Homeక్రీడలుIPL 2024: వాళ్లకు ఆడడం రావడం లేదు.. ఆర్సీబీ ని అమ్మి పారేయండి.. దరిద్రం పోతుంది.....

IPL 2024: వాళ్లకు ఆడడం రావడం లేదు.. ఆర్సీబీ ని అమ్మి పారేయండి.. దరిద్రం పోతుంది.. లెజెండరీ ఆటగాడి ధ్వజం

IPL 2024: ఐపీఎల్ 17వ సీజన్లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు అత్యంత చెత్త ఆట తీరు ప్రదర్శిస్తోంది. ఇప్పటివరకు ఒక్క విజయాన్ని మాత్రమే నమోదు చేసి పాయింట్లు పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. వరుసగా వైఫల్యాలు ఎదురవుతున్నప్పటికీ బెంగళూరు ఆటగాళ్లు పాఠాలు నేర్చుకోవడం లేదు. బౌలింగ్ నాసిరకంగా ఉంది. ఫీల్డింగ్ దరిద్రంగా ఉంది. బ్యాటింగ్ పరవాలేదు అనుకుంటే.. ముగ్గురు, నలుగురు మాత్రమే బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నారు. మిగతావారు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు. కోట్లకు కోట్లు ఫీజు తీసుకుంటూ.. ఆటగాళ్లు ఇలా ఆడుతుండడం పట్ల బెంగళూరు అభిమానులు పట్టరాని కోపంతో ఊగిపోతున్నారు. ఆటగాళ్ల తీరు పట్ల తీవ్ర విమర్శలు చేస్తున్నారు. హైదరాబాద్ జట్టు చేతిలో సోమవారం బెంగళూరు ఓడిపోయిన నేపథ్యంలో అభిమానులు మరింత కోపంతో ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా ఆటగాళ్ల తీరును ఏకిపారేస్తున్నారు.

అయితే బెంగళూరు ఆట తీరు పట్ల అభిమానులే కాదు, లెజెండరీ ఆటగాడు కూడా స్పందించాడు. టెన్నిస్ ఆటగాడు, ఇండియన్ దిగ్గజం మహేష్ భూపతి ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించాడు. బెంగళూరు ఆట తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేష్ భూపతి కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాడే. అయితే తన సొంత రాష్ట్రానికి చెందిన ఐపిఎల్ జట్టు అధ్వాన్నంగా ఆడుతుండడాన్ని అతడు తట్టుకోలేకపోతున్నాడు. అందుకే ఆ జట్టు ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసహనాన్ని ప్రదర్శించాడు. బెంగళూరు ఆటగాళ్ల ప్రదర్శన అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోందని వ్యాఖ్యానించాడు. ఇలాంటి చెత్త ఆటతో సీజన్ చివరి వరకు కొనసాగలుగుతారా అంటూ చురకలు అంటించాడు. బెంగళూరు జట్టులో సమూల మార్పులు చోటు చేసుకోవాలంటే.. ఆర్సీబీ ని కొత్త యాజమాన్యానికి అమ్మాలని మహేష్ భూపతి బీసీసీఐకి సూచించాడు. క్రీడాభిమానుల కోసం బీసీసీఐ ఈ పని చేయాలని కోరాడు. కొత్త మేనేజ్మెంట్ చేతుల్లోకి వెళితే జట్టు స్వరూపం మారిపోతుందని.. అప్పుడు ఆటగాళ్ల కూర్పుపై సరైన శ్రద్ధ వహిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఐపీఎల్ లో మిగతా జట్లు చూపిస్తున్న పోటీ తత్వాన్ని అప్పుడు బెంగళూరు ప్రదర్శించగలుగుతుందని అతడు పేర్కొన్నాడు. కాగా, మహేష్ భూపతి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

కాగా, ఈ ఐపిఎల్ సీజన్లో బెంగళూరు జట్టు ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడిన బెంగళూరు కేవలం ఒక్కటంటే ఒక్కటే విజయాన్ని నమోదు చేసుకుంది. ప్లే ఆఫ్ చేరాలంటే బెంగళూరు కనీసం ఐదు మ్యాచ్లలో భారీ రన్ రేట్ తో గెలవాలి. గుజరాత్ టైటాన్స్ తో రెండు, హైదరాబాద్ తో ఒకటి, పంజాబ్ జట్టుతో ఒకటి, ఢిల్లీ తో ఒకటి, చెన్నై సూపర్ కింగ్స్ తో ఒక మ్యాచ్ బెంగళూరు జట్టు ఆడాల్సి ఉంది. అయితే ఈ జట్ల చేతిలో ఇప్పటికే బెంగళూరు ఓడిపోయి ఉంది.. మరి వచ్చే మ్యాచ్ లలో అయినా బెంగళూరు గెలుస్తుందా? ప్లే ఆఫ్ కు వెళ్తుందా? అనేది చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version