Duleep Trophy 2024 : తొలి మ్యాచ్లో రిజర్వు బెంచ్ కు పరిమితం చేశారు కదరా.. ఇప్పుడు చూడండి తెలుగోడి సత్తా.. సెంచరీ చేసి మీకు సవాల్ విసిరాడు..

ప్రతిష్టాత్మకమైన దేశవాళి క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీ ఉత్కంఠ గా సాగుతోంది. ఈ టోర్నీలో తెలుగు కుర్రాడు సంచలన ప్రదర్శన చేశాడు. సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 14, 2024 8:38 pm

Duleep Trophy 2024

Follow us on

Duleep Trophy 2024 : తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఇండియా – ఏ జట్టుకు ఆడుతున్నాడు. ఇండియా – డీ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో రెండవ ఇన్నింగ్స్ లో తిలక్ వర్మ 193 బంతులలో 111 పరుగులు చేశాడు. దులీప్ ట్రోఫీలో తిలక్ వర్మ ను రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేశారు. అయితే రెండవ మ్యాచ్ కు స్టార్ ఆటగాళ్లు గైర్హాజరు కావడంతో.. అతడికి అవకాశం లభించింది. తొలి ఇన్నింగ్స్ లో తిలక్ వర్మ 10 పరుగులు మాత్రమే చేశాడు. రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం అదరగొట్టాడు. 96 బంతుల్లో అర్ద సెంచరీ, మిగతా 50 పరుగులు 81 బంతుల్లో చేసి మొత్తానికి శతకం సాధించాడు. మొత్తంగా తిలక్ వర్మకు ఇది ఐదవ ఫస్ట్ క్లాస్ సెంచరీ. అనంతపురం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో.. తిలక్ వర్మ సెంచరీ చేయడం తెలుగు వాళ్ళకు సంతోషాన్ని కలిగించింది. తిలక్ వర్మ తో పాటు ఓపెనర్ ప్రథమ్ సింగ్(122) శతకం సాధించి సత్తా చాటాడు. ఫలితంగా ఇండియా – ఏ జట్టు మూడు వికెట్ల నష్టానికి 380 పరుగులు చేసి.. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇండియా – ఏ జట్టులో కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 56, రియాన్ పరాగ్ 20 పరుగులు చేసి అవుట్ అయ్యారు. శాశ్వత్ రావత్ 64 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇండియా – డీ జట్టు బౌలర్లు సౌరభ్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ ఒక వికెట్ సాధించాడు.

రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేశారు

అంతకుముందు ఇండియా – ఏ తొలి ఇన్నింగ్స్ లో 290 పరుగులు చేసింది. షామ్స్ ములానీ(89), తనుష్ కోటియన్ (53) పరుగులు చేశారు. ఇండియా – డీ జట్టు బౌలర్లలో హర్షిత్ రాణా నాలుగు వికెట్లు పడగొట్టాడు. విద్యుత్ కావేరప్ప, అర్ష్ దీప్ సింగ్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. సౌరభ్ కుమార్, శరన్ష్ జైన్ తలా ఒక వికెట్ సాధించారు. ఇక ఇండియా – డీ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 183 పరుగులకు కుప్ప కూలింది. దేవదత్ పడిక్కల్ 92 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.. ఇండియా – ఏ బౌలర్ల లో ఖలీల్ అహ్మద్, అకీబ్ ఖాన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. కాగా, స్టార్ ఆటగాళ్ళు ఎంట్రీ ఇవ్వడంతో తొలి మ్యాచ్ లో తిలక్ వర్మకు అవకాశం లభించలేదు. దీంతో అతడు రిజర్వ్ బెంచ్ కు పరిమితం కావలసి వచ్చింది.

వారి నిష్క్రమణతో అవకాశం ఇచ్చారు

సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్ జట్టుతో భారత్ తొలి టెస్ట్ ఆడుతున్న నేపథ్యంలో.. జాతీయ జట్టుకు ఎంపికైన ఆటగాళ్లు దులీప్ ట్రోఫీ నుంచి నిష్క్రమించారు. దీంతో రెండో మ్యాచ్ కు తిలక్ వర్మ కు అవకాశం లభించింది. ఇండియా – ఏ జట్టుకు అతడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తెలుగు గడ్డపై సెంచరీ తో కదం తొక్కాడు . తనను రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేసిన వారికి సెంచరీతో సమాధానం చెప్పాడు. కాగా, ఇండియా ఏ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 290 ఆలౌట్ అయింది. ఇండియా – డీ జట్టు 183 పరుగులకు కుప్పకూలింది. రెండవ ఇన్నింగ్స్ ను ఇండియా జట్టు 380/3 వద్ద డిక్లేర్ చేసింది. ఇక ఇండియా- డీ జట్టు రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించింది.. శనివారం ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 62 పరుగులు చేసింది. ఇండియా – డీ జట్టు విజయానికి ఇంకా 426 రన్స్ అవసరం.