Sultan of Johor Cup 2024: టీమిండియా బెంబేలెత్తించింది.. కివీస్ వణికిపోయింది.. పతకం మన సొంతమైంది.. ఇంతకీ ఎందులోనంటే..

బెంగళూరు టెస్ట్ లో ఓటమి.. పూణే టెస్టులోనూ పరాజయం.. మొత్తంగా మూడు టెస్టుల సిరీస్ 0-2 తేడాతో పర్యాటక న్యూజిలాండ్ జట్టు వశం.. దీంతో భారత అభిమానులు నిరాశలో మునిగిపోయారు. సోషల్ మీడియాలో నిర్వేదాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : October 27, 2024 10:10 am

Sultan of Johor Cup 2024

Follow us on

Sultan of Johor Cup 2024: ఇంతటి బాధలో ఉన్న టీమిండియా అభిమానులకు శుభవార్త. టి20 వరల్డ్ కప్ లో మహిళల జట్టును లీగ్ దశలో ఓడించిన న్యూజిలాండ్ పై ప్రతీకారం తీర్చుకున్నామని సగటు భారత అభిమాని సంబరపడిపోయే అద్భుతమైన వార్త ఇది. ఎందుకంటే టీం ఇండియా న్యూజిలాండ్ పై గెలిచింది కాబట్టి. ఏకంగా కాంస్యం పతకం సాధించింది కాబట్టి.. మువ్వన్నెల జెండాను గగన వీధిలో రెపరెపలాడించింది కాబట్టి.. హాకీ లో ప్రతిష్టాత్మకమైన ట్రోఫీగా సుల్తాన్ ఆఫ్ జొహర్ కప్ కు పేరు ఉంది. ఈ టోర్నీలో న్యూజిలాండ్, భారత్ శనివారం తలపడ్డాయి. ఉత్కంఠ గా సాగిన ఈ మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించింది. దీంతో కాంస్య పతకాన్ని సాధించింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్లో న్యూజిలాండ్, భారత జట్ల స్కోర్లు సమం అయ్యాయి. దీంతో మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించేందుకు షూట్ అవుట్ నిర్వహించారు. ఇందులో భారత్ 3-2 తేడాతో న్యూజిలాండ్ జట్టును ఓడించి కంచు నూతన మోగించింది. బెంగళూరు, పూణే టెస్టుల ఓటమి, అంతకుముందు టి20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ పరాజయం.. వంటి నిరాశలతో దిగాలుగా ఉన్న అభిమానులు.. హాకీ లో విజయం సాధించడంతో కాస్త ఉపశమనం పొందుతున్నారు.

మలేషియాను ఓడించి..

ఈ టోర్నీలో కాంస్యం దక్కించుకోవడానికి భారత జట్టు అర్హత సాధించింది. ఆ అర్హత పోరులో భాగంగా మలేషియా జట్టుతో తలపడింది. ఆ జట్టును ఓడించి కాంస్యం దక్కించుకోవడానికి రంగంలోకి దిగింది. ఈ క్రమంలో న్యూజిలాండ్ జట్టుతో పోటీపడింది. మ్యాచ్ ప్రారంభమైన 11 నిమిషంలో భారత ఆటగాడు గురుజోత్ సింగ్ తొలి గోల్ సాధించాడు. ఆ తర్వాత మన్మీత్ సింగ్ ఆట ప్రారంభమైన 20 నిమిషంలో గోల్ కొట్టాడు. ఇక న్యూజిలాండ్ తరఫున మ్యాచ్ చివరి అర్ధ భాగంలో బ్రెయిన్ 51 నిమిషంలో గోల్ సాధించాడు. జాంటీ ఎల్ ఎస్ 57వ నిమిషంలో గోల్ కొట్టాడు. ఫలితంగా నిర్మిత సమయం ముగిసే నాటికి రెండు జట్లు 2-2 గోల్స్ తో సమానంగా నిలిచాయి. దీంతో మ్యాచ్ లో ఫలితాన్ని తేల్చేందుకు రెఫరీలు షూట్ అవుట్ నిర్వహించారు. ముందుగా టీమిండియా తరఫున గురు జ్యోత్ సింగ్, మన్ మీత్ సింగ్, సౌరభ్ ఆనంద్ పెనాల్టిలను గోల్స్ గా మార్చారు. ఇక న్యూజిలాండ్ ఆటగాళ్ల గోల్ ప్రయత్నాలను భారత కీపర్ బిక్రమ్ జీత్ సింగ్ ఒక గోడలాగా నిలువరించాడు. అతడు ఏకంగా మూడు గోల్స్ అడ్డుకున్నాడు. దీంతో టీమిండియా 3-2 తేడాతో న్యూజిలాండ్ పై విజయం సాధించింది. కాంస్యాన్ని సాధించింది. అయితే టీమ్ ఇండియా కాంస్యం దక్కించుకోవడంలో కోచ్ పి ఆర్ శ్రీజేశ్ ముఖ్యపాత్ర పోషించాడు. పారిస్ ఒలింపిక్స్ లో టీమిండియాను విజయవంతంగా ముందు నడపడంలో శ్రీ జేష్ ప్రముఖ పాత్ర పోషించాడు. ఆ తర్వాత జట్టుకు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం జూనియర్ హాకీ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. అతడి నాయకత్వంలో భారత జట్టు వరుస విజయాలు సాధిస్తోంది. క్రికెట్లో భారత జట్టు తలవంచినప్పటికీ.. హాకీలో మాత్రం న్యూజిలాండ్ జట్టును భారత్ జట్టు ఓడించింది. ఏకంగా కాంస్యం దక్కించుకుంది. భారత హాకీ జట్టు న్యూజిలాండ్ జట్టును ఓడించి కాంస్యం దక్కించుకోవడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో భారత హాకీ జట్టు ఆటగాళ్లను అభినందిస్తున్నారు.