YS Sharmila out of Congress: దక్షిణాది రాష్ట్రాలపై( South States ) కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక గురి పెట్టింది. ఇప్పటికే తెలంగాణతో పాటు కర్ణాటకలో ఆ పార్టీ అధికారంలో ఉంది. తమిళనాడులో డీఎంకే నేతృత్వంలో భాగస్వామ్య పార్టీగా కొనసాగుతోంది. అయితే వచ్చే ఎన్నికల నాటికి దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలని చూస్తోంది. అందులో భాగంగా ఏపీ పై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే నాయకత్వ మార్పు ద్వారా ఏపీలో ముందుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. వైయస్ షర్మిల మార్పు ఉంటుందన్న ప్రచారం నడుస్తోంది. ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పార్టీ జిల్లాల అధ్యక్షులతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. ఏపీ అధ్యక్షురాలు షర్మిల పనితీరుపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఏపీలో నాయకత్వ మార్పు దిశగా అడుగులు వెయ్యనున్నట్లు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. జాతీయస్థాయిలో షర్మిల సేవలను వినియోగించుకుని.. కొత్త నేతకు ఏపీ పగ్గాలు అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మూడేళ్ల క్రిందట నియామకం..
తెలంగాణలో( Telangana) తన తండ్రి వైయస్సార్ పేరిట ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేసుకున్నారు షర్మిల. సుదీర్ఘకాలం ఆ రాష్ట్రంలో పాదయాత్ర కూడా చేశారు. కానీ పెద్దగా వర్కౌట్ కాకపోయేసరికి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. తెలంగాణలో ఏదో ఒక చోట పోటీ చేయాలని భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం షర్మిలకు ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పగించింది. అయితే ఆమె బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అవుతున్న కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి పురోగతి లేదు. పైగా సీనియర్లను ఆమె నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శ ఉంది. అందుకే నాయకత్వ మార్పు ఉంటుందన్న ప్రచారం మరింత ఎక్కువ అవుతోంది.
కేంద్ర మాజీ మంత్రికి పగ్గాలు..
తాజా రాజకీయం ప్రచారం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలు సీనియర్ నేత పళ్లం రాజుకు( Palam Raju ) అప్పగిస్తారని ప్రచారం నడుస్తోంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో నరసాపురం ఎంపీగా ఎన్నికయ్యారు పల్లంరాజు. కేంద్ర రక్షణ మంత్రిగా కూడా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీలో వివాద రహితుడిగా ఆయనకు పేరు ఉంది. ఆయన అయితే సీనియర్లు కూడా సమన్వయం చేసుకుంటారని హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన సైతం కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ వెన్నంటే నడిచారు. ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చినా వెళ్ళలేదు. అందుకే ఆయన నియామకం పై కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.