IND Vs ENG: హిట్ మ్యాన్ బ్యాట్ విహారం.. సచిన్ తర్వాత రోహితే..

103 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ పాలూరి ఆటగాళ్ల రికార్డులు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనింగ్ బ్యాటర్ గా అత్యధిక సెంచరీలు సాధించిన మూడవ ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు.

Written By: Velishala Suresh, Updated On : March 8, 2024 2:24 pm

IND Vs ENG

Follow us on

IND Vs ENG: ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. ప్రస్తుతం 3 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (103), గిల్(110) పరుగులు చేసి భారత జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. వీరిద్దరూ కలిసి రెండవ వికెట్ కు 171 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇంగ్లాండ్ బౌలర్ల పై పూర్తిస్థాయిలో ఆధిపత్యాన్ని సాధించారు. ఫోర్లు, సిక్స్ లతో విరుచుకుపడ్డారు. వీరిద్దరి ధాటికి ఇంగ్లాండ్ బౌలర్లు నిస్సహాయస్థితిలోకి వెళ్లిపోయారు. 135/1 ఓవర్ నైట్ స్కోర్ తో శుక్రవారం ఆటను ప్రారంభించిన టీమిండియా దూకుడే లక్ష్యంగా బ్యాటింగ్ చేసింది. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసి 30 ఓవర్ లో 129 పరుగులు సాధించింది. లంచ్ విరామానికి ముందు భారత్ 264 పరుగులు చేసింది.

రికార్డులు బద్దలు

103 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ పాలూరి ఆటగాళ్ల రికార్డులు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనింగ్ బ్యాటర్ గా అత్యధిక సెంచరీలు సాధించిన మూడవ ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. ఓపెనింగ్ బ్యాటర్ గా రోహిత్ శర్మ 43 సెంచరీలు సాధించాడు. అతని కంటే ముందు డేవిడ్ వార్నర్ (49), సచిన్ టెండూల్కర్ (45), గేల్(42), సనత్ జై సూర్య (41), మాథ్యూ హెడెన్ (40) ఉన్నారు. ఈ సెంచరీ ద్వారా రోహిత్ అనేక రికార్డులు బద్దలు కొట్టాడు.. 2019 నుంచి టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఓపెనింగ్ బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు. 2019 నుంచి రోహిత్ శర్మ 9 సెంచరీలు చేయడం విశేషం. ఇంగ్లాండ్ జట్టుపై అత్యధిక సెంచరీలు సాధించిన ఓపెనింగ్ బ్యాటర్ గా సునీల్ గవాస్కర్ పేరిట రికార్డు ఉండేది. తాజా సెంచరీ తో రోహిత్ శర్మ సునీల్ గవాస్కర్ సరసన చేరాడు. ఇంగ్లాండ్ జట్టుపై వీరిద్దరూ నాలుగు సెంచరీలు చేయడం విశేషం.

అంతర్జాతీయ క్రికెట్లో..

ఈ సెంచరీ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు బాదిన భారత క్రికెటర్ల జాబితాలో రాహుల్ తో పాటు రోహిత్ శర్మ సమానంగా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ (100), విరాట్ కోహ్లీ (80), రాహుల్ ద్రావిడ్ (48), రోహిత్ శర్మ (48) టాప్ -4 కేటగిరిలో కొనసాగుతున్నారు.. ఇక 2021 నుంచి భారత జట్టు తరఫున అత్యధిక సెంచరీలు కొట్టిన ఆటగాడు రోహిత్ శర్మనే. ఆ తర్వాత స్థానంలో శుభ్ మన్ గిల్(4) ఉన్నాడు. కాగా, ప్రస్తుతం ఇండియా మూడు వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. 95 పరుగుల లీడ్ లో కొనసాగుతోంది.