Rohit vs Virat : భారత క్రికెట్ జట్టులో ఆటగాళ్ల మధ్య గొడవలు, విభేదాల వార్తలు తరచూ వార్తల్లో వస్తుంటాయి. కారణం ఏదైనా.. గొడవల కారణంగా కొంతమంది క్రికెటర్లు తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇది ఒక భారత జట్టుకే పరిమితం కాదు ప్రపంచంలో చాలా జట్లలో ఈ పరిస్థితి ఉంది. కానీ, భారత జట్టులో కాస్త ఎక్కువ. ప్రస్తుత జట్టులో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి. రోహిత్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. విరాట్ కీలక సభ్యుడిగా జట్టులో కొనసాగుతున్నాడు. చాలా మ్యాచ్ల్లో వీరిద్దరూ తమ ప్రదర్శనలతో భారత జట్టుకు అద్భుత విజయాలను అందించారు. అయితే 2019 వన్డే ప్రపంచకప్ అనంతంరం వీరిమధ్య విభేదాలు ఏర్పడ్డాయని అప్పటిలో వార్తలు వచ్చాయి. డ్రెసింగ్ రూంలో ఆటగాళ్లు రెండు వర్గాలగా విడిపోయారని.. రోహిత్ గ్రూప్, విరాట్ గ్రూప్ ఉన్నయాని ప్రచారం జరిగింది. దీనిని తాజాగా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ ధ్రువీకరించాడు. నాడు కోహ్లి, రోహిత్ మధ్య మనస్పర్థలు వచ్చిన మాట జమేనని శ్రీధర్ స్పష్టం చేశాడు. అయితే అప్పటి హెడ్ కోచ్ రవిశాస్త్రి జోక్యం చేసుకోవడంతో సమస్య పరిష్కరమైందని శ్రీధర్ తన ఆటోబయోగ్రఫీలో రాసుకొచ్చాడు.
నాడు జట్టులో గందరగోళం..
‘2019 వన్డే ప్రపంచ కప్ సమయంలో భారత జట్టులో కాస్త గందరగోళం నెలకొంది. భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం గురించి పెద్దు ఎత్తున చర్చ జరిగింది. అప్పటికే మేము సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలై ఉన్నాం. అటువంటి సమయంలో విరాట్, రోహిత్ మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్త మమ్మల్ని మరింత కలవరపెట్టింది. డ్రెస్సింగ్ రూమ్లో రోహిత్ క్యాంప్, విరాట్ క్యాంప్ ఉన్నాయని మాకు తెలిసింది’ అని పేర్కొన్నాడు.
అన్ఫాలో చేసుకున్నారు..
ఒకవైపు సీనియర్ క్రికెటర్ల మధ్య విభేదాలపై వార్తలు వస్తుండగానే వాటిని కఫర్మ్ చేసేలా రోహిత్, కోహ్లి వ్యవహరించారని శ్రీధర్ పేర్కొన్నాడు. ‘సోషల్ మీడియాలో రోహిత్, కోహ్లి ఒకరిని మరొకరు అన్ ఫాలో చేసుకున్నారు. ప్రపంచకప్ ముగిసిన 10 రోజుల తర్వాత మేమే వెస్టిండీస్తో టీ20 సిరీస్ కోసం యునైటెడ్ స్టేట్స్కి వెళ్లాం. అక్కడికి వెళ్లిన వెంటనే రవిశాస్త్రి కోహ్లి, రోహిత్ను తన గదికి పిలిచాడు. భారత క్రికెట్ ఆరోగ్యం ఉండాలంటే.. ఇద్దరి మధ్య విభేదాలను తుడిచిపెట్టేయాలని సూచించాడు. వారిద్దరికి రవి నచ్చచెప్పాడు’ అని తెలపాడు.
విభేదాలు జట్టుకు మంచిది కాదని..
సీనియర్ క్రికెటర్ల మధ్య విభేదాలు జట్టుపై ప్రభావం చూపుతాయని భావించిన కోచ్ రవిశాస్త్రి ఇద్దరినీ చాలావరకు కన్వెన్స్ చేశారని శ్రీధర్ తెలిపాడు. ‘మీరిద్దరూ చాలా సీనియర్ క్రికెటర్లు కాబట్టి ఇటువంటి మనస్పర్థలు మీ మధ్య ఉండకూడదు అని రవి చెప్పాడు. ఇవన్నీ విడిచిపెట్టి జట్టును ముందుకు నడిపించండి’ అని రోహిత్, విరాట్కు కోర్ రవిశాస్త్రి సలహా ఇచ్చినట్లు శ్రీధర్ తన ఆటోబయోగ్రఫీ ‘కోచింగ్ బియాండ్– మై డేస్ విత్ ది ఇండియన్ క్రికెట్ టీమ్’లో రాసుకొచ్చాడు.
మొత్తంగా విభేదాలు సమసిపోయాయి. ప్రస్తుతం భారత జట్టులో అందరూ కలిసి కట్టుగా ఉన్నారు. ఈ సమయంలో శ్రీధర్ ఆటోబయోగ్రఫీలో రాసుకున్న విషయాలు బయటకు రావడం క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ కారణంగా క్రికెటర్ల మధ్య మళ్లీ విభేదాలు తలెత్తొద్దని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.