BCCI : ఈ స్థాయిలో ఆదాయం వస్తున్న తర్వాత.. మిగతా దేశాలు బీసీసీఐ ని చూసి వాత పెట్టుకోవడంలో తప్పులేదు..

 బంగ్లాదేశ్ లో ఇటీవల క్రికెట్ లీగ్ నిర్వహించారు. పొరుగున ఉన్న పాకిస్తాన్ లోనూ క్రికెట్ లీగ్ జరిపారు. ఆస్ట్రేలియా నుంచి మొదలు పెడితే జింబాబ్వే వరకు ఇదే తంతు.

Written By: Anabothula Bhaskar, Updated On : August 21, 2024 12:37 pm

BCCI

Follow us on

BCCI : క్రికెట్ ఇంగ్లాండ్ లో పుట్టినప్పటికీ.. అ క్రీడకు కమర్షియల్ సొబగులు అద్దింది బీసీసీఐ. 2008లో ఐపిఎల్ కు శ్రీకారం చుట్టిన బీసీసీఐ.. ఆ క్రికెట్ లీగ్ ను ఫుట్ బాల్ టోర్నీలకు మించి డబ్బు వచ్చేలా చేసింది. మనదేశంలో ఆటగాళ్లకు మాత్రమే కాకుండా.. విదేశీ జట్ల ఆటగాళ్లకు కూడా డబ్బులు వచ్చేలా చేసింది. క్రికెట్ ను పూర్తిగా కమర్షియల్ క్రీడగా మార్చేసింది. ఫలితంగా క్రికెటర్లు అవకాశాలతో పాటు, భారీగా వెనకేసుకోవడం మొదలుపెట్టారు. ఐపీఎల్ లో రాణించిన భారత క్రికెటర్లు ప్రస్తుతం టీమిండియాలో సులువుగా స్థానం సంపాదిస్తున్నారు. అంతేకాదు తమ ఆట తీరుతో ఓవర్ నైట్ స్టార్ లుగా అవతరిస్తున్నారు. అటు ఆటకు ఆట, ఇటు డబ్బుకు డబ్బు సంపాదిస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఆటగాళ్లు మాత్రమే కాకుండా.. ఐపీఎల్ నిర్వహిస్తున్న బీసీసీఐ కూడా అత్యంత ఖరీదైన క్రికెట్ బోర్డుగా అవతరించింది. ఏకంగా ప్రపంచ క్రికెట్ ను శాసించే స్థాయికి ఎదిగింది. అందుకే బిసిసిఐ నిర్వహిస్తున్న ఐపీఎల్ ను చూసి ఇతర దేశాలు క్రికెట్ లీగ్ లు నిర్వహిస్తున్నాయి. అయినప్పటికీ ఐపీఎల్ స్థాయిలో పేరు సంపాదించుకోలేకపోతున్నాయి. ఈ ఐపీఎల్ ద్వారా ప్రతి సీజన్ లోనూ బీసీసీఐ అంతకంతకూ ఆదాయాన్ని పెంచుకుంటుంది. ఇటీవల టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఏకంగా 100 కోట్లకు పైగా ప్రైజ్ మనీని టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ ప్రకటించింది అంటే దానికి ప్రధాన కారణం.. భారీగా సమకూరుతున్న ఆదాయమే.

భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా విపరీతమైన ఆదాయాన్ని సంపాదిస్తోంది. 2023 లో నిర్వహించిన ఐపిఎల్ సీజన్లో బీసీసీఐ ఏకంగా 510 కోట్ల మిగులు లాభాలను ఆర్జించింది. అంతకుముందు అంటే 2022 ఎడిషన్ తో పోల్చితే ఇది 116% శాతం ఎక్కువ. ఆ సంవత్సరం కోవిడ్ ఉన్నప్పటికీ బీసీసీఐ ఐపీఎల్ నిర్వహించింది. ఐపీఎల్ 2023 నుంచి బీసీసీఐకి మొత్తం ఆదాయం 11,769 కోట్లు వచ్చింది. బీసీసీఐ ఆర్థిక విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం 2022 -23 వార్షిక నివేదికలో బోర్డు గేయం 66% పెరిగింది. ఇది మొత్తం 6,648 కోట్లకు చేరుకుంది. ఐపీఎల్ మాత్రమే కాకుండా ఇతర టోర్నీల ద్వారా, ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐ భారీగా సంపాదిస్తోంది. ఇదే సమయంలో దేశంలో క్రికెట్ విస్తరణకు మరింత కృషి చేస్తోంది. అధునాతన స్థాయిలో క్రీడామైదానాలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. హైదరాబాదు శివారు ప్రాంతంలో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో క్రీడా మైదానాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా ప్రకటించారు. ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాధ్యులు భూ సేకరణకు సంబంధించి ఒక డ్రాఫ్ట్ రూపొందించారు. దానిని త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామని ప్రకటించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడా పాలసీ రూపొందించడంతో.. తమకు అనుమతులు త్వరలోనే లభిస్తాయని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు.