Shreyas Iyer Comeback Opportunity: ఇది చాలా సంవత్సరాలుగా అనుకుంటున్న మాటే. కానీ అది వాస్తవ రూపం దాల్చలేదు. పైగా అతనికి జట్టులో స్థానం కూడా స్థిరంగా లేదు. దీంతో అతడి గురించి రకరకాల విమర్శలు.. ఆరోపణలు వచ్చాయి. వీటన్నిటిని తట్టుకుంటూ ఇప్పుడు అతడు అనుకున్న స్థానానికి చేరుకున్నాడు. విమర్శకుల నోటికి సరైన విధంగా తాళం వేశాడు. అతడు మరెవరు కాదు శ్రేయస్ అయ్యర్.
డొమెస్టిక్ క్రికెట్ లో అయ్యర్ అద్భుతమైన ప్రతిభ చూపించాడు. అనేక సందర్భాలలో అతనికి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారని చర్చ జరిగినప్పటికీ అది సాధ్యం కాలేదు. అంతేకాదు అతడికి జట్టులో స్థానం కూడా స్థిరంగా లేకుండా పోయింది.. కొన్ని సందర్భాలలో t20.. టెస్ట్ జట్లలో అతడికి అవకాశం కూడా లభించలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత అతడికి అనుకున్న సమయం వచ్చింది. టీమ్ ఇండియా టి20 సారధిగా అతడికి అవకాశం లభించింది.
కొంతకాలంగా ఐపీఎల్లో అదరగొడుతున్నాడు.. ఉదాహరణకు గత మూడు సీజన్లను పరిశీలనలోకి తీసుకుంటే.. 2024 లో కోల్కతా జట్టును అతడు విజేతగా నిలిపాడు. 2014 తర్వాత కోల్కతా మళ్లీ ఛాంపియన్ అవడం వెనక అయ్యర్ కృషి అమోఘం. 2025లో పంజాబ్ జట్టు సారధి అయ్యాడు. ఆ జట్టును ఆ సీజన్లో ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. దీనికంటే ముందు 2020లో ఢిల్లీ జట్టును ఐపీఎల్లో ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. మూడు భిన్నమైన జట్లను ఐపీఎల్లో ఫైనల్ దాకా తీసుకెళ్లిన చరిత్ర అయ్యర్ కు ఉంది.
సారధిగా మాత్రమే కాదు ఆటగాడిగా కూడా అతడు స్థిరమైన ప్రదర్శన చేస్తున్నాడు. గత ఐపిఎల్ సీజన్లో 17 మ్యాచులు ఆడి 604 పరుగులు చేశాడు. ఈ సీజన్లో 14 మ్యాచ్లలో 498 పరుగులు చేశాడు. ఇక జాతీయ జట్టులో అయ్యర్ స్థిరంగా స్థానాన్ని కొనసాగించలేకపోయాడు. గాయాల వల్ల ఇబ్బంది పడ్డాడు. టెస్ట్.. టి20 లలో ఆడినప్పటికీ తన స్థాయి ప్రదర్శన చేయలేకపోయాడు. అయితే ఐపీఎల్ లో అయ్యర్ అద్భుతమైన ప్రదర్శన చేసిన తర్వాత అతడిని సారధిగా తీసుకోవాలని డిమాండ్లు పెరిగిపోయాయి.
అయ్యర్ తో అంతకుముందు ద్రావిడ్.. ఇప్పుడు గంభీర్ కు చెప్పుకునే స్థాయిలో సంబంధాలు లేకపోయినప్పటికీ.. అభిమానుల నుంచి డిమాండ్ రావడంతో.. మేనేజ్మెంట్ అతడికి కెప్టెన్సీ స్థానం కట్టబెట్టాల్సి వచ్చింది. వచ్చే ఐర్లాండ్.. ఇంగ్లాండ్ సిరీస్లలో టీమిండియాకు నాయకత్వం వహించబోతున్నాడు. ఆ సిరీస్లలో అతను చూపించిన ప్రదర్శన ఆధారంగానే.. కెప్టెన్సీ స్థానం ఆధారపడి ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
