India vs Pakistan : టాస్ కాయిన్ మరిచిపోయిన రోహిత్ శర్మ.. బాబర్ సహా అంతా నవ్వులే నవ్వులు.. వైరల్ వీడియో

ఈ దశలో కాయిన్ గాల్లోకి ఎగరేయాలని రోహిత్ కు రవి శాస్త్రి సూచించాడు.. ఈ క్రమంలో కాయిన్ ఎక్కడ ఉందని మ్యాచ్ రిఫరీని రోహిత్ అడిగాడు. మీ దగ్గరే ఉంది కదా అని బదులు ఇచ్చాడు.

Written By: NARESH, Updated On : June 10, 2024 11:32 am

Rohit-Sharma-forgets-he-had-coin

Follow us on

India vs Pakistan : న్యూయార్క్ వేదికగా పాకిస్తాన్ – భారత జట్ల మధ్య జరిగిన టి20 మ్యాచ్ అనుక్షణం ఉత్కంఠ కలిగిస్తే.. అంతకు ముందు జరిగిన సంఘటన నవ్వులు పూయించింది. టాస్ వేసేందుకు రెండు జట్ల కెప్టెన్లు, మ్యాచ్ రిఫరీ, హోస్ట్ రవి శాస్త్రి అందరు సిద్ధంగా ఉన్నారు.. అయినప్పటికీ టాస్ వేసే ప్రక్రియ చాలా ఆలస్యమైంది. దీంతో కాయిన్ కోసం అందరూ వెతికారు. ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే

టి20 వరల్డ్ కప్ లో భారత్, పాకిస్తాన్ గ్రూప్ – ఏ లో ఉన్నాయి. ఈ రెండు జట్ల మధ్య ఆదివారం రాత్రి 8 గంటలకు (భారత కాలమానం ప్రకారం) మ్యాచ్ జరగాల్సి ఉంది. మ్యాచ్ కు అర గంటకు ముందు టాస్ వేయాల్సి ఉంది. అక్కడ చిరుజల్లులు కురవడంతో టాస్ వేసే ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో అవుట్ ఫీల్డ్ ను పరదాలతో కప్పి ఉంచారు. మైదానం అప్పటికి తడిగా ఉండడంతో టాస్ వేయడం ఆలస్యమైంది. చివరికి మైదానాన్ని సిద్ధం చేయడంతో, టాస్ వేసే ప్రక్రియలో పాలుపంచుకునేందుకు రెండు జట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, బాబర్ అజాం పిచ్ దగ్గరికి వచ్చారు.

ఈ దశలో కాయిన్ గాల్లోకి ఎగరేయాలని రోహిత్ కు రవి శాస్త్రి సూచించాడు.. ఈ క్రమంలో కాయిన్ ఎక్కడ ఉందని మ్యాచ్ రిఫరీని రోహిత్ అడిగాడు. మీ దగ్గరే ఉంది కదా అని బదులు ఇచ్చాడు. దీంతో రోహిత్ తన జేబులో ఒకసారి పరిశీలించాడు. ఆ తర్వాత అందులో నుంచి కాయిన్ తీయడంతో మైదానంలో ఉన్న రవి శాస్త్రి, మ్యాచ్ రిఫరీ, బాబర్ అజాం విరగబడి నవ్వారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.. టాస్ వేసే సమయంలో రోహిత్ మతిమరుపునకు గురవడం ఇదే తొలిసారి కాదు. డ్రెస్సింగ్ రూమ్ లో తీసుకున్న నిర్ణయాలను టాస్ గెలిచిన తర్వాత రోహిత్ చాలాసార్లు మర్చిపోయాడు. ఎంతోసేపు ఆలోచించి వాటిని తిరిగి గుర్తుకు తెచ్చుకునే వాడు.. రోహిత్ చేసిన పని వల్ల అక్కడ హాస్య సన్నివేశం చోటుచేసుకుంది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజెన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.