Pakistan Vs Sri Lanka: వన్డే వరల్డ్‌ కప్‌ – 2023 : పాక్‌ క్రికెటర్లు తొండాట.. బౌండరీ లైన్‌ మార్చేశారా? వీడియో వైరల్‌

ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ తన రెండో మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక పాక్‌ బౌలర్లను చిత్తు చేసి 344 పరుగుల భారీ స్కోరు చేసింది. కుశాల్‌ మెండిస్‌ కేవలం 77 బంతుల్లో 122 పరుగులతో మెరుపు సెంచరీతో విజృంభించాడు.

Written By: Raj Shekar, Updated On : October 11, 2023 4:38 pm

Pakistan Vs Sri Lanka

Follow us on

Pakistan Vs Sri Lanka: వరల్డ్‌ కప్‌ ప్రారంభానికి ముందు పాకిస్తాన్‌ క్రికెట్‌ టీమ్‌ వార్తల్లో నిలిచింది. ఆసియా కప్‌లో ఘోర పరాజయం.. అలాగే ప్రపంచకప్‌ వార్మప్‌ మ్యాచ్‌లు రెండింటిలోనూ 300కు పైగా పరుగులు చేసినా పరాజయం కావడంతో ఆ జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక మెగా టోర్నీ క్రికెట్‌ ఆరంభంలో పాక్‌ క్రికెట్‌ జట్టు ఆటతీరు చాలా మందిని విస్మయ పరిచింది. నెదర్లాండ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో తృటిలో ఓటమి నుంచి తప్పించుకుంది. వీటన్నింటి మధ్య దాయాది దేశం జట్టు ఇప్పుడు కొత్త వివాదంతో మరోసారి వార్తల్లో నిలిచింది

పాక్‌ బౌలర్లను చిత్తు చేసిన శ్రీలంక..
ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ తన రెండో మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక పాక్‌ బౌలర్లను చిత్తు చేసి 344 పరుగుల భారీ స్కోరు చేసింది. కుశాల్‌ మెండిస్‌ కేవలం 77 బంతుల్లో 122 పరుగులతో మెరుపు సెంచరీతో విజృంభించాడు. అతనితోపాటు సదీర సమరవిక్రమ కూడా సెంచరీ బాదేశాడు. మెండిస్‌ కేవలం 65 బంతుల్లోనే సెంచరీ చేయడం గమనార్హం. అతను క్రీజులో ఉన్నంత సేపు పాక్‌ బౌలర్లు చేతులెత్తేశారు.

బౌండరీలైన్‌ వద్ద చీటింగ్‌..
అయితే లంక ఇన్నింగ్స్‌ 29వ ఓవర్లో హసన్‌ అలీ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడిన మెండిస్‌ డీప్‌ మిడ్‌ వికెట్‌ బౌండరీ లైన్‌ దగ్గర క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఇమామ్‌ ఉల్‌ హక్‌ ఈ క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే ఇమామ్‌ బంతిని క్యాచ్‌ పట్టుకుని కింద పడిపోయాడు. అయితే ఇక్కడ ఇమామ్‌ బౌండరీ లైన్‌ గుర్తును తాకడం స్పష్టంగా కనిపించింది. కాబట్టి ఎవరో బౌండరీ లైన్‌ను వెనక్కి నెట్టినట్లు అనిపించింది. ఆ తర్వాత ఇమామ్‌ క్యాచ్‌కి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫీల్డింగ్‌లో పాకిస్తాన్‌ జట్టు మోసం చేస్తోందని పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు.

నెదర్లాండ్స్‌ మ్యాచ్‌ లోనూ..
శ్రీలంకతో మ్యాచ్‌లోనే కాదు నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పాక్‌ ఫీల్డర్లు ఇదే మోసానికి పాల్పడినట్లు నెటిజన్లు చెబుతున్నారు. ఈ మ్యాచ్‌కు ముందు హైదరాబాద్‌లో పాకిస్థాన్, నెదర్లాండ్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్‌లోనూ ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి. ఆ మ్యాచ్‌కి సంబంధించిన ఫొటోలు కూడా వైరల్‌గా మారాయి. ఐసీసీ నిబంధనలకు లోబడి పాకిస్తాన్‌ ఆటగాళ్లు ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారా లేక గ్రౌండ్‌ స్టాఫ్‌ బౌండరీ లైన్‌ను వెనక్కి తరలించారా అనేది విషయంలో ఐసీసీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.