IND VS NZ Test Match : పది వికెట్లు.. 107 పరుగులు.. కాచుకున్న వరుణుడు.. బెంగళూరు టెస్ట్ లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు..

న్యూజిలాండ్ విజయం సాధించాలంటే 107 పరుగులు కావాలి.. భారత్ గెలవాలంటే 10 వికెట్లు దక్కించుకోవాలి. గత చరిత్రను ఒకసారి పరిశీలిస్తే టీమిండియా స్వల్ప స్కోర్ ను కాపాడుకుంది. అంతటి ఆస్ట్రేలియా మీద కూడా విజయం సాధించింది. మరి ఆదివారం నాటి న్యూజిలాండ్ జట్టుపై ఎలాంటి ప్రదర్శన చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 20, 2024 11:15 am

IND VS NZ Test Match

Follow us on

IND VS NZ Test Match :  శనివారం న్యూజిలాండ్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్న భారతీయ బ్యాటర్లు.. చివరి దశలో చేతులెత్తేశారు. హెన్రీ, ఓరూర్కే దెబ్బ కొట్టడంతో భారత్ ఒక్కసారిగా తడబడింది. కేవలం 52 పరుగుల తేడాతో చివరి 7 వికెట్లను నష్టపోయింది. దీంతో న్యూజిలాండ్ ఎదుట 107 పరుగుల లక్ష్యం మాత్రమే ఉంచగలిగింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఛేదిస్తుందా.. లేకుంటే వర్షం కురిస్తే చివరి రోజు ఆట తుడిచి పెట్టుకు పోతుందా? అనేది మరికొద్ది క్షణాల్లో తేలుతుంది. ఒకవేళ అద్భుతం జరిగితే 20 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా పై సాధించినట్టుగా.. ఆ న్యూజిలాండ్ జట్టుపై కూడా అద్భుతమైన విజయం మన ఖాతాలో చేరిపోతుంది. సరిగమ 36 సంవత్సరాల క్రితం ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా మనపై న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది. ఆ మ్యాచ్ లో న్యూజిలాండ్ దిగ్గజ బౌలర్ రిచర్డ్ హ్యాడ్లీ పది వికెట్లు తీసి.. జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. తర్వాత ఈ సంవత్సరాలకు భారత జట్టుపై గెలిచే అవకాశం న్యూజిలాండ్ జట్టుకు దక్కింది.. శనివారం ఓవర్ నైట్ స్కోర్ 231/3 తో నాలుగో రోజు టీమిండియా రెండవ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. సర్ఫరాజ్ ఖాన్ 150, రిషబ్ పంత్ 99 పరుగులు చేయడంతో భారత్ ఏకంగా 462 రన్స్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో డక్ అవుట్ అయినప్పటికీ.. సెకండ్ ఇన్నింగ్స్ లో సర్ఫరాజ్ అద్భుత బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. సీనియర్ ఆటగాళ్లు నిరాశపరిచినప్పటికీ.. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. భారత జట్టును రేసులో ఉంచాడు. ఇక రిషబ్ పంత్ ఒక్క పరుగు తేడాతో సెంచరీ కోల్పోయినప్పటికీ.. సర్ఫరాజ్ తో అద్భుతమైన భాగస్వామ్యం నిర్మించాడు. మ్యాట్ హెన్రీ, ఓరూర్కే చెరో మూడు వికెట్లు సాధించడంతో టీమిండియా వరుస విరామాలలో రాహుల్ (12), జడేజా (5), అశ్విన్ (15), బుమ్రా(0), సిరాజ్(0) ఔటయ్యారు.

కొత్తబంతి ఎంచుకుని..

న్యూజిలాండ్ కెప్టెన్ కొత్త బంతి ఎంచుకొని ఫలితాన్ని రాబట్టాడు.. అప్పటిదాకా భారత బ్యాటర్లు న్యూజిలాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. అయితే ఎప్పుడైతే న్యూజిలాండ్ కెప్టెన్ కొత్త బంతిని ఎంచుకున్నాడో.. అప్పుడే మ్యాచ్ టర్న్ అయింది. దీంతో భారత్ కేవలం 54 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఫలితంగా న్యూజిలాండ్ ఎదుట 107 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది.

బౌలర్లకు అనుకూలంగా..

బెంగళూరు మైదానం క్రమేపి బౌలర్లకు అనుకూలంగా మారుతుంది. శనివారం ఉదయం మొత్తం బ్యాటర్లకు అనుకూలించిన మైదానం.. వర్షం కురిసి.. తెరిపినివ్వగానే బౌలర్లకు అనుకూలంగా మారింది. మరోవైపు టీమిండియా విధించిన రన్స్ టార్గెట్ మరీ అంత పెద్దది కాకపోవడం న్యూజిలాండ్ జట్టుకు అనుకూలించే విషయం. అయితే బుమ్రా, సిరాజ్, జడేజా, అశ్విన్ తో బలంగా ఉన్న భారత బౌలింగ్ జట్టును న్యూజిలాండ్ ఆటగాళ్లు ఏ మేరకు కాచుకుంటారనే దానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే బుమ్రా తనదైన రోజు అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. అతడు మాత్రమే అశ్విన్, జడేజా, సిరాజ్ సంచలనాలు సృష్టించగలరు. ఇటీవలి బంగ్లా సిరీస్ లో అశ్విన్, జడేజా ఏ స్థాయిలో ప్రతిభ చూపారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఒకవేళ టీమిండియా బౌలర్లు స్థాయికి మించి రాణిస్తే న్యూజిలాండ్ జట్టుకు కష్టాలు తప్పవు. మొత్తంగా అద్భుతాన్ని ఆవిష్కరించాలని న్యూజిలాండ్ జట్టు భావిస్తుంటే.. గత రికార్డును ఏమాత్రం చెక్కు చెదరనీయకుండా ఆట తీరు ప్రదర్శించాలని భారత్ యోచిస్తోంది.