Afro Asia Cup : విరాట్ కోహ్లీ.. బాబర్ అజాం ఒకే టీమ్ లో.. ఇదెక్కడి ట్విస్ట్ రా మావ..

ఒకే అరలో రెండు కత్తులు ఇమడవు. అయితే ఈ నానుడి క్రికెట్ కు వర్తించదు. మైదానంలో బద్ధ శత్రువులుగా ఉన్న ఆటగాళ్లు అప్పుడప్పుడు కలిసి ఆడాల్సి వస్తుంది. భుజం మీద చేతులు వేసుకొని కబుర్లు కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. త్వరలో ఇలాంటి సన్నివేశమే చోటు చేసుకోనుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 12, 2024 6:35 pm

Afro Asia Cup

Follow us on

Afro Asia Cup : దేశాల మధ్య నెలకొన్న విభేదాల వల్ల.. పాకిస్తాన్ – భారత జట్ల మధ్య మ్యాచ్ అంటేనే హై టెన్షన్. వన్డే, టి20, టెస్ట్.. ఫార్మాట్ మాత్రమే తేడా.. నెలకొనే ఉత్కంఠ మాత్రం ఒకటే. భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు ప్రేక్షకులు కూడా టీవీలకు కళ్ళు అప్పగించుకుంటారు. మ్యాచ్ చూస్తున్నంత సేపు భావోద్వేగాలను నియంత్రించుకోలేక పోతారు. అయితే ఇటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో భారత జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ, పాకిస్తాన్ వన్డే, టి20 కెప్టెన్ బాబర్ అజాం త్వరలో కలిసి ఆడబోతున్నారు. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. ఇది ముమ్మాటికి నిజం..

తెరపైకి ప్రతిష్టాత్మక టోర్నీ..

మరుగున పడిన ఆఫ్రో ఆసియా కప్ ను మళ్లీ నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ఆఫ్రికన్ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ సుమోద్ దామోదర్ ఈ టోర్నీని పట్టాలు ఎక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. జై షా ఐసీసీ చైర్మన్ గా బాధితులు స్వీకరించిన అనంతరం ఈ టోర్నీ మళ్ళీ ప్రారంభం కావడం ఖాయమనిపిస్తోంది. 2005లో ఆఫర్ ఆసియా కప్ తొలిసారిగా నిర్వహించారు. ఈ టోర్నీలో ఆఫ్రికా లెవన్ వర్సెస్ ఆసియా లెవెన్ జట్లు పోటీపడ్డాయి. ఈ పోటీలో వీరేంద్ర సెహ్వాగ్, ఇంజమామ్ ఉల్ హక్ వంటి ఆటగాళ్లు కలిసి ఆడారు. 2007లో జరిగిన రెండో ఎడిషన్ లో గంగూలీ, మహేంద్ర సింగ్ ధోని అదరగొట్టారు. ఆ తర్వాత మరో టోర్నీ జరగలేదు. 17 సంవత్సరాల తర్వాత ఈ టోర్నీ మళ్ళీ ప్రారంభించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. క్రికెట్లో చోటు చేసుకున్న మార్పుల నేపథ్యంలో టి20 తరహాలోనే ఈ టోర్నీ నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆఫ్రో ఆసియా కప్ లో ఆసియా దేశాలు ఒక బృందంగా, ఆఫ్రికన్ దేశాలు మరో బృందంగా తరపడతాయి. ఆసియా లెవన్ లో భారత్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉంటారు. ఆఫ్రికా లెవన్ లో కెన్యా, జింబాబ్వే, నమిబియా, సౌత్ ఆఫ్రికా దేశాల ఆటగాళ్లు ఉంటారు.. ప్రస్తుత గణాంకాల ప్రకారం చూసుకుంటే ఆసియా జట్టు మీద ఆఫ్రికా జట్టు నిలబడే అవకాశాలు కనిపించడం లేదు. ఆఫ్రికాలో కేవలం దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మాత్రమే స్థిరమైన ప్రదర్శన ఇవ్వగలరు. ఒకవేళ ఈ టోర్నీ కనక జరిగితే మ్యాచ్ లు మొత్తం ఏకపక్షంగా మారుతాయి. అయితే ఇందులో బద్ద శత్రువుల లాగా ప్రతిసారీ నువ్వా నేనా అన్నట్టు పోటీపడే భారత్ – పాకిస్తాన్ ఆటగాళ్లు ఒకే జట్టు తరఫున ఆడతారు. అది ఒకరకంగా అభిమానులకు సంతోషం కలిగించే అంశం.