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడిన భారత్, ఆస్ట్రేలియా జట్లకు ఐసీసీ గట్టి షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా రెండు దేశాలు జట్లకు భారీ జరిమానాను విధించింది. ఇరు జట్లకు ఫీజుల్లో కోత విధిస్తూ ఐసిసి నిర్ణయం తీసుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయిన భారత జట్టుకు ఇది పుండు మీద కారం చల్లినట్టుగా అయింది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ఈనెల ఏడో తేదీ నుంచి 11 తేదీల మధ్య ఇంగ్లాండ్ లోని ఓవల్ వేదికగా జరిగింది. ఈ టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 200కు పైగా పరుగులు తేడాతో ఆస్ట్రేలియా జట్టు భారత్ పై విజయం సాధించింది. టెస్ట్ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేంతవరకు ఏ దశలోనూ భారత జట్టు ఆస్ట్రేలియాకు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. టాప్ ఆర్డర్ మొత్తం రెండు ఇన్నింగ్స్ లోను ఘోరంగా విఫలం కావడంతో భారత జట్టు దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకుంది. ఓటమితో కుంగిపోతున్న భారత జట్టుకు ఐసీసీ మరో షాక్ ఇచ్చింది.
ఇరు జట్లకు భారీగా జరిమానా విధించిన ఐసీసీ..
డబ్ల్యూటిసి ఫైనల్ మ్యాచ్ ఆడిన భారత్, ఆస్ట్రేలియా జట్లకు ఐసీసీ గట్టి షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా రెండు దేశాల జట్లకు భారీగా జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. భారత జట్టుకు 100 శాతం, ఆస్ట్రేలియా జట్టుకు 80 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించింది. ఇక భారత ఓపెనర్ గిల్ కు ఏకంగా 115 శాతం ఫైన్ వేసింది. గిల్ అవుట్ పై వివాదం చెలరేగగా.. అతడు కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించాడని ఐసిసి పేర్కొంది. దీంతో గిల్ కు ఐసీసీ జరిమానా విధించింది.
పుండు మీద కారం చల్లినట్టుగా ఐసిసి వ్యవహారం..
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు ఓటమితో స్వదేశానికి తిరిగి వచ్చింది. జట్టు ఆడిన తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దశలో టోర్నీ ఆడిన ఆటగాళ్లు బయట మాట్లాడేందుకు కూడా ఆసక్తి చూపించడం లేదు. ఈ తరుణంలో ఐసీసీ జట్టుకు జరిమానా విధించి మరింత ఇబ్బందులకు గురి చేసిందన్న భావన ఆటగాళ్లలో వ్యక్తమవుతోంది. ఇప్పటికే మంచి వేడి మీద ఉన్న అభిమానులకు ఇది మరింత ఆగ్రహాన్ని తెప్పించేదిగా ఉంది అంటూ ఆటగాళ్లు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.