Rishabh Pant : గబ్బా మైదానంలో ఏం చేశాడో.. రోహిత్ చెప్పేదాకా  అర్థం కాలేదట.. ఆసక్తికర విషయాన్ని పంచుకున్న రిషబ్ పంత్..

రిషబ్ పంత్.. టీమిండియా యువ వికెట్ కీపర్.. చావు నోట్లో తలపెట్టి.. సుదీర్ఘకాలం అనారోగ్యంతో పోరాడి.. చివరికి మైదానంలోకి అడుగుపెట్టాడు. గత ఐపిఎల్ లో ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహించి.. తనలో ఉన్న సరికొత్త ఆటను ప్రదర్శించాడు. టి20 వరల్డ్ కప్, శ్రీలంక సిరీస్, బంగ్లాదేశ్ సిరీస్ లో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : October 16, 2024 8:47 pm

Rishabh Pant

Follow us on

Rishabh Pant :  రిషబ్ పంత్ వైవిధ్యంగా కీపింగ్ చేస్తూ అలరిస్తున్నాడు. అతని బ్యాటింగ్ సరికొత్తగా కనిపిస్తోంది. ఇటీవల టీమిండియా సాధించిన విజయాలలో రిషబ్ తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా ఆడుతున్న న్యూజిలాండ్ సిరీస్ కు పంత్ ఎంపికయ్యాడు. న్యూజిలాండ్ సిరీస్ తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికా తో టి20 సిరీస్ ఆడుతుంది. అనంతరం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంది. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 2021 -22 కాలంలో గబ్బా మైదానంలో తాను ఆడిన ఆటను రిషబ్ గుర్తు చేసుకున్నాడు. గబ్బా టెస్టులో తను ఆడిన ఇన్నింగ్స్ ను పంత్ ఒక మధుర జ్ఞాపకంగా పేర్కొన్నాడు.. ఓ ఆంగ్ల మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు ఈ విషయాన్ని వెల్లడించాడు..” జట్టు గెలుపు కోసం శ్రమించానని అనుకున్నాను. కానీ రోహిత్ వచ్చి చెప్పేంతవరకు నేను ఏం చేశాను నాకు తెలియ రాలేదు. అసలు దాని గురించి ఏం మాట్లాడాలో నాకు ఇప్పటికీ తెలియదు. నేను నా వంతుగా ఉత్తమమైన ఆట తీరు ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు నేను ఆడిన ఇన్నింగ్స్ లలో కొన్ని జీవితాంతం గుర్తుపెట్టుకునేవి ఉన్నాయి. వాటిలో గబ్బా టెస్ట్ కూడా ఒకటి.. ఆ సమయంలో అది చాలా ముఖ్యమైంది. అయితే అది అంత ముఖ్యమైనదని నాకు తెలియదు. రోహిత్ వచ్చి.. నువ్వు ఏం చేశావో నీకు తెలియదని నాతో అన్నాడు. దానికి నేను ఏం చేశాను? విజయమే లక్ష్యంగా ఆడానని చెప్పాను. దానికి నువ్వేం చేసావో తర్వాత తెలుస్తుందని రోహిత్ అన్నాడు. కానీ అనంతరం ప్రజలు గబ్బా మైదానంలో నేను ఆడిన ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకోవడం వింటే ఆశ్చర్యంగా అనిపించింది. ఆ తర్వాత రోహిత్ ఎందుకు ఆ మాటలు అన్నాడు తర్వాత అర్థమైంది. అతని మాటల వెనుక ఉన్న అంతరార్థం నాకు తెలిసి వచ్చిందని” పంత్ వ్యాఖ్యానించాడు.
అజేయంగా 89 పరుగులు 
2021 లో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ నిమిత్తం టీమిండియా ఆస్ట్రేలియా వెళ్ళింది.. జనవరి నెలలో ప్రతిష్టాత్మకమైన గబ్బా మైదానంలో టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో రెండవ ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ అజయంగా 89 పరుగులు చేశాడు. అతడి వీరోచిత ఇన్నింగ్స్ వల్ల టీమిండియా ఆస్ట్రేలియాపై మూడు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని దక్కించుకుంది. 32 సంవత్సరాలుగా గబ్బా మైదానంపై ఓటమనేది లేకుండా ఆస్ట్రేలియా దూసుకుపోయింది. దానికి పంత్ అడ్డు తగిలాడు. అంతేకాదు సిరీస్ 2- 1 తేడాతో భారత్ సొంతం చేసుకునేలాగా తనదైన ఆట తీరు ప్రదర్శించాడు. ఇక దాదాపు మూడు సంవత్సరాలు అనంతరం భారత జట్టు బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ కోసం వచ్చే నెల ఆస్ట్రేలియా వెళ్ళనుంది. గత రెండు సీజన్లలో ఆస్ట్రేలియా జట్టును ఓడించి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని దక్కించుకుంది. ఈసారి కూడా అదే స్థాయిలో విజయం సాధించి హ్యాట్రిక్ దక్కించుకోవాలని టీమిండియా భావిస్తోంది.