Team India trophy win analysis: వరుసగా రెండవసారి టీమిండియా టి20 వరల్డ్ కప్ ఫైనల్లోకి వచ్చేసింది. 2024లో టి20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా.. రెండు సంవత్సరాలు గడవకముందే మళ్లీ అదే స్థాయి ఆట తీరుతో ఆకట్టుకుంది. ఏకంగా ఫైనల్ దాకా వచ్చేసింది. సూపర్ 8 లో దక్షిణాఫ్రికా చేతిలో బంగపాటుకు గురైనప్పటికీ.. త్వరగానే బౌన్స్ బ్యాక్ ఆట తీరుతో టీమిండియా ఫైనల్ వచ్చేసింది.
టీమిండియా ఫైనల్ వచ్చినప్పటికీ ఆటగాళ్ల ఆట తీరు పట్ల అభిమానులు అంతగా సంతృప్తితో లేరు. ముఖ్యంగా కొంతమంది ఆటగాళ్లు ఆడుతున్న తీరు అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. తుఫాన్ ఇన్నింగ్స్ ఆడతాడని భావించిన అభిషేక్ శర్మ సింగిల్ డిజిట్ స్కోర్ లతో పోటీ పడుతున్నాడు. మొదట్లో సున్నాలు చుట్టిన అతడు.. ఇప్పుడు సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితమవుతున్నాడు. నిర్లక్ష్యమైన బ్యాటింగ్ చేస్తూ.. ఏమాత్రం శ్రద్ధ లేకుండా ఆడుతున్నాడు. వరుసగా అవకాశాలు వస్తున్నప్పటికీ వాటిని ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు.
అభిషేక్ శర్మ విఫలమవుతున్న నేపథ్యంలో జట్టులోకి రింకు సింగ్ ను తీసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఎందుకంటే రింకు సింగ్ అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో దూకుడుగా ఆడగలడు. శివం దుబే లాంటి ఆటగాడికి రింకు సింగ్ తోడైతే మ్యాచ్ స్వరూపాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో రింకు ఒత్తిడికి గురయ్యాడు.
వరుణ్ చక్రవర్తి ఈ టోర్నీలో దారుణంగా పరుగులు ఇస్తున్నాడు. అసలు ఏమాత్రం వైవిద్య భరితమైన బంతులు వేయలేకపోతున్నాడు. అతడి బౌలింగ్ లోపాన్ని గుర్తించిన ప్రత్యర్థి బ్యాటర్లు పండగ చేసుకుంటున్నారు. ఏమాత్రం భయం అనేది లేకుండా బ్యాటింగ్ చేస్తున్నారు. తద్వారా వరుణ్ చక్రవర్తి వికెట్ టేకర్ గా కాకుండా.. రన్స్ గీవర్ గా మారిపోతున్నాడు. ఫైనల్ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తికి బదులుగా కులదీప్ యాదవ్ ను తీసుకోవాలని విశ్లేషకులు కోరుతున్నారు.
ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ దారుణంగా విఫలమయ్యారు. వరుణ్ చక్రవర్తి విపరీతంగా పరుగులు ఇస్తే.. అభిషేక్ శర్మ నిర్లక్ష్య పూరితమైన బ్యాటింగ్ చేసి జట్టు మీద ఒత్తిడి పెంచారు. వీరిద్దరిని ఫైనల్ మ్యాచ్ కు దూరంగా పెట్టాలని.. అప్పుడే టీమిండియా కు అనుకూలమైన ఫలితం వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఇంగ్లాండ్ జట్టుతో మ్యాచ్ ముగిసిన తర్వాత గౌతమ్ గంభీర్, ఇంకా కొంతమంది కీలక వ్యక్తులు భేటీ అయ్యారని.. బహుశా అందులో కీలకమైన నిర్ణయాలు తీసుకొని ఉంటారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.